ETV Bharat / bharat

Supreme Court: "అవినాష్‌ అరెస్టు విషయంలో.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదు"

author img

By

Published : Apr 22, 2023, 6:43 AM IST

SC Serious on TS High Court Orders
SC Serious on TS High Court Orders

SC Serious on TS High Court Orders: Y.S.వివేకానందరెడ్డి హత్య కేసులో Y.S.అవినాష్‌రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై... సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై C.J.I ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తుందా, ఇదేమి ఆదేశం అంటూ.. అవినాష్‌రెడ్డి న్యాయవాదిని C.J.I ప్రశ్నించారు.

SC Serious on TS High Court Orders: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు చాలా దారుణం, ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని వ్యాఖ్యానించారు. అవి అమల్లో ఉండటానికి వీల్లేదని, అందువల్ల స్టే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి వాదనలు సోమవారం వింటామని, అంతవరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని పేర్కొన్నారు.

తన తండ్రి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అవినాష్‌ రెడ్డిని ఈ నెల 25 వరకూ అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దర్యాప్తు పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలని అభ్యర్థిస్తూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవేందర్‌పాల్‌సింగ్‌, అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు: సిద్ధార్థ లూథ్రా వాదనలు ప్రారంభించిన వెంటనే న్యాయమూర్తులిద్దరూ జోక్యం చేసుకుంటూ సునీతకు ఈ కేసుతో సంబంధమేంటని ప్రశ్నించారు. ఆమె హతుడి కుమార్తె అని సిద్ధార్థ లూథ్రా బదులిచ్చారు. ‘నా తండ్రి అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భౌతికకాయం రక్తపు మడుగులో పడి ఉన్నా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేశారు. తీవ్ర కలత కలిగించేలా ఉన్న ఆ ఫొటోలను కేసుతోపాటు జత చేశాం. హత్య తర్వాత రక్తం, గాయాలు కనిపించకుండా ఆయన శరీరానికి కుట్లు వేసి, బ్యాండేజీతో చుట్టేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు తొలినాళ్లలో చాలా సమస్యలు వచ్చాయి. ఘటనలో ప్రమేయం ఉన్నవారు అప్రూవర్‌ను బెదిరించడంతో నిరుడు సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది.

కేసు తెలంగాణకు వెళ్లిన తర్వాత వారు సీబీఐ దర్యాప్తు బృందంలోని ఒక సభ్యుడిపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు ఆ అధికారిపై కేసు పెట్టి ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాన్నుంచి ఉపశమనం కోసం ఆ అధికారి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఇటీవల అవినాష్‌రెడ్డి తండ్రి (వైఎస్‌ భాస్కరరెడ్డి), మరొక వ్యక్తి (గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి) అరెస్టయ్యారు. కారణమేదైనా ఈయనకు (అవినాష్‌రెడ్డికి) సీఆర్‌పీసీ 160 నోటీసులు మాత్రమే ఇచ్చారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం ఈయన పాత్ర గురించి స్పష్టంగా చెప్పారు.

సీబీఐ నోటీసులు జారీ చేసినప్పుడల్లా అవినాష్‌రెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఆయన్ను విచారించాలని చెప్పి విచారణ ముగించింది. తాజాగా రెండోసారి హైకోర్టుకు వెళ్లినప్పుడు ఈ నెల 25 వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. ఇది చాలా సమస్యాత్మకంగా ఉంది. హైకోర్టు అవినాష్‌రెడ్డిని 19 నుంచి 25వ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సీబీఐ ముందు విచారణకు హాజరుకావాలని చెబుతూనే వారి మధ్య జరిగే ప్రశ్నోత్తరాలన్నీ ముద్రితంగా/ లిఖితపూర్వంగా ఉండాలని చెప్పింది. సీబీఐ అడగదలచుకున్న ప్రశ్నల జాబితాను అవినాష్‌రెడ్డికి అప్పగించాలని ఆదేశించింది’ అని పేర్కొన్నారు.

వివేకాను అడ్డుతొలగించుకోవడానికే అంతమొందించారు: సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవేందర్‌పాల్‌సింగ్‌ వాదనలు వినిపిస్తూ ‘వివేకానందరెడ్డి కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ పోటీ చేసేవారు. వివేకా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చిన్నాన్న కావడంతో ఆయనకే ఎక్కువ ప్రభావం ఉండేది. వాళ్లు (అవినాష్‌రెడ్డి) ఎప్పుడూ బయట ఉండాల్సి వచ్చేది. అందువల్ల వివేకాను అంతమొందించడానికి ఆయన పట్ల ద్వేషం ఉన్న ముగ్గురిని ఎంచుకొని వారికి రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ దుండగులు హత్యకు ముందు, తర్వాత అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు టెలిఫోనిక్‌ సాక్ష్యాధారాల ద్వారా తేలింది. అవినాష్‌రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.

ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అన్నీ వాళ్లనుకున్నట్లు జరిగితే భౌతికకాయాన్ని పాతిపెట్టేసేవాళ్లు. తర్వాత హత్య విషయం ఎప్పటికీ వెలుగుచూసి ఉండేది కాదు. వివేకా భౌతికకాయాన్ని ఇంట్లోనే ప్యాక్‌ చేసి బయటికి ఎలా తీసుకొచ్చారో కూడా ఫొటోలున్నాయి. కొందరు వ్యక్తులు అనుకోకుండా తమ ఫోన్‌లో ఫొటోలు తీసుకోవడం వల్ల ఆ విషయం వెలుగులోకి వచ్చింది. మీ వెనుక మేం ఉన్నాం, మీకేమీ జరగదు, నిర్భయంగా ఉండాలని నిందితులకు వీరు భరోసా ఇచ్చిన సాక్ష్యాధారాలు కూడా బయటికొచ్చాయి. ఈ కేసును గుండెపోటు మరణంగా నమోదు చేయాలని తనను బలవంతపెట్టినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తొలుత వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత ఆయన్ను సస్పెండ్‌ చేశారు’ అని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తాం: సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఆ సీఐ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకొని పదోన్నతి కూడా ఇచ్చిందన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం సీజేఐ దీనిపై వచ్చే శుక్రవారం తదుపరి వాదనలు వింటామని చెప్పారు. ఈ కేసు మంగళవారమే హైకోర్టు ముందుకొస్తుందని సిద్ధార్థ లూథ్రా చెప్పడంతో సీజేఐ స్పందిస్తూ మేం హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తామని స్పష్టం చేశారు. సీబీఐ తరఫు న్యాయవాది దర్యాప్తు గడువు గురించి విజ్ఞప్తి చేయగా.. ఈ నెల 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న గడువును కూడా పొడిగిస్తామని పేర్కొన్నారు.

వచ్చే శుక్రవారం హాజరుకావాలని ప్రతివాది (అవినాష్‌రెడ్డి)కి నోటీసులు ఇస్తామని తొలుత సీజేఐ చెప్పారు. సిద్థార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ప్రతివాది తరఫు న్యాయవాది కోర్టులోనే ఉండి ఈ విచారణను చూస్తున్నారని చెప్పారు. అలా చూసే హక్కు వారికి ఉంటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మీరు హైకోర్టు ఉత్తర్వులపై పూర్తి స్టే కోరుతున్నారా అని సీజేఐ అడగ్గా అవునని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. మేం స్టే ఇవ్వడానికి మొగ్గు చూపితే, ఇక్కడ (అభిప్రాయం చెప్పడానికి) ప్రతివాది తరఫు న్యాయవాదులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

అవినాష్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ తానున్నానని ముందుకొచ్చారు. సీజేఐ స్పందిస్తూ ‘రంజిత్‌కుమార్‌.. హైకోర్టు ఇచ్చింది ఇదేం ఆర్డర్‌’ అని వ్యాఖ్యానించారు. విచారణను సోమవారానికి వాయిదా వేయండి.. మేం వాదనలు వినిపిస్తామని రంజిత్‌కుమార్‌ కోరారు. దాంతో సీజేఐ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే తన వద్ద హైకోర్టు ఉత్తర్వులు తప్ప పిటిషన్‌ కాపీ లేదని రంజిత్‌కుమార్‌ చెప్పగా ఆయనకు పిటిషన్‌ కాపీ అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు స్టే ఇస్తే అవినాష్‌ను అరెస్టు చేసేస్తారు..:స్టే ఇస్తామనడంతో అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్‌ను సీబీఐ కార్యాలయంలో విచారిస్తున్నారని, ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ వెంటనే ఆయన్ను అరెస్ట్‌ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ స్పందిస్తూ ‘హైకోర్టు ఇచ్చింది దారుణమైన ఆర్డర్‌. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. మీరు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నారా అని రంజిత్‌కుమార్‌ అడిగారు. ‘మధ్యంతర ఉత్తర్వులపై, హైకోర్టులో తదుపరి కార్యాచరణపై స్టే ఇస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

హైకోర్టులో తదుపరి కార్యాచరణపై స్టే ఇస్తే తమకేమీ ఇబ్బంది లేదని, మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే పిటిషనర్‌ ఎస్‌ఎల్‌పీని అనుమతిచ్చినట్లవుతుందని, తమకు ఎలాంటి అవకాశం లేకుండా పోతుందని రంజిత్‌కుమార్‌ చెప్పారు. ‘మేం మీ వాదనలు వింటున్నాం. అయితే ఆ ఉత్తర్వులు అమల్లో ఉండటానికి వీల్లేదు’ అని సీజేఐ స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వాదించగలనని.. అయితే తాను పిటిషన్‌ ప్రతిలో పేర్కొన్న ప్రాతిపదికలు చూడాల్సి ఉందని రంజిత్‌కుమార్‌ చెప్పారు. ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నాం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లోని పేరా 18లో జారీ చేసిన నిర్దేశాలపై స్టే జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం వరకు ప్రతివాదిని సీబీఐ అరెస్ట్‌ చేయొద్దని కూడా ఆదేశించారు. సోమవారం ఉదయం అత్యవసర విషయాలు విచారించేందుకు ధర్మాసనం ఉదయం 9.30కే కూర్చుంటుందని ఆ మేరకు న్యాయవాదులు సిద్ధమైరావాలని సూచించారు.

దర్యాప్తు గడువు పెంపుపై సోమవారం చూస్తాం: దర్యాప్తు గడువు పెంపుపై ఉత్తర్వులు ఇవ్వాలని సీబీఐ న్యాయవాది కోరగా.. సోమవారం చూస్తామని సీజేఐ బదులిచ్చారు. ఈ కేసులో సీబీఐ ఎందుకు అప్పీల్‌ దాఖలు చేయలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆ సంస్థ తరఫున హాజరైన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేవేందర్‌పాల్‌సింగ్‌ బదులిస్తూ వాళ్లు వేగంగా పిటిషన్‌ వేశారు, సీబీఐ దాఖలు చేయడానికి కొంత సమయం పడుతుందని విన్నవించారు. అయితే ఈ పిటిషన్‌ ధర్మాసనం ముందుకు వస్తోందని తెలిసి తాము హాజరైనట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.