ETV Bharat / bharat

ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!

author img

By

Published : Jun 25, 2021, 5:35 PM IST

జమ్ముకశ్మీర్​లోని అన్ని పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అనగానే దేశమంతా ఆసక్తిగా చూసింది. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశాలే ప్రధానంగా చర్చకు వస్తాయని భావించింది. అయితే.. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు ప్రధాని. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, అన్ని పార్టీలు సహకరించాలని కోరారు మోదీ. ఆ తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తేల్చిచెప్పారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కశ్మీర్​కు పూర్వవైభవం వస్తుందా? రాష్ట్రంలో ఈ డీలిమిటేషన్​ ఎందుకు వివాదాస్పదంగా మారింది? స్థానిక పార్టీల మాటేంటి?

delimitation exercise
జమ్ముకశ్మీర్​ నియోజకవర్గాల పునర్విభజన, జమ్ముకశ్మీర్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, jammu KASHMIR

జమ్ముకశ్మీర్​ అఖిలపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం.. అక్కడ మళ్లీ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకోవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. 2019 ఆగస్టులో.. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అయినప్పటినుంచి.. అక్కడి అధికారాలు కేంద్రం చేతుల్లోకి వచ్చాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మోదీ భేటీతో.. మళ్లీ రాజకీయ ఆట ఆరంభం అవుతుందని భావిస్తున్నారు.

జూన్​ 24న జరిగిన సమావేశంలో.. జమ్ముకశ్మీర్​ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. అయితే.. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్​) పూర్తయితేనే ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని ప్రధాని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియ కొన్ని నెలల్లో పూర్తయితే.. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

మరి అసలు మోదీ ప్రభుత్వం.. డీలిమిటేషన్​ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడానికి కారణం ఏంటి? అసలు నియోజకవర్గాల పునర్విభజన​ ఎందుకు? జమ్ముకశ్మీర్​లో కొన్నేళ్లుగా ఇది వివాదాస్పదంగా ఎందుకు మారింది? ఇప్పుడెంత వరకు వచ్చింది? అనేది తెలుసుకుందాం.

డీలిమిటేషన్​ అంటే..?

డీలిమిటేషన్​ అంటే నియోజకవర్గాల పునర్విభజన..

లోక్​సభ/అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులను గుర్తించడమే పునర్విభజన. ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లు ఉన్నారని నిర్ధరించడానికి కొన్నేళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. జనాభా సంఖ్యను బట్టి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. అంటే జనాభాకు అనుగుణంగా.. ఆ సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. దీనిని బట్టే ప్రజాప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది.

పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలు ఎప్పుడంటే అప్పుడు పెరగవు. మన దేశంలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. దీన్నే నియోజకవర్గాల పునర్విభజన అంటారు. దీనికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సలహా ప్రకారం నడుచుకుంటారు.

ఆ కమిషన్​ ఏర్పాటుతోనే?

ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గ పునర్విభజనకు చట్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 82వ అధికరణం పార్లమెంటుకు ఇస్తోంది. ఈ చట్టం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ఓ కమిషన్​ను ఏర్పాటు చేస్తుంది.

ఆ కమిషన్​ సిఫార్సులను మార్చేందుకు.. పార్లమెంటుకు కూడా అధికారం లేదు.

పునర్విభజన కమిషన్​లో ఎవరెవరు?

ఈ కమిషన్​లో ఒక ఛైర్మన్​(రిటైర్డ్​/ సిట్టింగ్​ సుప్రీంకోర్టు జడ్జి), చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ లేదా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, డీ లిమిటేషన్​ చేసే రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ సభ్యులుగా ఉంటారు. ఇంకా.. ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటు, శాసనసభ సభ్యులు ఐదుగురు చొప్పున ఉంటారు.

పునర్విభజన కమిషన్​ తాత్కాలికం కాబట్టి.. పూర్తి స్థాయి సిబ్బంది లేని కారణంగా డీలిమిటేషన్​ ప్రక్రియ కోసం ఇది ఎన్నికల కమిషన్​ ఉద్యోగులపై ఆధారపడుతుంది. ప్రతి జిల్లా, మండలం, గ్రామ పంచాయతీల జనాభా లెక్కల సమాచారం సేకరించి, కొత్త సరిహద్దులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఒక్కోసారి ఐదేళ్ల వరకు పట్టొచ్చు.

కశ్మీర్​లో వేరేలా ఎందుకు?

అధికరణ 370 కల్పించే ప్రత్యేక అధికారాల కారణంగా.. జమ్ముకశ్మీర్​లో పునర్విభజన ప్రక్రియ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది.

  • 2019లో జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదా కోల్పోయే ముందు వరకు లోక్​సభ స్థానాల్లో డీలిమిటేషన్ భారత రాజ్యాంగం పరిధిలో​.. అసెంబ్లీ సీట్లలో డీలిమిటేషన్​ జమ్ముకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం పరిధిలో ఉండేవి.
  • జమ్ముకశ్మీర్​లో మొదటిసారిగా 1952లో పునర్విభజన కమిషన్​ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. 1963, 73, 2002లోనూ ఈ కమిషన్​ ఏర్పాటైంది.

చివరగా కశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన 1995లో జరిగింది. అప్పుడు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. 2005లో తర్వాతి డీలిమిటేషన్​ జరగాల్సి ఉన్నా.. 2002లో అప్పటి ఫరూక్​ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు ఈ ప్రక్రియ అవసరం లేదని జమ్ముకశ్మీర్​ ప్రజా ప్రాతినిధ్య చట్టం-1957 ప్రకారం నిర్ణయించింది.

జమ్ముకశ్మీర్​లో ఎందుకు వివాదాస్పదంగా మారింది?

ఎన్నో ఏళ్లుగా జమ్ముకశ్మీర్​లో మాత్రం డీలిమిటేషన్​ ప్రక్రియ.. రాజకీయంగా వివాదాస్పదమైంది. కారణం.. కశ్మీర్​లో ముస్లింలు, జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉండటమే.

రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో జమ్మూకు అధిక ప్రాధాన్యం దక్కాలని భాజపా సహా పలు రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. 2002లో ఫరూక్ అబ్దుల్లా​ ప్రభుత్వం చర్యతో.. జమ్మూకు ప్రాధాన్యం తగ్గిందని ఆరోపించాయి.

జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టం-2019 ప్రకారం.. అక్కడ 90 అసెంబ్లీ స్థానాలుండాలి. ఆ లెక్కన గతంలో కంటే ఏడు సీట్లు ఎక్కువ ఉండాలి. లద్దాఖ్​లోని 4 సీట్లు కలుపుకొని.. 2019 వరకు అక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. ఇందులో కశ్మీర్​లో 46, జమ్మూలో 37 ఉన్నాయి.

ఆందోళన ఎందుకు?

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనను పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా కశ్మీర్‌ లోయకు చెందిన పలు పార్టీలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయి. హిందువులు అధికంగా ఉండే జమ్మూలో వాటి సంఖ్యను పెంచుతారనే అనుమానమే అందుకు కారణం. ఫలితంగా.. కశ్మీర్​కు ప్రాధాన్యం తగ్గి.. ఎన్నికల్లో తమ విజయావకాశాలు దెబ్బతింటాయని భావించాయి ఆయా పార్టీలు.

కానీ.. ఇప్పుడు మోదీతో సమావేశం అనంతరం ఆయా పార్టీల వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. పునర్విభజన తర్వాతా.. రాష్ట్ర అసెంబ్లీలో కశ్మీర్​ లోయ ఆధిక్యమే కొనసాగుతుందని తెలిశాక ఆయా పార్టీల ధోరణిలో మార్పు వచ్చినట్లు సమాచారం.

ప్రక్రియ సంక్లిష్టం

మోదీతో అఖిలపక్ష సమావేశం అంతా సజావుగానే సాగినా.. నేషనల్​ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్​ అబ్దుల్లా డీలిమిటేషన్​ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్​డీఏ ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ ప్రాంతీయ రాజకీయ పార్టీల మధ్య ఇది వివాదంగా మారుతుందని, ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశమంతా 2026లో డీలిమిటేషన్​ ప్రక్రియ జరుగుతుంటే.. జమ్ముకశ్మీర్​లో మాత్రం ఎన్నికల ముందు ఎందుకన్నది అబ్దుల్లా ప్రశ్న.

కశ్మీర్​లో పునర్విభజన కమిషన్​ ప్రస్తుత స్థితి ఏంటి?

2019లో ప్ర‌త్యేక హోదా రద్దు చేసిన త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం.. 2020లో జమ్ముకశ్మీర్​లో పున‌ర్విభ‌జ‌న క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి రంజనా ప్రకాశ్​ దేశాయ్​ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఈ క‌మిష‌న్ గ‌డువును పెంచింది కేంద్రం.

  • అఖిలపక్ష పార్టీలతో మోదీ సమావేశానికి ముందే.. ఈ కమిషన్​ తన పనిని పూర్తి స్థాయిలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.
  • ఈ నెల ప్రారంభంలోనే జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది ఎన్నికల కమిషన్​. జన సాంద్రత సహా తదితర పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది.

పునర్విభజన కమిషన్​ సమావేశాలను ఫరూక్​ అబ్దుల్లాతో పాటు ఇతర ఎంపీలు గతంలో బహిష్కరించారు. ఇప్పుడు ప్రధాని సమావేశానికి హాజరైన వారు.. ఇదివరకటి వ్యతిరేకతను వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి: కశ్మీర్​లో ఎన్నికలు జరిగినా ఆ అధికారాలు కేంద్రానివే!

'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'

ప్రత్యేక హోదాపై 'గుప్కార్' వెనక్కి తగ్గినట్లేనా?

కశ్మీరానికి ప్రజాస్వామ్య చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.