ఉత్తరాఖండ్​లో మోదీ ఇమేజ్​ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?

author img

By

Published : Jan 28, 2022, 5:31 PM IST

Will Modi's image regain power in Uttarakhand?

uttarakhand polls 2022 : ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా- ప్రతిపక్ష కాంగ్రెస్​ నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నాయి. రాష్ట్రంలో ద్విముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ముఖ్యమంత్రుల మార్పు ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది? ఉత్తరాఖండ్​లో ప్రధాని ఇమేజ్​ కాషాయ దళానికి అధికారాన్ని మరోసారి కట్టబెడుతుందా? రైతు ఉద్యమ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అసమ్మతిని భాజపా ఎలా అధిగమిస్తుంది?

uttarakhand polls 2022: దేవభూమి ఉత్తరాఖండ్​లో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడి అసెంబ్లీలో 70 శాసనసభ స్థానాలు ఉండగా.. అధికార భాజపా- ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. అధికారం నిలబెట్టుకోవాలని కమల దళం.. ఎంత కష్టమైనా పవర్​లోకి రావాలని హస్తం పార్టీ తహతహలాడుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్​లో భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి.. తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

దీనికి కారణాలు లేకపోలేదని అటు సర్వేలు, ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు, అపరిష్కృతంగా స్థానిక సమస్యలు ఈ ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

దీనికితోడు అసెంబ్లీ సీటు ఆశించి.. భంగపడ్డ నేతలు, తొలి జాబితాలో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యేలతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి తాజాగా పార్టీకి తలనొప్పిగా మారింది.

అయితే భాజపాకు ఎన్ని సమస్యలు ఎదురైనా.. ప్రధాని మోదీ ఛరిష్మా గట్టేక్కిస్తుందని రాష్ట్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. దీనికి గత ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు నేతలు.

2017 ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా..

2014, 2017, 2019 ఎన్నికల్లో మోదీ ఇమేజ్​తో భాజపా రాష్ట్రంలో సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 57 సీట్లను భాజపా సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రధాన వ్యూహంగా నాయకత్వం ముందుకు సాగుతోంది.

ఇందుకోసం రెండు నెలల కింద ప్రధాని మోదీతో ఎక్కువ సభలు నిర్వహించాలని రోడ్​మ్యాప్​ను కూడా నాయకత్వం సిద్ధం చేసింది. అందులో భాగంగానే డిసెంబర్​ 4, 30 తేదీల్లో మోదీతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష ప్రచారాలకు ఆస్కారం లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచార సభలు వాయిదా పడ్డాయి.

" వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా విజయం సాధిస్తుంది. ఉత్తరాఖండ్ కోసం ఆయన సుదీర్ఘ కాలం పని చేస్తారు.

-ప్రహ్లాద్‌ జోషి, ఉత్తరాఖండ్‌ భాజపా వ్యవహారాల బాధ్యుడు

bjp Dissent category

భగ్గుమంటున్న అసమ్మతి..

ఇటీవల 59 అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితాను సిద్ధం చేయగా.. అందులో 10 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. దీంతో అసమ్మతి భగ్గమంది. దీంతో ఎమ్మెల్యేలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్​ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించడం వల్ల.. పార్టీనే నమ్ముకున్న కొందరు నేతలు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

అసెంబ్లీ టికెట్​ ఆశించి భంగపడ్డ నాయకులు స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అసమ్మతి వర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు తరాలి ఎమ్మెల్యే మున్నీ దేవి షా, ద్వరాహత్​ ఎమ్మెల్యే మహేశ్​ నేగీ.

"నాకు టికెట్​ ఎందుకు ఇవ్వలేదో కేంద్ర నాయకత్వం చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. నా నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులు చేశా. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి నా స్థానం కేటాయిస్తే.. బాగుండేది, కానీ కాంగ్రెస్​ నేపథ్యం ఉన్న వ్యక్తిని బరిలోకి దించుతోంది."

- మున్నీ దేవి షా, తరాలి ఎమ్మెల్యే

స్వసంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారని దేవి షా చెప్పుకొచ్చారు.

కుట్రతోనే తనకు టికెట్​ కేటాయించలేదని ఎమ్మెల్యే నేగి అంటున్నారు. 2020 సెప్టెంబరు నుంచి ఎమ్మెల్యే నేగి అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్నారు. నరేంద్ర నగర్ స్థానంలో భాజపా మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను పోటీకి నిలపగా.. ఆయనకు పోటీగా పార్టీ కీలక నేత ఓం గోపాల్ రావత్ సిద్ధమవుతున్నారు. అయితే ఆయన కాంగ్రెస్​లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని యోచిస్తున్నారు.

ధనౌల్తీ స్థానంలో భాజపా మాజీ ఎమ్మెల్యే మహావీర్ రంగద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చాలా మంది సీనియర్లు, సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

గతంలో ఎన్నడూ లేని అసమ్మతిని పార్టీ.. ఇప్పుడు ఎదుర్కొంటోందని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల్లో ఆ అసమ్మతి ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యతిరేకత తాత్కాలికమే..

అయితే ఎన్నికల సమయంలో అసమ్మతి సహజమే అని చెబుతోంది భాజపా. మరికొద్ది రోజుల్లో దుమారం తగ్గుముఖం పడుతుందని అంటున్నారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్.

" ఒక స్థానం కోసం చాలా మంది పోటీదారులు ఉండటం సహజం. కానీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలి. భాజపా క్రమశిక్షణ కలిగిన పార్టీ. వాళ్లు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. "

-మదన్ కౌశిక్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు

ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పుతో ప్రభుత్వంలో అస్థిరత.. ఉద్యోగాల కల్పనలో పేలవమైన పనితీరు.. ప్రభుత్వ వ్యతిరేకత.. మైదాన ప్రాంతాల్లో రైతు ఉద్యమ ప్రభావం.. ఇలాంటి అనేక అంశాలు కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి కలిసొచ్చే అంశాలు.

మోదీ రంగంలోకి దిగితే.. ఇలాంటి ఆరోపణలు అన్నీ.. పటాపంచలు అవుతాయనే భావనలో భాజపా నాయకత్వం ఉంది.

ఇదీ చూడండి: Uttarakhand Election 2022: ఓటరు మౌనం.. పార్టీల్లో ఉత్కంఠ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.