యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు, ప్రజాభిప్రాయం కోరిన ఆర్‌బీఐ

author img

By

Published : Aug 20, 2022, 8:57 AM IST

Charges On UPI Payment

ప్రస్తుత రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు, బ్యాంక్‌ ఖాతాలో నగదు ఉండి చేతిలో మొబైల్‌ ఉంటే చాలు. ధైర్యంగా దుకాణాలకు వెళ్లి యూపీఐ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బులు పంపి ఏం కావాలన్నా కొనుక్కుంటున్నాం. అయితే యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతోంది.

Charges On UPI Payment: ప్రస్తుతం జేబులో రూపాయి లేకపోయినా.. బ్యాంక్‌ ఖాతాలో నగదు ఉండి, చేతిలో మొబైల్‌ ఉంటే చాలు.. ధైర్యంగా దుకాణాలకు వెళ్లిపోతున్నాం. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి.. లేదా సంబంధిత వ్యాపారి ఫోన్‌ నెంబరు తీసుకుని, అతని మొబైల్‌కు నగదు బదిలీ చేసే వీలుండటమే ఇందుకు కారణం. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు రూపొందించిన యూపీఐ ఒక విప్లవంగానే చెప్పొచ్చు. సురక్షితంగా, అత్యంత సులభంగా, లావాదేవీ వ్యయం లేకుండా నగదును బదిలీ చేసుకునే వీలుండటం దీని బలం. కానీ, యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఉన్న అవకాశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరుతూ 'చెల్లింపుల వ్యవస్థల్లో ఛార్జీలు' అనే చర్చా పత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరుతోంది.

కార్డుల తరహాలో
సాధారణంగా క్రెడిట్‌ కార్డు లావాదేవీలు నిర్వహించినప్పుడు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) ఛార్జీలను విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు పంచుకుంటాయి. ఇదే విధంగా యూపీఐ లావాదేవీలపైనా ఎండీఆర్‌ తరహా ఛార్జీలను విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్థంగా సేవలను అందిస్తాయని ఆర్‌బీఐ భావిస్తోంది. ఎండీఆర్‌ తరహాలోనే లావాదేవీ మొత్తంపై నిర్ణీత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా? లేదా లావాదేవీకి స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అన్న విషయాన్నీ చర్చా పత్రంలో ప్రస్తావించింది.

ఇమ్మీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌)తోపాటు, డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) తదితరాలకూ ఛార్జీల ప్రతిపాదనను చేసింది. విధివిధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపైనా సూచనలివ్వాలని కోరుతోంది.

డిజిటల్‌ చెల్లింపులకు అవరోధం ఏర్పడకుండా..
డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించేందుకూ కంపెనీలకు కొంత ఖర్చు అవుతోంది. దీన్ని వ్యాపారులు లేదా వినియోగదారులు భరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గతంలోనే పేర్కొంది. ఇందుకు విధించే ఛార్జీల వల్ల డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు అవరోధం ఏర్పడకూడదనీ భావిస్తోంది. అందుకే డిజిటల్‌ చెల్లింపుల సేవలను వినియోగించే అందరి నుంచీ అభిప్రాయాలు సేకరించేందుకే చర్చాపత్రం తీసుకొచ్చిందని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

రోజుకు 21 కోట్ల లావాదేవీలు
యూపీఐ ఆధారిత చెల్లింపులు ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా జరుగుతున్నట్లు అంచనా. ఎన్‌పీసీఐ జులై గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం 338 బ్యాంకులు యూపీఐ లావాదేవీల్లో పాలుపంచుకున్నాయి. 628.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.10,62,991.76 కోట్లు. 2021 జులైలో లావాదేవీల సంఖ్య 324 కోట్లు కాగా, విలువ రూ.6,06,281.14 కోట్లే. అంటే ఏడాది వ్యవధిలో లావాదేవీల సంఖ్య రెట్టింపు కాగా.. విలువ రెట్టింపునకు కాస్త తక్కువగా ఉంది. 2021-22లో దాదాపు 4600 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ దాదాపు రూ.84.17లక్షల కోట్ల వరకూ ఉందని ఎన్‌పీసీఐ లెక్కలు చెబుతున్నాయి. 2020-21లో 2228 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ దాదాపు రూ.41.03 లక్షల కోట్లుగా ఉంది.

సగానికి పైగా రూ.200లోపే..
యూపీఐ ప్రధాన లక్ష్యం నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం. యూపీఐ లావాదేవీల్లో 50 శాతం వరకు రూ.200లోపు మొత్తానివే ఉంటున్నాయి. టీ తాగి రూ.10 చెల్లించాలన్నా.. యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీ2పీ), వ్యక్తుల నుంచి వ్యాపారులకూ (పీ2ఎం) నగదు బదిలీకి ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలపై రుసుములు, దానిపై జీఎస్‌టీ విధిస్తే.. వినియోగదారులు మళ్లీ నగదు చెలామణికి మొగ్గు చూపుతారని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. చర్చా పత్రంపై ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి.. ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి: ఆరోగ్య బీమా పాలసీలు ఒకటికి మించి ఉంటే క్లెయిం చేసుకోవడం ఎలా

ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా, ఏం జరిగిందో తెలుసుకోండి మరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.