ETV Bharat / bharat

ఉద్ధవ్‌, శిందేలకు షాక్‌.. పార్టీ గుర్తును స్తంభింపజేసిన ఎన్నికల సంఘం

author img

By

Published : Oct 8, 2022, 10:26 PM IST

shiv sena symbol row
శివసేన పార్టీ గుర్తు

Shiv Sena Symbol Row : శివసేన గుర్తు కేటాయింపుపై పోరాడుతున్న ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నం 'విల్లు-బాణం'ను ఏ వర్గానికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది.

Shiv Sena Symbol Row : శివసేన పార్టీ 'విల్లు-బాణం' గుర్తు కోసం పోరాటం చేస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నాన్ని ఏ వర్గానికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరులో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన పార్టీగుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అసలైన శివసేన తమదేనని అందువల్ల పార్టీ గుర్తు 'విల్లు-బాణం' తమకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే డిమాండ్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా శుక్రవారం ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నికల సంఘం కోరింది. శనివారంలోగా తన అభిప్రాయం చెప్పాలని కోరింది. అయితే ఒక రోజు ముందుగానే ఉద్ధవ్ తన అభిప్రాయాన్ని ఖరాకండిగా చెప్పేశారు. శివసేన పార్టీ గుర్తును అడిగే హక్కు శిందేవర్గానికి లేదని, పార్టీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోయిన వాళ్లు పార్టీ గుర్తును ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఈసీకి స్పష్టంగా చెప్పేశారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున శిందే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది.ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి: 'అదానీ కోసం మావద్ద ప్రత్యేక పాలసీలు లేవు'.. పెట్టుబడుల వివాదంపై రాహుల్

బాలుడిని కాటేసిన పాములు.. సర్పాలను చంపి.. కుమారుడితో పాటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.