ETV Bharat / bharat

'నేను నిర్దోషిని.. క్షమాపణ చెప్పను.. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతించండి!'

author img

By

Published : Aug 2, 2023, 10:13 PM IST

Etv Bharat
Etv Bharat

Rahul Gandhi Defamation case Supreme Court : మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేలా వీలు కల్పించాలని కోరారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తాను క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు.

Rahul Gandhi Defamation case Supreme Court : మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన.. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేసి.. తప్పు చేయకపోయినా తాను క్షమాపణ చెప్పాలని కోరడం న్యాయ ప్రక్రియను అపహస్యం చేయడమేనని తన అఫిడవిట్​లో పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పేందుకు ఇష్టపడలేదు కాబట్టే 'అహంకారి' అంటూ దుర్భాషలాడుతున్నారని తనపై కేసు పెట్టిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"తాను నిర్దోషినని పిటిషనర్ (రాహుల్ గాంధీ) ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. తనపై విధించిన శిక్ష నిలబడదని విశ్వసిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేవారు. ఈ కేసు అసాధారణమైనది. నేరం కూడా చిన్నదే. అదేసమయంలో ఫిర్యాదుదారుడి (పూర్ణేశ్ మోదీ)కి ఎలాంటి నష్టం జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీకి విధించిన శిక్షను నిలిపివేయండి. ప్రస్తుతం జరుగుతున్న లోక్​సభ సమావేశాలు, ఆ తర్వాత జరిగే సమావేశాలకు హాజరయ్యేలా అనుమతించండి."
-సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ తరఫున పిటిషన్

మోదీ అనే పేరుతో ఎలాంటి వర్గం లేదని పిటిషన్​లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గం అనేవి లేవు. మోదీ వానిక సమాజ్, మోధ్ గంచి సమాజ్ అనే వర్గాలే ఉన్నాయి. ఇంటిపేరు మోదీ అనేది అనేక కులాలవారికి ఉంటుందని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ ఛోక్సీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాదన్న విషయాన్నీ ఫిర్యాదుదారు అంగీకరించారు. కాబట్టి మోదీ సమాజం మొత్తాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్న వాదనే తెరపైకి రాదు' అని సుప్రీంకోర్టులో రాహుల్ తరఫున దాఖలైన పిటిషన్ పేర్కొంది.

కాగా, ఈ వివాదంలో రాహుల్ గాంధీకి గుజరాత్​లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్​సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని రాహుల్ గాంధీ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. రాజకీయాల్లో స్వచ్ఛత అవసరమని పేర్కొంటూ రాహుల్ పిటిషన్లను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన సుప్రీం.. పూర్ణేశ్ మోదీ సహా గుజరాత్ ప్రభుత్వానికి జూన్ 21న నోటీసులు పంపించింది. రాహుల్ పిటిషన్​పై స్పందించాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.