ETV Bharat / business

బడ్జెట్​పైనే అందరి కళ్లు.. వివిధ రంగాలు ఆశిస్తున్నవేంటి?

author img

By

Published : Jan 31, 2022, 6:12 PM IST

BUDGET
వార్షిక బడ్జెట్​

Union budget 2022: కరోనా మహమ్మారితో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్​ మూడో దశ కొనసాగుతన్న ఈ సమయంలో పార్లమెంట్​లో మంగళవారం వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ బడ్జెట్​లో తమకు ఊరట కల్పిస్తారని అంతా ఆశగా చూస్తున్నారు. ఆయా రంగాలు కోరుతున్న అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

Union budget 2022: కరోనా మహమ్మారి ధాటికి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ మూడో దశ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన 4వ బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై అందరి కళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో కేటాయింపులపై వివిధ రంగాలు ఏం ఆశిస్తున్నాయనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

  • కొవిడ్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. అయితే వాటిలో అధికంగా ప్రభావానికి గురైన ఆతిథ్య రంగం రుణ మారటోరియం ఆశిస్తోంది. ఈ బడ్జెట్‌లో మారటోరియంతో పాటు ఈసీఎల్​డీఎస్​ పొడిగింపు, రుణ పునర్నిర్మాణానికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆతిథ్య రంగ పరిశ్రమ సమాఖ్య ఎఫ్​హెచ్​ఆర్​ఐఏ కోరుతోంది.
  • పన్ను రహిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మూడేళ్ల కాలానికి తగ్గిస్తే బాగుంటుందని బ్యాంకింగ్‌ రంగం కోరుతోంది. ఫలితంగా పన్ను ప్రయోజనం పొందేందుకు ఈ డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకొస్తారని బ్యాంకులు చెబుతున్నాయి.
  • ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్ను జీఎస్​టీని 18 శాతానికి తగ్గించడం ద్వారా ఈ విభాగానికి గిరాకీ పెంచాలని వాహన డీలర్ల అసోసియేషన్‌ ఫాడా కోరుతోంది.
  • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పీఎల్​ఐ పథకం కింద దేశంలో తయారైన ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా ఎగుమతుల విషయంలో అంతర్జాతీయంగా పోటీ లేకుండా చేయొచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌-ఐసియా చెబుతోంది.
  • క్రిప్టో కరెన్సీల కొనుగోలు/విక్రయాలపై TDS/TCS అమలయ్యేలా బడ్జెట్‌లో ప్రతిపాదించాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఒక పరిమితికి మించి జరిగే లావాదేవీలపై పన్ను విధించడానికి ఆ వివరాలు ఆదాయ పన్ను విభాగానికి చేరేలా చూడాలంటున్నారు. క్రిప్టో కరెన్సీల ఆదాయంపై 30 శాతం పన్ను శ్లాబు ఉండాలని కోరారు.
  • ఆర్థిక రంగ అంకురాల కోసం పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని ఫిన్‌టెక్‌ పరిశ్రమ కోరుతోంది. గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని చెబుతోంది.
  • పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం కల్పించే విధానాలపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఫార్మా పరిశ్రమ విన్నవిస్తోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని కోరుతోంది.
  • 80సి సెక్షన్‌లో పెట్టుబడుల పరిమితిని పెంచాలని, బీమా ప్రీమియం పరిమితిని లక్ష రూపాయల వరకు మినహాయించుకునేందుకు అవకాశం కల్పించాలని బీమా సంస్థలు కోరుతున్నాయి. అలాగే ఆరోగ్య పాలసీలపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరాయి.
  • ట్రేడింగ్‌ ప్రారంభించబోయే కొత్త మదుపర్లకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను ఎస్​టీటీని పూర్తిగా తొలగించాలని మార్కెట్‌ నిపుణులు కోరుతున్నారు.
  • గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు సహజ వాయువును జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావాలని సంబంధిత పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి.
  • స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో కనీసం 3 శాతం నిధుల్ని ఆర్యోగ సంరక్షణ రంగానికి కేటాయించేలా చూడాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే ప్రాధాన్య హోదా కల్పించాలని అభ్యర్థిస్తోంది.

ఈ అభ్యర్థనల్లో కేంద్ర ఎన్నింటిని నెరవేరుస్తుంది. వేటిని పక్కన పెడుతుంది అనే అంశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తేలనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.