ETV Bharat / bharat

'వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ వద్దు- మూడో డోసే మంచిది'

author img

By

Published : Aug 14, 2021, 5:50 AM IST

Cyrus Poonawalla
సైరస్​ పునావాలా

వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై విముఖత వ్యక్తం చేశారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్​ పునావాలా. వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి ఇచ్చే విధానం సరైంది కాదని స్పష్టం చేశారు. వీటి వల్ల తయారీ సంస్థల మధ్య ఆరోపణలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మూడో లేదా బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదన్నారు.

వేర్వేరు సంస్థలు అభివృద్ధి చేసినా కరోనా వ్యాక్సిన్‌లను మిక్సింగ్‌ విధానంలో ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా (Cyrus Poonawalla) స్పందించారు. వ్యాక్సిన్‌ డోసులను మిశ్రమ పద్ధతిలో ఇచ్చే అవసరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఒక వేళ ఏదైనా తప్పు జరిగితే వ్యాక్సిన్‌ తయారీ సంస్థల మధ్య నిందారోపణలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రయోగ దశల్లో వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనాలు జరగలేదనే విషయాన్ని పూనావాలా గుర్తుచేశారు. పుణెలోని తిలక్‌ మహారాష్ట్ర విద్యాపీఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సైరస్‌ పూనావాలా ఈ విధంగా స్పందించారు.

'బూస్టర్ డోస్ మంచిది'

మరోవైపు కొవిషీల్డ్​ మూడో లేదా బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదని సైరస్ పునావాలా పేర్కొన్నారు. "ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతాయి. అందుకే నేను మూడో డోసు తీసుకున్నాను. 7 నుంచి 8 వేల మంది సీరం ఉద్యోగులకు బూస్టర్ డోస్ ఇచ్చాం. రెండో డోసు తీసుకున్నవారికి ఇదే నా అభ్యర్థన.. ఆరు నెలల తర్వాత బూస్టర్​ డోస్ తీసుకొండి."అని ఆయన పేర్కొన్నారు.

డోసుల కొరత వల్లే అలా..

వ్యాక్సిన్‌ ఎగుమతిని నిషేధించడాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పునావాలా. వేలకోట్లు ఖర్చు చేసి.. నెలకు 10 నుంచి 12 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ప్రపంచంలో ఏ సంస్థ ఉత్పత్తి చేయడం లేదన్న ఆయన.. కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొవిషీల్డ్​రెండు డోసుల మధ్య వ్యవధి రెండు నెలలు మాత్రమేనని.. అయితే డోసుల కొరత కారణంగా కేంద్ర ప్రభుత్వం దానిని మూడు నెలలకు పెంచిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: ‘సీరం' ఛైర్మన్‌కు లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.