ETV Bharat / bharat

ఆపరేషన్ సక్సెస్​- హైజాక్‌కు గురైన నౌకలోని సిబ్బందిని రక్షించిన నేవీ

author img

By PTI

Published : Jan 5, 2024, 9:05 PM IST

Updated : Jan 5, 2024, 10:10 PM IST

Somalia Ship Hijack Indian Navy
Somalia Ship Hijack Indian Navy

Somalia Ship Hijack Indian Navy : అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలుభారత్ నేవీ చేసిన హెచ్చరికకు భయపడి పారిపోయారు. నౌకను హైజాక్ చేసిన సమాచారం అందిన వెంటనే INS చెన్నై యుద్ధనౌక ద్వారా గాలింపు చేపట్టిన నౌకాదళం నౌకను గుర్తించి పైరెట్లకు హెచ్చరికలు పంపింది. అనంతరం మెరైన్ కమాండోలు నౌకలోకి దిగి అందులో ఉన్న 15 మంది భారతీయులు సహా 21 మంది సిబ్బందిని కాపాడారు.

Somalia Ship Hijack Indian Navy : అరేబియా సముద్రం సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన నౌకలోని 15 మంది భారతీయులు సహా 21మంది సిబ్బందిని భారత నేవీ కమాండోలు కాపాడారు. నౌక హైజాక్‌ గురైన సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన భారత నౌకాదళం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు.

ఇదీ జరిగింది
అరేబియా సముద్రంలో MV లీలా నార్ ఫోక్ అనే వాణిజ్య నౌక గురువారం హైజాక్​కు గురైనట్లు బ్రిటీష్ మిలిటరీకి చెందిన UK మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్-UKMTO గుర్తించింది. ఈ సమాచారాన్ని భారత నౌకాదళానికి తెలియజేసింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది. వెంటనే స్పందించిన భారత నౌకాదళం సముద్రతీర గస్తీ కోసం కేటాయించిన INS చెన్నైతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ ను పంపింది.

శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అరేబియా సముద్రంలో హైజాక్ అయిన నౌకను ఇండియన్ నేవీ గుర్తించింది. అందులో ఉన్న భారతీయులు క్షేమంగా ఓ స్ట్రాంగ్ రూంలో ఉన్నట్లు నేవీ అధికారులు తెలుసుకున్నారు. మరోవైపు హైజాక్ అయిన నౌకను చుట్టుముట్టిన నేవీ కమాండోలు పైరెటర్లకు హెచ్చరికలు పంపారు. అనంతరం నౌకలోకి దిగి పరిశీలించగా సముద్రపు దొంగల ఆచూకీ లభ్యం కాలేదు. అయితే నౌకలో మొత్తం 15 మంది భారతీయులు సహా 21 మంది సిబ్బంది ఉన్నట్టు మెరైన్ కమాండోలు గుర్తించారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సముద్రపు దొంగలు తొలుత నౌకపై కాల్పులకు పాల్పడ్డారని అనంతరం నేవీ హెచ్చరికతో పారిపోయారని సిబ్బంది తెలిపినట్టు సమాచారం.

ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా దాడులు
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం వేళ ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలో కూడా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. వెంటనే భారత నౌకాదళం ICGS విక్రమ్​ను రంగంలోకి దించి సహాయ చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని నౌకాదళం తెలిపింది.

Last Updated :Jan 5, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.