ETV Bharat / business

ఒక్కసారిగా పెరిగిన డిమాండ్​తో రెమ్‌డెసివిర్‌కు కొరత‌

author img

By

Published : Apr 10, 2021, 5:24 AM IST

కొవిడ్​ చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఔషధానికి అనూహ్య గిరాకీ ఏర్పడింది. వ్యాధి తీవ్రత ఎక్కువై, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా వైద్యులు ఈ ఔషధాన్ని ఇస్తున్నారు. కరోనా కేసులు తగ్గిపోవడం, తదుపరి కొవిడ్‌ టీకా కూడా అందుబాటులోకి రావటంతో 'రెమ్‌డెసివిర్‌' అవసరం తగ్గిపోయింది. దీంతో ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధ తయారీని తగ్గించాయి. అందువల్లే మార్కెట్లో తగినంత నిల్వలు లేవు. ఒక్కసారిగా మళ్లీ ఉత్పత్తిని భారీఎత్తున పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

demand for Covid-19 drug remdesivir rising
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్- రెమ్‌డెసివిర్‌కు కొరత‌

కొవిడ్‌-19 రెండోదశలో కేసుల సంఖ్య రోజుకు లక్షకు పైగా నమోదవుతుండటం, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్యా పెరుగుతుండటంతో, ఈ చికిత్సలో వినియోగిస్తున్న 'రెమ్‌డెసివిర్‌' ఔషధానికి అనూహ్య గిరాకీ ఏర్పడింది. వ్యాధి తీవ్రత ఎక్కువై, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా వైద్యులు ఈ ఔషధాన్ని ఇస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన తొలి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఒక్కో డోసు చొప్పున... మొత్తం ఆరు డోసుల 'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని ఇవ్వడం వల్ల రోగి కోలుకునే పరిస్థితి వస్తుంది. మొదటి దశ కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గేవరకు ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఈ ఔషధంపై అధికంగా ఆధారపడ్డారు. నెమ్మదిగా కేసులు తగ్గిపోవడం, తదుపరి కొవిడ్‌ టీకా కూడా అందుబాటులోకి రావటంతో 'రెమ్‌డెసివిర్‌' అవసరం తగ్గిపోయింది. దీంతో ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధ తయారీని తగ్గించాయి. అందువల్లే మార్కెట్లో తగినంత నిల్వలు లేవు. ఒక్కసారిగా మళ్లీ ఉత్పత్తిని భారీఎత్తున పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పట్లో రూ.6000.. ఇప్పుడు రూ.1000

అమెరికా కంపెనీ అయిన గిలీడ్‌ సైన్సెస్‌కు చెందిన ఈ ఔషధాన్ని మనదేశంలో 5 ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెటిరో ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఉన్నాయి. ఇవే కాక సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, మైలాన్‌ ఇండియా కూడా ‘రెమ్‌డెసివిర్‌’ తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొవిడ్‌-19 వ్యాధి తీవ్రమై ఆస్పత్రుల్లో చేరిన వారికి ఉపశమనం కలిగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతించిన ఔషధం ఇదొక్కటే కావడం గమనార్హం. మనదేశంలో కూడా ఔషధ నియంత్రణ మండలి ‘అత్యవసర వినియోగం’ నిమిత్తం దీనికి అనుమతి ఇచ్చింది. తొలుత ఈ ఔషధాన్ని ఒక్కో డోసును రూ.6,000 ధరకు ఫార్మా కంపెనీలు విక్రయించాయి. అంటే 6 డోసుల చికిత్సకు రూ.36,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీలు రూ.1,000 ధరకే ఒక్కో డోసు ఇంజక్షన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాయి. ఒక వయల్‌ ధరను క్యాడిలా హెల్త్‌కేర్‌ రూ.899 కే తగ్గించింది. కానీ ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో, తగినన్ని అందుబాటులో లేక ‘బ్లాక్‌ మార్కెట్లో’ అధిక ధరకు ఈ ఔషధాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న ముంబయి, పుణె నగరాల నుంచి పలువురు ‘రెమ్‌డెసివిర్‌’ కోసం హైదరాబాద్‌లోని తమ సన్నిహితులు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా తగినంతగా సరఫరాలు అందుబాటులో లేకపోవటం గమనార్హం.

మళ్లీ ఇంత డిమాండ్‌ ఊహించలేదు

'డిమాండ్‌ తగ్గినందున ఫార్మా కంపెనీలు 'రెమ్‌డెసివిర్‌' ఔషధం తయారీని తగ్గించాయి. మళ్లీ ఒక్కసారిగా కొవిడ్‌-19 విస్తరించి, రెమ్‌డెసివిర్‌ కు గిరాకీ పెరుగుతుందని ఫార్మా కంపెనీలు అంచనా వేయలేదు' అని స్థానిక ఫార్మా రంగ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘రెమ్‌డెసివిర్‌’ తయారీ పనులు మళ్లీ ప్రారంభించారని, 10-15 రోజుల్లో సరఫరాలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. క్యాడిలా హెల్త్‌కేర్‌ రోజుకు 30,000 వయల్స్‌ ‘రెమ్‌డెసివిర్‌’ తయారు చేస్తోంది. ఈ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుండగా, మిగిలిన సంస్థలూ ఈ రకమైన ప్రయత్నాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా అప్రమత్తమై, ‘రెమ్‌డెసివిర్‌’ సరఫరాలపై దృష్టి సారించాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఫార్మా కంపెనీలను సంప్రదించి తయారీని అధికం చేయాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ మండలి వర్గాలు కూడా ఫార్మా కంపెనీలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

కొవాగ్జిన్‌ టీకా తయారీలో హాఫ్‌కైన్‌ బయోఫార్మా?

‘కొవాగ్జిన్‌’ టీకాను గిరాకీకి తగినట్లు సరఫరా చేసేందుకు అవసరమైన పరిష్కార మార్గాలు కనుగొనే పనిలో మహారాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ముంబయికి చెందిన హాఫ్‌కైన్‌ బయో-ఫార్మాస్యూటికల్స్‌ అనే కంపెనీ ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీకి ముందుకు వచ్చిందని, అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే తెలిపారు. ఈ కంపెనీకి దాదాపు 12 కోట్ల డోసుల టీకా తయారు చేసే సామర్థ్యం ఉంది. ‘కొవాగ్జిన్‌’ టీకాను ఆవిష్కరించిన భారత్‌ బయోటెక్‌ ఒక్కటే ప్రస్తుతం టీకా తయారీలో నిమగ్నమై ఉంది. కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో, టీకా ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే హాఫ్‌కైన్‌ బయో-ఫార్మాస్యూటికల్స్‌ ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వంతో పాటు భారత్‌ బయోటెక్‌ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.