ETV Bharat / bharat

'ప్రజాకర్షక పథకాలకు నేను వ్యతిరేకం'

author img

By

Published : Sep 21, 2021, 7:10 AM IST

అట్టడుగున ఉన్న పేదలకు విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా సాధికారత కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news) వ్యాఖ్యానించారు. తాను ప్రజాకర్షక పథకాలకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు. గుజరాత్​లోని ఓ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువతకున్న ప్రతిభాపాటవాలను ఉపయోగించుకుని దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆకాంక్షించారు.

Vice President Venkaiah Naidu
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"నేను ప్రజాకర్షక పథకాలకు వ్యతిరేకం. అట్టడుగున ఉన్న పేదలకు విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా సాధికారత కల్పించి వారికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవాలి" అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news) పేర్కొన్నారు. 'రాజకీయ నాయకత్వం, పరిపాలన' అన్న అంశంలో ఏడాది డిప్లొమా కోర్సు చేస్తున్న గుజరాత్‌లోని వడోదరాకు చెందిన 'మహారాజా సయాజిరావ్‌ యూనివర్శిటీ' విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన(Venkaiah Naidu latest news) మాట్లాడారు.

"దేశంలో 65శాతం జనాభా 35 ఏళ్లలోపువారే ఉన్నారు. యువతకున్న ప్రతిభాపాటవాలను ఉపయోగించుకుని దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలి. నవభారతాన్ని నిర్మించాలి. విద్యార్థులు ఎన్నడూ అలసత్వంతో ఉండకూడదు. లక్ష్యసాధనకు విశ్రమించకుండా నిరంతరం పనిచేయాలి. మిగతావారి కంటే ముందు ఉండాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. లక్ష్యం చేరేంతవరకూ విశ్రమించకూడదన్న వివేకానందుడి బోధనను మరిచిపోవద్దు. లింగ వివక్ష, కులతత్వం, అవినీతి, మహిళలపై అరాచకాలు, నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు యువత అంకితభావంతో పనిచేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించాలి. అవసరమైన వారిని ఆదుకుని, సాయం చేయడమన్నది మన భారతీయ సిద్ధాంతం. దాన్ని ఎన్నడూ విస్మరించకూడదు. విద్యార్థులు కేవలం రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా అందులో చేరి ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాలి. ఆదర్శాల కంటే ఆదర్శనీయమైన ప్రవర్తన అతి ముఖ్యం."

- ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

"రాజకీయాలతో సహా అన్ని రంగాల్లో విలువలు వేగంగా పడిపోతుండడం ఆందోళనకర అంశం. వ్యవస్థను నాశనం చేస్తున్న విభిన్న రుగ్మతలను నిర్మూలించి జీవితంలోని అన్ని కోణాల్లో అత్యున్నతమైన నైతిక ప్రమాణాలు ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. సత్ప్రవర్తన, సద్గుణం, సామర్థ్యం ఉన్న ప్రతినిధులనే ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ఈ స్థానాన్ని ఇప్పుడు కులం, మతం, ధనం, నేరం ఆక్రమించడం విచారకరం. దానివల్ల మన ఎన్నికల వ్యవస్థ కలుషితం అవుతోంది. చట్టసభల్లో సభ్యుల ఆందోళనల వల్ల తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రభుత్వాలను విమర్శించే హక్కు చట్టసభల సభ్యులకు ఉంటుంది. అయితే హుందాతనం, గౌరవం, మర్యాద అన్న లక్షణ రేఖలను ఎప్పుడూ దాటకూడదు" అని వెంకయ్యనాయుడు(Venkaiah Naidu latest speech) అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.