ETV Bharat / bharat

'నన్ను చంపేయ్.. బతికొచ్చి నీ బాధలు తీరుస్తా'.. తాంత్రిక శక్తుల కోసం దారుణం

author img

By

Published : Dec 17, 2022, 3:49 PM IST

murder
murder

మరణించి తిరిగి వచ్చాక తనకొచ్చిన తాంత్రిక శక్తులతో జీవితాన్ని బాగు చేస్తానని ఓ స్నేహితుని మాట విన్న యువకుడు అతన్ని హత్య చేశాడు. మరోవైపు, నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అరవై ఏళ్ల బామ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

తాంత్రిక శక్తులతో భవిష్యత్తును మారుస్తానని స్నేహితుడి మాట విన్న ఓ వ్యక్తి అతన్ని హత్య చేసి కటకటాల పాలైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరిగింది. డిసెంబర్ 10న యమునా నగర్ ప్రాంతంలోని కార్చనలో మృతుడి ఆచూకీ లభ్యమైంది. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే...
పేద కుటుంబానికి చెందిన నితీశ్​ సైనీ తన భవిష్యత్ గురించి తరచూ ఆందోళన చెందేవాడు. అలా ఆరు నెలల క్రితం హరిద్వార్‌లోని హర్ కీ పౌరికు వెళ్లిన నితీశ్​కు.. ఆశిష్ దీక్షిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన బాధలన్నీంటిని ఆ వ్యక్తికి చెప్పాడు. తనకున్న తాంత్రిక శక్తులతో కష్టాలన్నీ తీరుస్తానని అతను హామీ ఇచ్చాడు. దీంతో ఆశిష్​ మాటలు విన్న నితీశ్​ అతనితో పాటు హరిద్వార్​లో నివాసం ఉండటం ప్రారంభించాడు.

అలా డిసెంబర్ 8న నితీశ్ సైనీ, ఆశిష్​లు హరిద్వార్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపటి తర్వాత తనని చంపమని నితీశ్​ను కోరాడు ఆశిష్​. తాను చనిపోయి తిరిగి వస్తానని.. అప్పుడు తనకొచ్చిన తాంత్రిక శక్తులతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తానని నితీశ్​ను నమ్మబలికాడు. ఆ మాటలు విని​ చంపేందుకు సిద్ధపడ్డ నితీశ్​.. అతని మెడపై కొట్టాడు. దీంతో ఆశిష్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితీశ్​ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను ప్రారంభించారు.

అరవై ఏళ్ల బామ్మపై దారుణం..
అరవై ఏళ్ల వృద్ధురాలిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలోని కటక్​లో జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ బామ్మ జరిగిందంతా ఇరుగు పొరుగు వారికి వివరించగా వారు పోలీస్​ స్టేషన్​లో బాధితురాలి తరఫున ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. కటక్​లోని బక్షి బజార్​ పెన్షన్​ లేన్​లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని టార్గెట్​ చేసిన ఓ వ్యక్తి.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ వృద్ధురాలు మూడు రోజుల తర్వాత తనపై జరిగిన అత్యాచారం గురించి పొరుగింటి వారితో చెప్పింది. దీంతో ఆమె తరఫున ఫిర్యాదు చేసేందుకు స్థానికులు పోలీస్​ స్టేషన్​ వెళ్లారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

మద్యం మత్తులో చిన్నారిని కిందకు తోసిన తండ్రి..
దిల్లీలోని కల్కాజీలో ముప్పై ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఇంటి మొదటి అంతస్తు నుంచి తన రెండేళ్ల కొడుకును కిందకు తోసేశాడు. ఆ తర్వాత తాను మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన వారిద్దరూ... ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. భార్యతో గొడవల కారణంగానే ఆ వ్యక్తి ఈ దారుణానికి యత్నించినట్లు తెలుస్తోంది. తరచూ తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. అందుకే ఆయన్ను వదిలేసి పిల్లలను తీసుకుని బంధువుల ఇంట్లో నివసిస్తున్నాని భార్య తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.