ETV Bharat / business

మాంద్యం భయాల మధ్య దేశీయ ఐటీ సంస్థల శుభవార్త! కానీ...

author img

By

Published : Oct 10, 2022, 7:43 AM IST

it companies quarterly results
మాంద్యం భయాల మధ్య దేశీయ ఐటీ సంస్థల శుభవార్త!

ఆర్థిక మాంద్యంపై అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొన్న వేళ.. దేశీయ కార్పొరేట్ సంస్థలు సోమవారం నుంచి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఐటీ కంపెనీలు స్థిరమైన ఆదాయ వృద్ధి నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. భవిష్యత్‌పై కంపెనీల యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలు, ఆర్డర్ల కొనసాగుదల కీలకం కానున్నాయి.

దేశీయ కార్పొరేట్‌ కంపెనీల సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్‌ సోమవారం ప్రారంభం కానుంది. నేడు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఫలితాలు ప్రకటించనుండగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో (బుధవారం), ఇన్ఫోసిస్‌, సైయెంట్‌, మైండ్‌ ట్రీ (గురువారం), ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (శనివారం) వెలువరించనున్నాయి. సమీక్షా త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీలు స్థిరమైన త్రైమాసిక ఆదాయ వృద్ధి నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌ గిరాకీపై కంపెనీల యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలు, ఆర్డర్ల కొనసాగుదల కీలకం కానున్నాయి.

అమెరికా, ఐరోపాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. రెండో త్రైమాసికం భారత ఐటీ కంపెనీలకు బలమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే గత త్రైమాసికాలతో పోలిస్తే లాభాలు తగ్గడం లేదా రాబోయే త్రైమాసికాల్లో నెమ్మదించొచ్చన్న అంచనాలను కంపెనీలు ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో అధిక గిరాకీతో బుల్లిష్‌ వైఖరి కనబరిచిన కంపెనీలు.. అంతర్జాతీయ మాంద్యం హెచ్చరికలతో అప్రమత్తత పాటిస్తున్నాయి.
అమెరికా కంపెనీలతో పాటు పలు దిగ్గజ టెక్‌ కంపెనీలు 2022లో ఉద్యోగాల కోతలు చేపట్టాయి. నియామకాల జోరుపైనా అనిశ్చితులు ప్రభావం చూపాయి. వ్యయాలకు సంబంధించి భారత కంపెనీలు ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్లనున్నాయో కీలకం కానుంది.

అంచనాలు ఇలా

  • భారత ఐటీ రంగానికి తిరుగులేదని పరిశ్రమ దిగ్గజం మోహన్‌దాస్‌ పాయ్‌ అంటున్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల, జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే గిరాకీ కొంచెం తగ్గినా, బలంగానే కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యయాల నియంత్రణలో భాగంగా విదేశీ కంపెనీలు ఉద్యోగాల కోతలు చేపడితే పొరుగు సేవలకు వెళతాయని, ఇది మనకు కలిసొస్తుందని అన్నారు.
  • రెండో త్రైమాసికంలో కంపెనీల వృద్ధి స్థిరంగా కొనసాగొచ్చని ఎంకే గ్లోబల్‌ అంచనా వేసింది. అగ్రగామి కంపెనీలు స్థిర మారకంలో 2.5- 4.5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేయొచ్చని, ద్వితీయ శ్రేణి కంపెనీలు 0.1- 5.3 శాతం వృద్ధి సాధించొచ్చని తెలిపింది.
  • మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 3.8 శాతంగా ఉండొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చెబుతోంది. ఆర్థిక అనిశ్చితి ఇబ్బందులు కలిగించొచ్చని వెల్లడించింది.
  • అగ్రగామి ఐటీ కంపెనీలు జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 2.4- 4 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని, మధ్య శ్రేణి కంపెనీల జోరు కొనసాగొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.