ETV Bharat / bharat

ప్రభుత్వానికి రాహుల్​ సవాల్​.. వాటిపై చర్చకు డిమాండ్​!

author img

By

Published : Dec 20, 2021, 5:31 PM IST

Rahul Gandhi attacks government: విపక్షాలు లేవనెత్తిన ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ చేపట్టాలని కేంద్రానికి సవాల్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సమస్యలను లేవనెత్తకుండా తమ గొంతుకను అణచివేయలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. విభజించు-పాలించు సూత్రంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత మల్లిఖార్జున్​ ఖర్గే.

Rahul gandhi
రాహుల్​ గాంధీ

Rahul Gandhi attacks government: పార్లమెంట్​ను సవ్యంగా నడిపించటం ప్రభుత్వం బాధ్యతని నొక్కి చెప్పారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే.. విపక్షాలు లేవనెత్తిన ప్రజాప్రయోజన అంశాలపై చర్చ చేపట్టాలని సవాల్​ చేశారు. ధరల పెరుగుదల, లఖింపుర్​ ఖేరి ఘటన సహా ఇతర అంశాలపై చర్చకు అనుమతించకపోటవాన్ని తప్పుపట్టారు రాహుల్​.

"వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. నిరంతరం దాడి జరుగుతోంది. అందుకే మేము పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్​ను ఎలా నిర్వహించాలో తెలియని ప్రభుత్వం ఇది. ధరల పెరుగుదల, లఖింపుర్​, ఎంఎస్​పీ, లద్దాఖ్​, పెగసస్​, ఎంపీల సస్పెన్షన్​ వంటి అంశాలను లేవనెత్తకుండా మమ్మల్ని నిలువరించలేరు. మీకు ధైర్యం ఉంటే.. చర్చకు అనుమతించండి. లఖిపుర్​పై చర్చ చేపట్టాలి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

లద్దాఖ్​కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే అంశాన్ని లేవనెత్తాలనుకుంటున్నాని, అందుకు ప్రభుత్వం అనుమతించటం లేదని ఆరోపించారు రాహుల్​. లద్దాఖ్​ ప్రజలు భయపడొద్దని, మీ ఆస్తి మీకే చెందుతుందని పేర్కొన్నారు.

ఖర్గే ఆరోపణలు..

విపక్షాల ఆందోళనలకు ఓ పరిష్కారం కనుగొనేందుకు రాజ్యసభలో సస్పెన్షన్​కు గురైన ఎంపీల పార్టీలతో చర్చిస్తామని కేంద్రం పేర్కొనటాన్ని తప్పుపట్టారు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్​ ఖర్గే. వారు విపక్ష పార్టీలను విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.

" 15-16 పార్టీలు సస్పెన్షన్​కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. వారు కేవలం 5 పార్టీలను చర్చలకు పిలిచి మమ్మల్ని విడదీస్తున్నారు. వారికి ఈ విభజించు-పాలించు సూత్రం బ్రిటీష్​ వాళ్లు ఇచ్చారు. వారికి మాట్లాడేందుకు ఏమీ లేనప్పుడే ఇలాంటివి చెబుతారు. అది చాలా చౌకబారు ప్రకటన. అలాంటి ప్రకటనతో ఏ పార్టీ బలహీనపడదు. తప్పు చేశామని ముందుగా వారు అంగీకరించాలి. నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్​ చేశారా? నింబధనలు ఉల్లంఘించి సస్పెండ్​ చేశారు. ఆ సస్పెన్షన్​ను ఎత్తివేయాలని చెబుతున్నాం. దాంట్లో తప్పు ఏమి ఉంది? "

- మల్లికార్జున్​ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.

సమావేశానికి విపక్షాలు దూరం..

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్​పై విపక్షాలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో సమస్యకు చెక్​ పెట్టేందుకు.. చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ క్రమంలో సస్పెండ్​ అయిన 12 మంది సభ్యుల పార్టీలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భేటీకి ఏ ఒక్క విపక్ష నేత కూడా హాజరుకాలేదు.

వారికి ఇష్టం లేదు..

Piyush Goyal news: విపక్షాలకు పార్లమెంట్​ సవ్యంగా నడవటం ఇష్టం లేదని ఆరోపించారు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించటమే వారి అజెండా అన్నారు. సస్పెండ్​ అయిన 12 మంది రాజ్యసభ ఎంపీలు వారు చేసిన తప్పును తెలుసుకుని.. ఛైర్మన్​తో మాట్లాడాలని సూచించారు. సోమవారం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి విపక్ష నేతలు హాజరు కాలేదని స్పష్టం చేశారు.

వెంకయ్య అసహనం..

Venkaiah Naidu speech in parliament: 12 మంది ఎంపీల సస్పెన్షన్​పై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే అంశంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. శూన్య గంట సమయంలో విపక్షాలు ఆందోళనలు చేపట్టి సభలో గందరగోళం సృష్టించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో క్రమశిక్షణతో మెలగాలని, సభా మర్యాదను కాపాడాలని సూచించారు.

ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 5 పార్టీలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమైతే.. ఏ పార్టీ హాజరుకాలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్​.. ఛైర్మన్​కు వివరించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాలు కూర్చొని సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాలని శుక్రవారం సభను వాయిదా వేసినట్లు గుర్తు చేశారు వెంకయ్య.

ఇదీ చూడండి: ఎంపీల సస్పెన్షన్​పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.