ETV Bharat / bharat

'అతీక్ అహ్మద్​కు భారతరత్న ఇవ్వాలి'.. సమాధి వద్ద కాంగ్రెస్ నేత డిమాండ్

author img

By

Published : Apr 22, 2023, 3:00 PM IST

UP municipal election 2023
ఉత్తర్​ప్రదేశ్​ మున్సిపల్ ఎన్నికలు 2023

ఇటీవలే హత్యకు గురైన గ్యాంగ్​స్టర్​ అతీక్ అహ్మద్​కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్​ చేశాడు యూపీ కాంగ్రెస్​ నేత. మున్సిపల్​ ఎన్నికల ప్రచారం ఈ వ్యాఖ్యలు చేశాడు. అతీక్ సమాధిపై జాతీయ జెండాను ఉంచి త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. అతీక్ అహ్మద్ హత్యకు ప్రతీకారంగా భారత్‌పై దాడులు చేస్తామని అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AOIS) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్​ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే హత్యకు గురైన.. గ్యాంగ్​స్టర్​​ అతీక్ అహ్మద్​కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పైనా తీవ్ర విమర్శలు గుప్పించాడు. ​మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. మైనారిటీల ఓట్ల కోసమే ఈ తరహాలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నేత చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. జాతీయ జెండాను సైతం ఆ వ్యక్తి అవమానపరిచాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్​కుమార్​ సింగ్​.. ప్రయాగ్​రాజ్​కి చెందిన వ్యక్తి. అతడు కాంగ్రెస్​ పార్టీ తరఫున.. మున్సిపల్​ ఎన్నికల్లో బరిలో దిగాడు. 43 వార్డు నుంచి అతడు పోటీ చేస్తున్నాడు. గురువారం ఎన్నికల ప్రచారంలో.. అతీక్​కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. అదే విధంగా.. అతీక్​ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ములాయం సింగ్​ యాదవ్​కు ప్రభుత్వం పద్మ విభూషన్​ ఇచ్చిందని.. అతీక్​కు ఎందుకు భారతరత్న ఇవ్వకూడదని ప్రశ్నించాడు. రాజ్​కుమార్​ సింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా.. ప్రయాగ్​రాజ్​ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్​ ప్రదీప్ మిశ్రా పక్కనే ఉన్నారు. ఆ సమయంలో రాజ్​కుమార్​ను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అతీక్​ సమాధికి నివాళులు అర్పించిన రాజ్​కుమార్​..
వివాదస్పద వ్యాఖ్యల అనంతరం అతీక్​ సమాధి వద్దకు వెళ్లాడు రాజ్​కుమార్. అనంతరం సమాధి వద్ద అతీక్​కు నివాళులు అర్పించాడు. సమాధిపై జాతీయ జెండాను ఉంచి సెల్యూట్​ చేశాడు. అతీక్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. అతీక్​ అమర్​ రహే, అమర్​ రహే అంటూ నినాదాలు చేశాడు.
పార్టీ నుంచి సస్పెండ్​..
రాజ్​కుమార్​ వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ సీరియస్​గా తీసుకుంది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. మున్సిపల్​ ఎన్నికల బరిలో నుంచి తప్పించింది. గత 6 సంవత్సరాలుగా రాజ్​కుమార్ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్​ ప్రదీప్ మిశ్రా అన్నారు. రాజ్​ కుమార్​ మానసిక పరిస్థితి బాగాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజ్​కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ జెండాను అవమాన పరిచినందుకుగానూ రాజ్​కుమార్​పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

'భారత్​పై దాడులు చేస్తాం'
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్యకు ప్రతీకారంగా భారత్‌పై దాడులు చేస్తామని అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AOIS) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా అల్ ఖైదా ప్రచార మీడియా విభాగం అస్-సాహబ్ విడుదల చేసిన ఏడు పేజీల మ్యాగజైన్‌లో AIQS ఉగ్ర సంస్థ ఈ హెచ్చరికలు చేసింది. గ్యాంగ్‌స్టర్లు అతీక్‌ అహ్మద్‌, అష్రఫ్‌ అహ్మద్‌లను అమర వీరులుగా వర్ణించిన ఉగ్రమూకలు.. తీహాడ్‌ జైలు నుంచి తమ సభ్యులను విడుదల చేస్తామని పరోక్ష హెచ్చరికలు చేసింది.

ఉగ్రమూకల హెచ్చరికలపై పోలీసులు స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు . AIQS ఉగ్రవాద సంస్థ హెచ్చరికలను పరిశీస్తున్నామని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు . ఉగ్రవాదుల ఆటలు సాగనివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

ఉతర్త్‌ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా దుండగులు జర్నలిస్టుల్లా వచ్చి వారిపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతీక్, అతని సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు అతీక్‌ కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.