ETV Bharat / bharat

Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్​ స్కామ్.. ఈడీ అనుబంధ ఛార్జీషీట్లపై ఈనెల 10న విచారణ

author img

By

Published : May 2, 2023, 9:31 AM IST

Delhi Liquor Scam
Delhi Liquor Scam

ED Inquiry in Delhi Liquor Scam Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం స్కామ్​ కేసులో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్లపై విచారణకు సీబీఐ కోర్టు అంగీకరించింది. అనుబంధ ఛార్జీషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన దర్యాప్తు సంస్థ.. ఆమె.. తన బినామీగా అరుణ్‌పిళ్లైని పెట్టి భూములు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మద్యం సిండికేట్‌లో మాగుంట రాఘవ కీలకపాత్ర పోషించాడని అనుబంధ ఛార్జీషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. ఈ ఛార్జిషీట్​పై ఈనెల 10న విచారణ జరపనున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.

దిల్లీ లిక్కర్​ స్కాం కేసులో.. ఈడీ అనుబంధ ఛార్జీషీట్లపై ఈనెల 10న విచారణ

ED Inquiry in Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు.. రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. వాటిపై ఈనెల 10న విచారణ చేపట్టనున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి వెల్లడించారు. ఈ వ్యవహారంలో సేకరించిన అదనపు ఆధారాలతో.. ఏప్రిల్‌ 6న, 27న అనుబంధ ఛార్జిషీట్లను కోర్టులో ఈడీ దాఖలు చేసింది. అందులో ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన సమీర్‌ మహేంద్ర, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్, అభిషేక్‌ బోయిన్‌పల్లి, అమిత్‌అరోడా, గౌతమ్‌ మల్హోత్రా, రాజేష్‌జోషి, రాఘవ్‌ మాగుంట, అమన్‌ధల్, అరుణ్‌పిళ్లై, మనీష్‌ సిసోదియా పాత్రపై వివరించింది. కేసుతో సంబంధమున్న 38 మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లను పొందుపర్చినట్లు ఈడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Delhi Liquor Scam Update: 27 నాటి అనుబంధ ఛార్జిషీట్‌లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన ఈడీ.. ఇండోస్పిరిట్‌ సంస్థతో ఉన్న సంబంధంపై వివరించింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌ మాగుంట, శరత్‌చంద్రారెడ్డి, కవితల నేతృత్వంలోని సౌత్‌గ్రూప్‌.. ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌ నాయర్‌కు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిందని.. అందుకు ప్రతిఫలంగా వచ్చిన లాభాల్ని కవిత తన ప్రతినిధి అరుణ్‌పిళ్లై ద్వారా హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు వినియోగించారని.. దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నవారు దిల్లీ, హైదరాబాద్‌లో వివిధ చోట్ల సమావేశమైన తేదీ, వారి మధ్య నడిచిన కాల్‌ రికార్డులు, వాట్సాప్‌ సంభాషణలను జతచేసింది. అరుణ్‌పిళ్లై, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఆ వివరాలు పొందుపరిచింది.

సౌత్‌గ్రూప్‌-ఆప్‌ నేతల మధ్య కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగానే రూ.100 కోట్లను ఆప్‌ ప్రతినిధి విజయ్‌నాయర్‌కు అడ్వాన్స్‌గా చెల్లించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఆ కారణం వల్లే పాత మద్యం విధానంలో హోల్‌సేలర్స్‌కి ఉన్న 5శాతం మార్జిన్‌ని కొత్తవిధానంలో 12 శాతంగా ఖరారు చేశారని తెలిపింది. L-1గా వచ్చిన ఇండోస్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌లో అరుణ్‌పిళ్లైకి 35.. ప్రేమ్‌రాహుల్‌ మండూరికి 32.5శాతం వాటా ఉందని.. అందులో కవిత తరఫున అరుణ్‌పిళ్లై.. మాగుంట శ్రీనివాసులురెడ్డి తరఫున ప్రేమ్‌రాహుల్‌ ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొంది. ఇండోస్పిరిట్‌లో వచ్చిన లాభాల్ని కవిత ఆదేశాల మేరకు.. అరుణ్‌ పిళ్లై పెట్టుబడిగా మలిచారని తెలిపింది. ఫీనిక్స్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి నుంచి.. ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్‌ పేరిట ఆస్తి కొన్నట్లు బుచ్చిబాబు... స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

కవిత ఆదేశాల మేరకు అన్నీ: కవిత ఫీనిక్స్‌ సంస్థ సీఓఓ శ్రీహరి నుంచి.. 25 వేల చదరపు అడుగుల మరో ఆస్తి కొన్నట్లు ఈడీ తెలిపింది. ఆమె ఆదేశాల మేరకే సంబంధిత దస్తావేజుల పని బుచ్చిబాబు చూసుకున్నాడు. ఆ గ్రూప్‌లో కె కవిత.. ఆమె భర్త డీఆర్‌ అనిల్‌కుమార్‌ భాగస్వాములుగా ఉన్నారంది. ఆ ఆస్తి మార్కెట్‌ విలువ చదరపు అడుగుకు రూ.1,760 కాగా.. రూ.1,260 మాత్రమే చెల్లించారని ఈడీ ఛార్జీషీట్‌లో పేర్కొంది. వట్టినాగులపల్లిలోని క్రియేటివ్‌ డెవలపర్స్‌లో అరుణ్‌పిళ్లై రూ.5 కోట్లు పెట్టి.. 3-4 ఎకరాల భూమి కొన్నట్లు ఆ సంస్థ భాగస్వామి రవిశంకర్‌చెట్టి.. తన స్టేట్‌మెంట్‌లో వివరించారు.

అయితే ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాతే అరుణ్‌పిళ్లై రిజిస్ట్రేషన్‌కు వచ్చారని.. క్రియేటివ్‌ డెవలపర్స్‌ ఉద్యోగి రవివర్మరాజు తన స్టేట్‌మెంట్‌లో తెలిపారని ఈడీ చెప్పింది. ఆ భూమిని కవిత ఆదేశాల మేరకే అరుణ్‌పిళ్లై బినామీ కింద కొన్నట్లు ఈడీ తెలిపింది. 2022 మే నుంచి రిజిస్టర్‌కాని ఆ భూమి.. అకస్మాత్తుగా అదే ఏడాది అక్టోబరు 11న అరుణ్‌పిళ్లై భార్య పేరిట రిజిస్టర్‌ అయింది. ఆ భూమి పిళ్లైదే తప్ప కవితది కాదని న్యాయపరంగా చెప్పేందుకే ఆ పని చేశారని ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌లో వివరించింది.

దిల్లీ ఎయిర్​పోర్టులో.. మద్యం దుకాణం ఏర్పాటుకు మాగుంట యత్నం: దిల్లీ మద్యం సిండికేట్‌లో.. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంట కీలకపాత్ర పోషించినట్లు అనుబంధ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. రాఘవ్‌ మాగుంట.. చెన్నైలోని ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్‌ అనే మద్యం తయారీ సంస్థ యజమాని. దిల్లీలో మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రెండు రిటైల్‌ జోన్లు గుప్పిట్లో ఉంచుకున్నట్లు తెలిపింది. దిల్లీ మద్యం విధానం ప్రకారం మద్యం తయారీదారులు రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారం చేయకూడదని.. కాని దిల్లీ విమానాశ్రయంలో ప్రపంచస్థాయి మద్యం దుకాణం ఏర్పాటుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జీఎంఆర్​కు వాట్సప్‌ సందేశం పంపారని ఈడీ ఛార్జిషీట్​లో పేర్కొంది.

తాము చేసే వ్యాపారంలో భాగస్వామిగా మారి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని జీఎంఆర్​ను కోరారు. మాగుంట రాఘవ్‌ సైతం.. జీఎంఆర్‌ ప్రతినిధి బీవీ నాగేశ్వరరావును సంప్రదించి దుకాణం ఏర్పాటుకు.. ఎయిర్‌పోర్టు నుంచి ఎన్​ఓసీ కోసం యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇండోస్పిరిట్‌ సంస్థను నిజమైన సంస్థగా చూపించి.. ఈ మద్యంవిధానం ద్వారా మూటగట్టుకున్న రూ.192 కోట్ల నేరపూరిత ఆర్జనను.. న్యాయబద్ధంగా సంపాదించినట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వివరించింది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.