ETV Bharat / bharat

ఐఫోన్​ కోసం 8నెలల కుమారుడి విక్రయం.. ఇన్​స్టా రీల్స్ కోసమేనట!

author img

By

Published : Jul 27, 2023, 10:39 PM IST

Updated : Jul 27, 2023, 10:58 PM IST

couple sells son to buy iPhone 14
couple sells son to buy iPhone 14

ఐఫోన్​ కొనేందుకు నగదు కావాలని సొంత కొడుకునే అమ్మేశారు దంపతులు. ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేసేందుకు యాపిల్​ ఫోన్​ను కొనుక్కోవాలని అనుకున్నారు ఈ దంపతులు. మరోవైపు రెండు లక్షల రూపాయలకు తన బిడ్డను వేరే వారికి విక్రయించింది ఓ తల్లి! ఈ రెండు ఘటనలు బంగాల్​లోనే జరిగాయి.

మార్కెట్లో ఐఫోన్​కు ఉండే క్రేజ్​ మాములుగా ఉండదు. యాపిల్​ ఫోన్​ను కొనుక్కునేందుకు సొంత అవయవాలను సైతం అమ్ముకోవడం చూసే ఉంటాం. ఈ దంపతులు కూడా లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్​ కోసం ఏకంగా 8 నెలల కుమారుడిని అమ్మేశారు. ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేసేందుకు యాపిల్​ ఫోన్​ను కొనుక్కోవాలని అనుకున్నారు ఈ దంపతులు. ఈ షాకింగ్​ ఘటన బంగాల్​లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది
జిల్లాలోని గాంధీనగర్​ ప్రాంతానికి చెందిన జయదేవ్ ఘోష్​, సతీ దంపతులకు 8 నెలల కింద ఓ బాలుడు జన్మించాడు. వీరిద్దరు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేస్తూ ఉంటారు. అయితే, రీల్స్ బాగా చేసేందుకు ఐఫోన్ కొనాలని భావించారు దంపతులు. కానీ అందుకు సరిపడా డబ్బు లేకపోవడం వల్ల 8 నెలల శిశువును అమ్మేసేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే జూన్​ 22న ఖాఢ్​దహా ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళకు తమ బాబును అమ్మేసి.. యాపిల్ ఫోన్​ను తెచ్చుకున్నారు.

మరోవైపు శిశువు కనిపించకుండా పోయి నాలుగు రోజులు అవుతున్నా.. పట్టించుకోకపోవడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఏడేళ్ల కూతురును అమ్మాలని అనుకోగా.. ఆ ప్లాన్​ కుదరలేదని అందుకే చిన్నారిని విక్రయించామని జయదేవ్​ చెప్పాడు. దీంతో శిశువు తల్లిదండ్రులతో పాటు కొన్నుకున్న మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు.

రెండు లక్షల కోసం చిన్నారి విక్రయం
ఉత్తర 24 పరగణాలు జిల్లాలోనే ఇదే తరహా ఘటన మరొకటి జరిగింది. రెండు లక్షల రూపాయలకు తన బిడ్డను వేరే వారికి విక్రయించింది ఓ తల్లి! అయితే, తాను బిడ్డను డబ్బులు ఇచ్చి తీసుకోలేదని శిశువును కొన్న మహిళ చెప్పుకొచ్చింది. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిడ్డ తల్లిని, శిశువును తీసుకున్న మహిళతో పాటు మధ్యవర్తిత్వం వహించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారిని విక్రయించిన మహిళ భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. ఆ తర్వాత ఆమెకు మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ కారణంగా వితంతువు గర్భం దాల్చింది. ఈ విషయంలో పొరుగువారి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంది. దీంతో కడుపులో ఉన్న బిడ్డను చంపాలని అనుకుంది. అయితే, తాపస్ మోండల్, శాంతి మోడల్ అనే దంపతులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ వితంతువును సంప్రదించారు. పంచ్​సాయార్ ప్రాంతంలో ఉండే ఝుమా మాఝీ అనే పిల్లలు లేని మహిళకు పుట్టిన బిడ్డను దత్తత ఇవ్వాలని గర్భిణీ వితంతువును కోరారు. ఇందుకు అంగీకరించిన వితంతువు.. పుట్టిన బిడ్డను 11 రోజుల తర్వాత వారికి అప్పగించింది. ఇందుకు బదులుగా ఝుమా మాఝీ రూ.2 లక్షలు.. వితంతువుకు ఇచ్చింది. డబ్బు సమకూర్చేందుకు ఆమె భూమిని సైతం విక్రయించింది.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను ప్రశ్నించారు. అయితే, అందరూ ఈ విషయాన్ని ఖండించారు. బిడ్డను తాను విక్రయించలేదని శిశువు తల్లి.. పోలీసులతో చెప్పింది. శిశువు భవిష్యత్ బాగుండాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శిశువును కొనుగోలు చేసిన ఝుమా సైతం అదే తరహా సమాధానం ఇచ్చింది. 'నేను బిడ్డను కొనుగోలు చేయలేదు. శిశువు మెరుగైన భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అందుకోసమే నేను రూ.2లక్షలు ఇచ్చా. బిడ్డను ఇచ్చినందుకు కాదు' అని వివరించింది. బిడ్డ విక్రయానికి మధ్యవర్తులుగా ఉన్న దంపతులు సైతం.. డబ్బుకోసం ఈ పని చేయలేదని చెప్పారు. ఝుమాకు సహాయం చేయడానికే ఇలా చేశామని తెలిపారు. ఈ వ్యవహారం వెనక చిన్నపిల్లల అక్రమరవాణా ఉద్దేశం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి : బిడ్డను అమ్మిన ఐదు నెలలకు వెలుగులోకి...

అమ్మా.. నన్ను ఎందుకు అమ్మేశావ్.. నేనేం తప్పు చేశాను..?

Last Updated :Jul 27, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.