ETV Bharat / bharat

జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదు: అమిత్ షా

author img

By

Published : Jun 11, 2023, 7:31 PM IST

Updated : Jun 11, 2023, 8:29 PM IST

Amit Shah
Amit Shah

19:28 June 11

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది

Union Home Minister Amit Shah comments on ap cm jagan: జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదని, జగన్‌ పాలనలో విశాఖపట్టణం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. విశాఖపట్టణం రైల్వే గ్రౌండ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేతలతోపాటు కార్యకర్తలు, యువత భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షా.. భారత్‌ మాతా కీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సింహాద్రి అప్పన్న, కనక మహాలక్ష్మికి నమస్సులు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజును, తెన్నేటి విశ్వనాథం, పీవీజీ రాజును స్మరించుకుందామన్నారు. అనంతరం మోదీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోందన్న అమిత్ షా.. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెబుతున్నది నిజం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రభుత్వం..సిగ్గుతో తలదించుకోవాలి.. అనంతరం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్‌ చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. ప్రధాని మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. జగన్‌ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామన్న అమిత్ షా.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందా..? అంటూ ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందన్నారు.

ఆ జిల్లాలను స్మార్ట్ సిటీలు చేస్తున్నాం.. అంతేకాకుండా, విశాఖపట్టణం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని అమిత్ షా వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కి అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఇచ్చామన్న అమిత్ షా.. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖ, 3 వైద్య కళాశాలలు ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్లతో మరోసారి మోదీ ప్రధానిగా గెలవటం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 20 లోక్‌సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలవాలని పార్టీ శ్రేణులకు కేంద్ర హూం మంత్రి అమిత్ షా తెలియజేశారు.

ఇవీ చదవండి

Last Updated :Jun 11, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.