ETV Bharat / bharat

Supreme Court: ఇలాగైతే సీబీఐ ఎందుకు?.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం అసహనం

author img

By

Published : Apr 25, 2023, 7:06 AM IST

Supreme Court Dismissed the TS High Court Orders
Supreme Court Dismissed the TS High Court Orders

Supreme Court Dismissed the TS High Court Orders: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 25 వరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సీజేఐ ధర్మాసనం కొట్టివేసింది. హత్యకేసులో అనుమానితుడికి లిఖితపూర్వక ప్రశ్నలివ్వాలా అంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు 24 గంటల రక్షణ కల్పించాలన్న వినతిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తును మరో రెండు నెలలు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం అసహనం

Supreme Court Dismissed the TS High Court Orders: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఈనెల 25వరకు అరెస్ట్ చేయవద్దని.. దర్యాప్తు సమయంలో అతడి నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత రూపంలో తీసుకోవాలని, ప్రశ్నావళిని ముందుగానే ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేయకుండా కనీసం 24 గంటల పాటు అయినా రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. ఏప్రిల్‌ 30లోపు ఈ కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాల కారణంగా సమయం వృథా అయింది కాబట్టి దర్యాప్తు గడువును జూన్‌ 30కి పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రశ్నావళిని ముందే అందించాలా.. ఇవేం ఉత్తర్వులు?: హత్య కేసులో అనుమానితుడి నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత రూపంలో తీసుకోవాలని.. అడిగే ప్రశ్నల జాబితాను ముందుగానే అప్పగించాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘దర్యాప్తు ప్రమాణాలు ఇలాగే ఉంటే, సీబీఐని మూసేయడం మేలు. ఇందులో ప్రతివాది పాత్ర ఉన్నట్లు సీబీఐ చెప్పింది. అలాంటి కేసులో హైకోర్టు తొలుత ముందస్తు బెయిల్‌ ఇవ్వడం, తర్వాత అనుమానితుడికి ప్రశ్నావళి అప్పగించమని సీబీఐని ఆదేశించడం.. ఇవన్నీ చూస్తుంటే వాళ్లు న్యాయశాస్త్రాన్ని తిరగరాస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

ఇకపై అందరూ ఇలాగే విచారించాలని అడగరా?: విచారణకు ఇది కొలమానమైతే ఇకపై ప్రతి నిందితుడూ ప్రతి కోర్టులో ఈ ఉత్తర్వులను ఉదాహరణగా చూపి మీరూ మాకు ప్రశ్నావళి ఇవ్వండి, మేం రాతపూర్వకంగా సమాధానం చెబుతాం అంటారు. అది ఇప్పుడు గోల్డ్‌ స్టాండర్డ్‌గా మారుతుందన్నారు. ముందస్తు బెయిల్‌ దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్‌పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో హైకోర్టు పూర్తి అపరిపక్వతతో ఉత్తర్వులిచ్చినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొన్న అంశాలను హైకోర్టు తప్పుగా అన్వయించి అసాధారణమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

హత్య కేసులో అనుమానితుడికి లిఖితపూర్వకంగా ప్రశ్నలివ్వాలా?: హత్య కుట్రలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని లిఖితపూర్వకంగా ప్రశ్నించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వాల్సిన అవసరమే లేదన్నారు. ప్రశ్నావళిని ప్రతివాదికి అప్పగించాలని చెప్పడం కూడా ఏ మాత్రం సమంజసం కాదని తెలిపారు.. ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జిషీట్లలో లేని నిందితుల పాత్ర గురించి సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్న సీజేఐ ధర్మానసం.. ఏప్రిల్‌ 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి

అరెస్టు చేయకుండా 24 గంటల రక్షణ కల్పించడానికి నిరాకరణ: అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తు తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణకు రానుందని.. కోర్టు నిర్ణయం వచ్చే వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్ విజ్ఞప్తి చేశారు. దీన్ని సైతం సీజేఐ తోసిపుచ్చారు. ఒకవైపు తాము హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసి.. మరోవైపు రక్షణ కల్పిస్తే అది పరిస్పర విరుద్ధంగా ఉంటుందన్నారు.

అయినా అవినాష్‌ తరపు న్యాయవాది రంజిత్‌కుమార్ పట్టువీడకుండా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించే వరకైనా రక్షణ కల్పించాలని.. లేకుంటే తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తు వృథా అవుతందని పదేపదే విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. మీ కక్షిదారును సీబీఐ అరెస్ట్ చేస్తుందనుకుంటున్నారా..? ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదని.. ఈ విషయంలో దర్యాప్తు సంస్థ అత్యంత సంయమనం పాటించిందని గుర్తుచేస్తూ.. 24 గంటల రక్షణ కల్పించడానికి నిరాకరించారు. చివరకు సీబీఐ మిమ్మల్ని అరెస్ట్‌ చేయొచ్చు, చేయకపోవచ్చు.. బహుశా అరెస్టు చేయరనే మాకు అనిపిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఉత్తర్వులు ఏనాడూ చూడలేదు: తొలుత సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు, దాఖలైన ఛార్జిషీట్లు, హత్యా స్థలంలో నిందితులు సాక్ష్యాలు చెరిపేయడానికి చేసిన ప్రయత్నాల గురించి వివరించారు. హత్య కేసులో ఉన్న వారికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో పాటు, దర్యాప్తు సమయంలో సీబీఐ అనుసరించాల్సిన విధివిధానాలు నిర్దేశిస్తూ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం నా కెరీర్‌లో ఇప్పటి వరకు చూడలేదన్నారు.

అనుమానితుణ్ని విచారించే సమయంలో ప్రశ్న, జవాబులు లిఖితపూర్వకంగా లేదంటే ముద్రిత రూపంలో ఉండాలని, ప్రశ్నావళిని అనుమానితుడికి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు చెప్పిందన్నారు. ఇది దర్యాప్తును నీరుగార్చే కసరత్తన్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయన్నారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకుంటూ.. అవినాష్‌రెడ్డి విచారణకు వచ్చారని అయితే ప్రశ్నలు, జవాబులు ఇవ్వడం అన్నది ప్రత్యేకమన్నారు. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ జోక్యం చేసుకుంటూ ఈ ప్రశ్నలు, జవాబులు ఎవరు తయారుచేశారని ప్రశ్నించగా.. సీబీఐ అని తుషార్‌ మెహతా బదులిచ్చారు.

అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ అవినాష్‌రెడ్డికి విచారణకు సంబంధించిన ప్రశ్నలను ముందుగానే ఇవ్వాలని హైకోర్టు చెప్పిందంటూ పిటిషనర్‌ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జనవరి 23 నుంచి అవినాష్‌రెడ్డి ఇప్పటి వరకు పదిసార్లు సీబీఐ ముందు హాజరయ్యారయ్యారని.. ఆయన ఎంపీగా ఉన్నందున పారిపోయే సమస్య ఉత్పన్నం కాదన్నారు. సీబీఐ అడిగే ప్రశ్నల్లో 50శాతం పదేపదే అడిగినవే ఉన్నాయని.. పదేపదే అడిగిన ప్రశ్నలే అడుగుతున్నట్లయితే ప్రశ్నావళిని లిఖిత పూర్వకంగా ఇవ్వమని మాత్రమే తెలంగాణ హైకోర్టు చెప్పిందన్నారు. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తి నరసింహా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రశ్నలు ఎలా వేయాలన్నది దర్యాప్తు సంస్థ ఇష్టమన్నారు. ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ విచారణ పూర్తయిన తర్వాత ప్రశ్నలు, జవాబులను రికార్డు చేస్తున్నారని, తాను బయటికెళ్లేటప్పుడు వాళ్లు అడిగిన ప్రశ్నలను లిఖిత రూపంలో ఇస్తున్నారు తప్ప ముందుగా ఇవ్వడం లేదని, కావాలంటే తన అఫిడవిట్‌ను పరిశీలించవచ్చని అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారని చెప్పారు. అది సరికాదంటూ న్యాయమూర్తులు తోసిపుచ్చారు.

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు: అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లోని ప్రతివాదికి విచారణకు ముందుగానే ప్రశ్నావళి అందించమని ఆదేశించినట్లు పిటిషనర్‌ సునీత తప్పు భాష్యం చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సీబీఐ ఎప్పుడూ ముందుగా ప్రశ్నావళి ఇవ్వలేదని.. దర్యాప్తు అయిపోయిన తర్వాతే అవినాష్‌కు ఇచ్చిందన్నారు. సీజేఐ దాంతో ఏకీభవించలేదు. మీకు సలహా ఇవ్వాలని మేం భావించడం లేదు. అయితే రికార్డుల ఆధారంగా మాకు కలిగిన భావన ప్రకారం మీరు ముందస్తు బెయిల్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకోవడం మేలు’ అని ముకుల్‌ రోహత్గీని ఉద్దేశించి అన్నారు.

సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను తాము చదివామన్నారు. చనిపోయిన వ్యక్తి తనకు పెదనాన్న అవుతారని, ఆయన చివరి వరకూ తన కోసం ప్రచారంలో పాల్గొన్నారని, అలాంటి వ్యక్తిని చంపుతానా’ అని అవినాష్‌రెడ్డి తరఫున ముకుల్‌ రోహత్గీ కోర్టుకు చెప్పారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకుంటూ తాను సీబీఐ సీనియర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నానని, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయలేదన్నారు. ఆ వాదనలను సునీత న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీవ్రంగా వ్యతిరేకించారు.

మీరు వారు దాఖలు చేసిన కౌంటర్‌నే చూసినట్లు లేదని, వాళ్లు ప్రశ్నావళి ఇచ్చారని అన్నారు. ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ లిఖిత పూర్వక ప్రశ్నల విషయంపై అభ్యంతరం ఉంటే హైకోర్టు ఉత్తర్వుల్లోని ప్రశ్నలకు సంబంధించిన ఆ భాగాన్ని తొలగించవచ్చని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టు ముందుకు మంగళవారం వస్తుందని, మిగిలిన విషయాలపై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోనివ్వాలని కోరారు.

హైకోర్టు ముందు మంగళవారం కేసు ఉన్నప్పటికీ మీరు మొత్తం ఆర్డర్‌ను కొట్టేయాలనుకుంటే తాను అక్కడ కేసును ఉపసంహరించుకుంటానన్నారు. సీజేఐ, జస్టిస్‌ నరసింహ స్పందిస్తూ మీరు ఏం ఉపసంహరించుకుంటారని ప్రశ్నించారు. సీబీఐ జారీ చేసిన 160 నోటీసుకు వ్యతిరేకంగా తాను ముందస్తు బెయిల్‌ కోరానని, దాన్ని ఉపసంహరించుకుని సీబీఐ ముందుకెళ్తానన్నారు. జస్టిస్‌ నరసింహ జోక్యం చేసుకుంటూ అది అంత సులభం కాదన్నారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లోని పేరా 15, 16 మ్యాటర్‌ మెరిట్స్‌ గురించి చెబుతున్నాయని గుర్తు చేశారు. తర్వాత ప్రధాన న్యాయమూర్తి అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకొని సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేశారు. హత్య జరిగిన నాటి నుంచి తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ అందులో పొందుపరిచారు.

గడువు పొడిగింపుపై అవినాష్‌ న్యాయవాది అభ్యంతరం: వివేకా హత్య కేసు దర్యాప్తు ముగింపునకు ఏప్రిల్ 30 వరకు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించాలని సునీత తరపు న్యాయవాది కోరారు. దీనికి అవినాష్‌రెడ్డి న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వరకు హాజరైన ASG ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారన్నారు. గడువు పొడిగించమని సీబీఐ అడక్కపోయినా పిటిషనర్‌ అడగడమేంటో అర్థం కావడం లేదన్నారు. గడువు పెంపుపై సీబీఐ తరఫు న్యాయవాది తుషార్‌ మెహతాను అడగగా వారు సుముఖత వ్యక్తం చేయడంతో ధర్మాసనం జూన్ 30 వరకు దర్యాప్తు గడువును పెంచింది. కేవలం పిటిషనర్‌ కోరారని కాదని, మధ్యలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గడువు పొడిగించామని స్పష్టం చేశారు.

కౌంటర్‌ దాఖలు చేయని సీబీఐ: ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అవినాష్‌రెడ్డి కౌంటర్‌ దాఖలు చేసినా, సీబీఐ మాత్రం దాఖలు చేయలేదు. గత శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సీజేఐ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ రోజు అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్, సీబీఐ తరఫు న్యాయవాది డీపీసింగ్‌లు కోర్టులోనే ఉన్నారు. మీరెందుకు అప్పీల్‌ చేయలేదని ధర్మాసనం అడిగినప్పుడు సీబీఐకి కొంత సమయం పడుతుందని, అయినా తాము సునీత దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. హత్య కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర గురించీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సోమవారం విచారణ సమయంలో సీబీఐ తరఫున ఎలాంటి కౌంటర్‌ దాఖలు కాలేదు. ఆ సంస్థ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా వాదనల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. అవినాష్‌ పాత్రపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయడానికి సిద్ధమైనప్పటికీ ఏవో కారణాల వల్ల ఆ పని చేయలేకపోయిందని న్యాయవాద వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.