Second Gate Broken in Gundlakamma Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిలుస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టులో రెండో గేటు విరిగిపోయింది. మొన్న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద కాలువల్లో అడ్డగోలుగా పెరిగిన పిచ్చిమొక్కలు, తూటికాడ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణకు నిధులలేమి, ప్రాజెక్టుకు శాపంగా మారినట్లు తాజా ఘటన కనిపిస్తోంది.
అసలేంజరిగిందంటే ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో రెండో గేట్ విరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు నుంచి సాగు నీరు వృథగా పోతోంది. అయితే గతంలో మూడో గేటు కూడా విరిగిపోయి నీటిలో కొట్టుకుపోయింది. మూడో గేటు గత సంవత్సరం ఆగస్టులో విరిగిపోగా, సంవత్సర కాలం గడిచినా సరైన మరమ్మతు చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. మూడో గేటు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకోకపోవడం, తాజాగా రెండో గేటు విరగడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.
Prakasam District Collector Alert: గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువ భాగంలోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో 2 టీఎంసీలకు పైగా నీరు ఉందని వెల్లడించారు.
రెండో గేటు కింద ఉన్న 2 ఎలిమెంట్స్ కొట్టుకుపోయాయని, ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టాప్లాక్స్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపు మరో 1.5 టీఎంసీల నీరు ఉంటుందని అన్నారు. సాగునీటి గురించి రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.