రుణాలకు అనూహ్య గిరాకీ, వడ్డీ రేట్లు మరింత పెరగొచ్చు

author img

By

Published : Aug 21, 2022, 7:20 AM IST

Updated : Aug 21, 2022, 11:54 AM IST

interest rates

రుణాలకు గిరాకీ పెరిగినందున వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉందని కరూర్‌ వైశ్యా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రమేష్‌ బాబు అన్నారు. వివిధ రంగాల నుంచి రుణాలకు డిమాండ్​ పెరగడమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ విషయాలను ఈనాడు- ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Karur Vysya Bank MD on Interest Rates: దాదాపు అన్ని విభాగాల్లో రుణాలకు అధిక గిరాకీ కనిపిస్తున్నందున, వడ్డీ రేట్లు ఒకటి-రెండేళ్లు పెరిగే అవకాశం ఉందని కరూర్‌ వైశ్యా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బి.రమేష్‌ బాబు అభిప్రాయపడ్డారు. 'కార్పొరేట్‌, రిటైల్‌, వ్యవసాయ రంగాల నుంచి రుణాలకు డిమాండ్‌ పెరిగింది. అవి మంజూరు చేయాలంటే, నిధుల కోసం బ్యాంకులు డిపాజిట్లు సేకరించాలి. అందువల్ల రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది’ అని విశదీకరించారు. డిజిటల్‌ టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగిస్తున్నందున రుణాల జారీ వేగవంతం కావడంతో పాటు వ్యయాలు తగ్గించుకోగలిగినట్లు' వివరించారు.

చాలాకాలం తర్వాత కరూర్‌ వైశ్యా బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ మార్పు ఎలా సాధ్యమైంది?
జూన్‌ త్రైమాసికానికి రూ.229 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాం. ఒక త్రైమాసికంలో ఇంత అధిక లాభాన్ని ప్రకటించడం బ్యాంకు చరిత్రలో ఇప్పుడే. గత ఆర్థిక సంవత్సరానికి రూ.673 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడమూ రికార్డే. గత రెండేళ్లలో అన్ని విభాగాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుని, స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగడంతో లాభాదాయాలు పెరిగాయి. డిజిటల్‌ టెక్నాలజీని అధికంగా వినియోగిస్తున్నందున వ్యయాలు తగ్గాయి. రుణాల జారీ వేగవంతమైంది. నష్టభయాన్ని అంచనా వేయడం మెరుగుపడింది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నియో, పీఎండీ విభాగాల వల్ల నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోగలిగాం. బకాయిల వసూళ్లకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో, నిరర్థక ఆస్తులు తగ్గాయి. ప్రభుత్వ వ్యాపారాన్ని చేపట్టడానికి ఇటీవల మాకు అనుమతి వచ్చింది. ఆదాయపు పన్ను, జీఎస్‌టీ ఇప్పుడు మా బ్యాంకు ద్వారా చెల్లించవచ్చు. విదేశీ వ్యాపారాన్ని నిర్వహించే వారి కోసం కొత్తగా కేవీబీ స్మార్ట్‌ ట్రేడ్‌- ఎగ్జిమ్‌ కరెంట్‌ అకౌంట్‌ సదుపాయాన్ని ప్రారంభించాం. ఇలా అన్నిరకాల ప్రయత్నాల వల్ల బ్యాంకు లాభాల బాట పట్టింది.

ఏ విభాగాల్లో అధిక వృద్ధి కనిపిస్తోంది?
ఏప్రిల్‌-జూన్‌లో వ్యవసాయం, వ్యాపార రుణాలు 16 శాతం పెరిగాయి. రిటైల్‌ రుణాలు 11 శాతం, కార్పొరేట్‌ రుణాలు 13 శాతం అధికంగా జారీ చేశాం. ఇదే తరహా వృద్ధి మున్ముందు కొనసాగుతుందని ఆశిస్తున్నాం. రిటైల్‌, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ (ఆర్‌ఏఎం) విభాగాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. రిటైల్‌లో బంగారం తనఖా రుణాలను అధికంగా జారీ చేస్తున్నాం. ఇతర బ్యాంకులతో కలిసి ‘కన్సార్షియం’గా కార్పొరేట్‌ రుణాలు ఇవ్వాలని నిశ్చయించాం. దీనివల్ల రిస్కు తగ్గుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలేమిటి?
రుణాలు- డిపాజిట్లలో 15 శాతం చొప్పున వృద్ధి సాధించాలని ఆశిస్తున్నాం. నికర నిరర్థక ఆస్తులు 1 శాతం కంటే మించరాదని, ఆర్‌ఓఏ (రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌), 1 శాతం కంటే ఎక్కువగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నికర వడ్డీ మిగులు (ఎన్‌ఐఎం) 3.75 శాతానికి తగ్గకుండా చూస్తాం.

నిరర్థక ఆస్తుల భారం తగ్గినట్లేనా?
బకాయిల వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రుణ ఖాతాలు కొత్తగా నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) మారకుండా జాగ్రత్త వహిస్తున్నాం. ఒక జీఎం స్థాయి అధికారి నేతృత్వంలో ‘రుణాల పర్యవేక్షణ- వసూళ్ల విభాగా’న్ని ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా రికవరీ శాఖలు ప్రారంభించాం. దీనివల్ల నిరర్థక ఆస్తులు తగ్గాయి. మొత్తం రుణాల్లో, పునర్‌వ్యవస్థీకరించిన రుణాల వాటా 2.56 శాతానికి పరిమితమైంది. జూన్‌ ఆఖరుకు నికర నిరర్థక ఆస్తులు 1.9 శాతానికి తగ్గాయి. దీన్ని ఆర్థిక సంవత్సరాంతానికి 1 శాతానికి పరిమితం చేయాలని అనుకుంటున్నాం.

కొత్త శాఖల ఏర్పాటు, ఉద్యోగ నియామకాల ప్రణాళికలు ఏమిటి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 21 శాఖలు ప్రారంభిస్తాం. ఉత్తరాది రాష్ట్రాల్లో మాకు శాఖలు లేని ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. నియామకాల విషయానికి వస్తే, డిజిటల్‌ టెక్నాలజీని బాగా అమలు చేసినందున బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిర్వహణకు తక్కువమంది సిబ్బంది సరిపోతున్నారు. అధిక వృద్ధి సాధన కోసం మార్కెటింగ్‌, విక్రయాల సిబ్బంది అవసరాలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా నియామకాలు చేపడతాం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్యాంకు కార్యకలాపాలు ఎలా ఉన్నాయి?
కరూర్‌ వైశ్యా బ్యాంకు మొత్తం శాఖల్లో దాదాపు నాలుగో వంతు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అన్ని ముఖ్య పట్టణాల్లో మా శాఖలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో రూ.26,000 కోట్లకు పైగా వ్యాపారాన్ని నమోదు చేశాం. 2020-21తో పోల్చితే ఇది 8 శాతం అధికం. రుణాల జారీ, డిపాజిట్ల సేకరణలో మెరుగైన వృద్ధి సాధిస్తున్నాయి.

వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందా?
వచ్చే ఒకటి- రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు పెరగొచ్చు. మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో రుణాలకు గిరాకీ అధికమైంది. అందువల్ల రుణాలపై వడ్డీరేట్లు పెరిగే అవకాశమే ఉంది. అధికంగా రుణాలు జారీకి వీలుగా బ్యాంకులు నిధులు ఎక్కువగా సమీకరించేందుకు, డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెంచాల్సిందే. రెపోరేటును ఆర్‌బీఐ 3 సార్లు పెంచింది కదా. అందువల్ల వడ్డీ రేట్లు కొంత పెరిగేందుకు అవకాశం ఉంది.

ఇవీ చదవండి: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు, ప్రజాభిప్రాయం కోరిన ఆర్‌బీఐ

క్రెడిట్​ స్కోరు తగ్గితే వడ్డీ భారం మోయాల్సిందేనా

Last Updated :Aug 21, 2022, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.