దేశ రాజధాని సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన అంశంపై పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనిపై రాజ్యసభలో దాదాపు 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది.
బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ.. ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఈ సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ రోజున రాజ్యసభలో ప్రశ్నోత్తరాల గంటను తొలగించనున్నారు.
ముగ్గురు ఆప్ ఎంపీల సస్పెన్షన్
రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక దశలో అసహనానికి గురైన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. 'రైతుల ఆందోళనకు చర్చలకు సమయం కేటాయించాం. అయినప్పటికీ నిరసన చేయడం సరికాదు. నా సహనాన్ని పరీక్షిస్తే మిమ్మల్ని రోజంతా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది' అని తొలుత వెంకయ్యనాయుడు సభ్యులను హెచ్చరించారు. అనంతరం ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తూ, ఎన్డీ గుప్తాలను సభ నుంచి బయటకు పంపించారు. దీంతో సభ కొంతసేపు వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది.