స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ ఏకంగా 1,145 పాయింట్లు కోల్పోయి 49,744 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 306 పాయింట్ల నష్టంతో 14,675 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలను నమోదు చేయడం ఇది వరుసగా ఐదో సెషన్.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం వంటివి మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీనితో వారంతా అమ్మకాలపై దృష్టి సారించడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఐటీ, ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు కుదేలవ్వడం కూడా నష్టాలకు మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,986 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,723 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,010 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,667 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్లో లాభాలను గడించాయి.
టెక్ మహీంద్రా, ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో టోక్యో సూచీ మినహా.. షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి:ఎడాపెడా పెట్రో బాదుడు- చొరవ చూపేదెన్నడు?