ద్రౌపదీ ముర్ముకు పోలైన ఓట్లు 64.03శాతం ఓట్లు

author img

By

Published : Jul 21, 2022, 11:06 AM IST

Updated : Jul 21, 2022, 10:52 PM IST

presidential-election-results-counting-of-votes-today

22:50 July 21

  • భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీముర్ము
  • విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ముర్ము జయకేతనం
  • రాష్ట్రపతిగా ద్రౌపదీముర్ము ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు
  • ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీముర్ముకు వచ్చిన ఓట్లు 2,824
  • ద్రౌపదీముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 6,76,803
  • ద్రౌపదీముర్ముకు వచ్చిన ఓట్ల శాతం 64.03
  • విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు వచ్చిన ఓట్లు 1,877
  • యశ్వంత్‌ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 3,80,177
  • యశ్వంత్‌ సిన్హాకు వచ్చిన ఓట్ల శాతం 35.97
  • తెలంగాణలో పోలైన 117 ఓట్లలో ద్రౌపదీముర్ముకు 3 ఓట్లు
  • ద్రౌపదీముర్ము ఖాతాలో చేరిన ఏపీలో పోలైన మొత్తం 173 ఓట్లు

20:38 July 21

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము విజయం సాధించడంతో ఆమె స్వగ్రామం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

20:22 July 21

  • ద్రౌపదీముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా
  • ద్రౌపదీముర్ముకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
  • ద్రౌపదీముర్ముకు అభినందనలు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

20:01 July 21

మూడో రౌండ్‌ ముగిసే సమయానికి ద్రౌపదీ ముర్ము 50శాతం మార్కును దాటారు. మూడో రౌండ్‌లోనూ ద్రౌపదీముర్ము ఆధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు పోలయ్యాయి. దీంతో ద్రౌపదీముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్‌ సి‌న్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062. దీంతో సాంకేతికంగా ముర్ము గెలుపు లాంఛనమే అయ్యింది.

17:32 July 21

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.

14:45 July 21

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.
రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి ఎన్నికల విజేతను ప్రకటించనున్నారు.

10:53 July 21

'రాష్ట్రపతి ఎన్నిక' ఓట్ల లెక్కింపు షురూ.. 'ముర్ము' విజయం లాంఛనమే

Presidential Polls Results: భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో కొద్దిగంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. పార్లమెంటు భవనంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభం అవగా.. సాయంత్రం 3-4 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం ముఖాముఖి తలపడ్డారు. ముర్ముకు తగినంత మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్‌ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజార్టీతో గెలుస్తారని అంచనాలున్నాయి. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్‌ ఈ నెల 18న పార్లమెంటు భవనంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. సంబంధిత బ్యాలెట్‌ పెట్టెలన్నీ ఇప్పటికే పార్లమెంటు హౌస్‌కు చేరుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాన రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేస్తారు. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ వెంటనే పి.సి.మోదీ ఫలితం సరళిని మీడియాకు తెలియజేస్తారు. ఆపై ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది.

ఇవీ చూడండి: 'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు

యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి..

Last Updated :Jul 21, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.