ETV Bharat / bharat

బెదిరింపు సందేశాలు.. పోలీసుల హై అలర్ట్​!

author img

By

Published : Aug 14, 2021, 1:45 PM IST

UP Police got terrorist alert message
ఉగ్రవాదుల బెదిరింపు సందేశాలు.

ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం యావత్​ దేశం సిద్ధమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో దాడులకు పాల్పడేందుకు భారీగా ఉగ్రమూకలు సరిహద్దుల్లో తిష్ట వేశారని, ఏకంగా రాజస్థాన్​ డీజీపీ మెయిల్​ను హ్యాక్​ చేసి​ యూపీ పోలీసులకు సందేశం పంపారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై భద్రత కట్టుదిట్టం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద హైఅలర్ట్​ ప్రకటించింది బీఎస్​ఎఫ్​.

భారత 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉగ్ర దాడులకు ఆస్కారం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు ఏకంగా రాజస్థాన్​ డీజీపీ మెయిల్​ నుంచే బెదిరింపు సందేశం పంపటం కలకలం సృష్టిస్తోంది.

రాష్ట్రంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ రాజస్థాన్​ డీజీపీ మెయిల్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు సందేశం అందింది. కొందరు ఉగ్రవాదులు యూపీ-రాజస్థాన్​ సరిహద్దుల్లో ఉన్నారని అందులో ఉంది. ఉగ్రమూకల సమాచారంతో మెయిల్​ వచ్చిన క్రమంలో యూపీ డీజీపీ ముకుల్​ గోయల్​ అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుమానితులను గుర్తించేందుకు డ్రోన్​ కెమెరాలను మోహరించినట్లు చెప్పారు. అలాగే.. హోటళ్లు, ధర్మశాలలు, లాడ్జ్​లు, మార్కెట్లు, మాల్స్​, రద్దీ ప్రదేశాలైనా రైల్వే, మెట్రో స్టేషన్​లు, బస్టాండ్లు, విమానాశ్రయం సహా ఇతర ప్రధాన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.

ఈ అంశంపై.. రాజస్థాన్​ డీజీపీతో మాట్లాడగా ఆయన ఖండించారు. తాము ఎలాంటి హెచ్చరిక సందేశాలు పంపలేదని స్పష్టం చేశారు. దీంతో సైబర్​ నేరగాళ్లు ఆయన మెయిల్​ను హ్యాక్​ చేసి పంపి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అల్లర్లు సృష్టించేందుకు కుట్ర జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మెయిల్​ విషయంపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

భారీగా బలగాల మోహరింపు..

రాష్ట్రంలో 69 కంపెనీ దళాలను ప్రధాని సంస్థల వద్ద మోహరించినట్లు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​ తెలిపారు. మరో 141 అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వారితో పాటు ఎస్​డీఆర్​ఎఫ్​ బలగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. 550 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా పెంచామన్నారు. దిల్లీ పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్​సీఆర్​ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని, కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్​ను​ మళ్లించామన్నారు.

హై అలర్ట్​..

ఆదివారం జరిగే స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం హై అలర్ట్​ ప్రకటించింది. సరిహద్దుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జవాన్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పంద్రాగస్టు వేళ ఇస్లామిక్​ ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు ఎలాంటి చర్యలకు పాల్పడకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్ద గస్తీ పటిష్ఠం చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతాలైన ఆసోం, బంగాల్​లోని సరిహద్దుల వద్ద సోమవారం వరకు భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు గుర్తించినా.. వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు బీఎస్​ఎఫ్​ అవగాహన కల్పించింది.

మహా సీఎం వ్యక్తిగత కార్యదర్శికి బెదిరింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్​ నర్వేకర్​కు ఓ గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్​ ద్వారా బెదిరింపు సందేశం పంపాడు. తన డిమాండ్లను తీర్చకుంటే.. సీబీఐ, ఈడీ, ఎన్​ఐఏలు ఆయనపై చర్యలు తీసుకునేలా చేస్తానని బెదిరించాడు. వాట్సాప్ ​సందేశం వచ్చిన క్రమంలో ముంబయి పోలీస్​ కమిషనర్​ హేమంత్​ నగ్రాలేకు ఫిర్యాదు చేశారు నర్వేకర్​. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టంది ముంబయి క్రైమ్​ బ్రాంచ్​

నర్వేకర్​ను బెదిరించేందుకు ఉపయోగించిన వాట్సాప్​ నంబర్​ వర్చువల్​గా ఓ యాప్​ ద్వారా జనరేట్​ అయి ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ నంబర్​ను ట్రేస్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: వాఘా సరిహద్దుల్లో పాక్​ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.