'బజాజ్' ఫ్యామిలీ కొత్త ఇల్లు​ రూ.252కోట్లు.. రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డ్ డీల్!

author img

By

Published : Mar 15, 2023, 5:55 PM IST

Updated : Mar 15, 2023, 6:15 PM IST

252-crore-triplex-house-in-mumbai-purchased-by-bazaj

ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్​ బజాజ్.. లోధా గ్రూప్ మధ్య భారీ లావాదేవీ జరిగింది. లోధా గ్రూప్​కు చెందిన ఓ ట్రిప్లెక్స్​ హౌస్​​ను​.. ఏకంగా రూ.252 కోట్లకు జజాజ్​ కొనుగోలు చేశారు. భారత్​లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్​గా మార్కెట్​వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ ట్రిప్లెక్స్​ హౌస్​​.. ఏకంగా రూ.252 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్​ ఆటో ఛైర్మన్, బజాజ్​ గ్రూప్​ ప్రమోటర్​-డైరెక్టర్​ అయిన నీరజ్​ బజాజ్.. ఈ ​ ట్రిప్లెక్స్​ హౌస్​​ కొనుగోలు చేశారు. 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన నివాసం.. దక్షిణ ముంబయిలోని వాల్కేశ్వర్‌లో ఇంకా నిర్మాణంలోనే ఉండటం గమనార్హం.

రియల్​ ఎస్టేట్​ మార్కెట్​ వర్గాల ప్రకారం నీరజ్​ బజాజ్​, మాక్రోటెక్ డెవలపర్లు(లోధా గ్రూప్​) మధ్య ఈ డీల్​ జరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన డీల్​గా మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. రాజ్​భవన్​కు దగ్గర్లోని వాల్కేశ్వర్​లో.. లోధా మలబార్ టవర్ నిర్మాణం జరుగుతోంది. పారిశ్రామికవేత్త బజాజ్​.. ఈ అపార్ట్​మెంట్​లో మూడు ఫ్లోర్​లు బుక్​ చేసుకున్నారు. అందుకు సంబంధించిన టోకెన్​ అమౌంట్​ సైతం చెల్లించారు. ఒక చదరపు మీటర్​కు రూ.1.4 లక్షలకు చొప్పున.. మొత్తం రూ.252 కోట్లకు ఈ డీల్​ కుదిరింది. భవనానికి బీఎమ్​సీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మిగతా సొమ్ము.. చెల్లించే విధంగా వీరి మధ్య ఒప్పందం జరిగింది.

మొత్తం 31 అంతస్తులతో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. 2026 జూన్​ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందని నిర్వహకులు చెబుతున్నారు. ఈ టవర్​లో బజాజ్..​ 29, 30, 31వ ఫ్లోర్​లను కొనుగోలు చేశారు. ఇందులో ఎనిమిది కార్లకు సరిపడా పార్కింగ్​ స్థలం కూడా ఉంటుంది. అదే విధంగా స్విమ్మింగ్ పూల్‌ కూడా ఈ ట్రిప్లెక్స్ హౌస్​లో ఉంటుంది. ప్రైవేట్ రూఫ్‌టాప్ టెర్రస్ సైతం అందుబాటులో ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు.

యూనిక్ భవనంలో ప్రస్తుతం నీరజ్​ బజాజ్​ నివాసం..
ప్రస్తుతం బజాజ్​ తన కుటుంబంతో కలిసి పెద్దర్ రోడ్‌లోని మౌంట్ యూనిక్ భవనంలో నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా జజాజ్..​ ఈ భవనంలోని పై రెండు అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం 50 ఏళ్లకు పైగా పాతది. లగ్జరీ టవర్లు అందించే సౌకర్యాలు ఈ భవనంలో లేవు.

నెల రోజుల్లోనే మరో కొత్త రికార్డ్..​
గత నెలలో వర్లీ లగ్జరీ టవర్‌లోని 30,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌.. రూ.240 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్​.. బికె గోయెంకాకు ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఖరీదైన డీల్‌గా ప్రచారం జరిగింది. ఇది జరిగిన నెలరోజుల్లోనే బజాజ్-లోధా గ్రూప్​ మధ్య జరిగిన డీల్​.. మరో కొత్త రికార్డ్​ను సృష్టించింది.

మార్చి నెలలో భారీగా విలాస భవనాల కొనుగోలు..
ఏప్రిల్​ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలుతో మూలధన లాభాలపై పన్నుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఏప్రిల్​ 1 తరువాత రూ.10 కోట్లు పైబడిన మూలధన లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టినా ప్రభుత్వం పన్నులు విధించనుంది. ఇప్పటికైతే ఈ నిబంధన అమలులో లేదు. కనుక మార్చి నెలలో భారీ స్థాయిలో లగ్జరీ నివాస భవనాలు అమ్ముడుపోతున్నాయి.

Last Updated :Mar 15, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.