ETV Bharat / bharat

'మన్​కీ బాత్​ ఓ కార్యక్రమం కాదు.. విశ్వాసం ఇచ్చే వేదిక'

author img

By

Published : Apr 30, 2023, 11:46 AM IST

Updated : Apr 30, 2023, 1:31 PM IST

pm modi mann ki batt hundred episode
pm modi mann ki batt hundred episode

మన్‌ కీ బాత్‌ కేవలం ఒక కార్యక్రమం కాదని.. తనకు విశ్వాసం ఇచ్చిన వేదికని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలతో ఎలా అనుసంధానం అవ్వాలి అనే ప్రశ్నకు మన్‌ కీ బాత్‌ సమాధానం ఇచ్చిందని ఆయన వివరించారు. మోదీ మనసులో మాట అయిన మన్‌కీబాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనూ మన్‌కీ బాత్‌ ప్రసారం చేశారు.

Mann Ki Baat 100 Episode : ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ.. దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునే మన్‌కీబాత్‌ కార్యక్రమం వందో ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు. మన్​కీ బాత్‌ కేవలం ఒక కార్యక్రమం కాదని.. తనకు విశ్వాసం ఇచ్చిన వేదికని మోదీ అన్నారు. ప్రజలతో ఎలా అనుసంధానం అవ్వాలి అనే ప్రశ్నకు మన్​కీ బాత్‌ సమాధానం ఇచ్చిందని ఆయన వివరించారు.

"2014లో విజయదశమి రోజున మన్‌కీ బాత్‌ కార్యక్రమం మొదలుపెట్టాం. దేశ నలుమూలల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మన్‌కీ బాత్‌లో చర్చించాం. సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. సామాన్యులతో అనుసంధానానికి ఈ కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోని భావోద్వేగాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనలను ప్రజలతో పంచుకున్నాను. సామాన్యులకు సంబంధించి ప్రతినెలా కొన్ని వేల సందేశాలు చదివాను. మన్​కీ బాత్‌ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. అసామాన్య సేవలందించిన వ్యక్తుల గురించి తెలుసుకోగలిగాను.అసామాన్య సేవలందిస్తున్న ప్రజలతో మాట్లాడే అవకాశం లభించింది."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దేశంలో మన్ కీ బాత్ కార్యక్రమం సానుకూల దృక్పథాన్ని పెంచిందని ప్రజలందరూ జరుపుకునే పండుగలా మారిందని మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మోదీ తెలిపారు. సామాన్యులకు సంబంధించి ప్రతినెలా కొన్ని వేల సందేశాలు మన్‌ కీ బాత్‌లో చదివానన్న మోదీ ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. అసామాన్య సేవలు అందించిన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం.. మన్‌ కీ బాత్‌ ద్వారా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం అందించడం, ప్రకృతి రక్షణకు నడుం బిగించడం వంటి కార్యక్రమాలు తనలో ప్రేరణ నింపాయని పేర్కొన్నారు. మ‌న్ కీ బాత్‌ కోట్లాది మంది భార‌తీయుల ప్రతిబింబమని వారి భావాల వ్యక్తీకరణ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో సామూహిక ఉద్యమాలు ఊపందుకోవడంలో మన్ కీ బాత్‌ దోహదం చేసిందని ప్రధాని అన్నారు.

వందో ఎపిసోడ్ సమయం ప్రసారానికి ముందుగా మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించిన కొంతమందితో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. మన్‌ కీ బాత్‌ రేడియో ప్రసారం కోట్లాది మంది భారతీయుల భావాలను వ్యక్తీకరిస్తుందన్న మోదీ.. ఇది ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉండదని అన్నారు. సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం తనను ఎంతో ప్రభావితం చేసిందన్న మోదీ.. ఆ కార్యక్రమాన్ని తాను మన్‌ కీ బాత్‌లోనే ప్రకటించినట్లు తెలిపారు. అనంతరం సెల్ఫీ విత్ డాటర్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంగా మారిందని మోదీ గుర్తు చేసుకున్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ప్రజల నుంచి తాను ఎప్పటికీ విడిపోనని నిర్ధరిస్తుందని అన్నారు.

"మన్ కీ బాత్‌ అంటే ఇతరులలోని మంచి లక్షణాలను ఆరాధించడమే. నాకు ఓ మార్గదర్శి ఉన్నారు. ఆయన పేరు లక్ష్మణరావు ఇనామ్‌దార్. మేం ఆయనను వకీల్ సాహెబ్ అని పిలిచేవారం. ఇతరులలోని మంచి లక్షణాలను మనం ఆరాధించాలని ఆయన ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు. మీ సమక్షంలో ఎవరు ఉన్నా సరే, వారు మీ అనుకూలురైనా, ప్రత్యర్థులైనా సరే, వారిలోని మంచి లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. లక్ష్మణరావు ఇనామ్‌దార్‌లోని ఈ లక్షణం నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోంది. ఇతరుల మంచి లక్షణాల నుంచి నేర్చుకునే గొప్ప మాధ్యమంగా మన్ కీ బాత్ మారింది"

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మన్ కీ బాత్‌ వందో ఎపిసోడ్ సందర్భంగా తనకు ప్రజల నుంచి వేలాది ఉత్తరాలు వచ్చాయని, లక్షలాది సందేశాలు వచ్చాయని మోదీ తెలిపారు. సాధ్యమైనన్ని ఉత్తరాలను చదివానని.. వాటిలోని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఉత్తరాలను చదివేటపుడు చాలాసార్లు తాను భావోద్వేగానికి గురయ్యానని మోదీ అన్నారు. ఎంతో మానసిక ఉద్వేగానికి గురై, తనను తాను సముదాయించుకున్నానని చెప్పారు.మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అనేక నెలలు, సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని మోదీ అన్నారు.

న్యూయార్క్​, న్యూజెర్సీలో ప్రత్యేక తీర్మానాలు
నరేంద్ర మోదీ.. దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునే మన్‌ కీ బాత్‌ వందో ఎపిసోడ్​ను గౌరవిస్తూ అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ప్రత్యేక తీర్మానాలు చేశాయి. అనంతరం వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​కు అందజేశాయి.

ఐరాసలో మన్​కీ బాత్​ ప్రసారం..
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనూ ప్రధాని మోదీ మన్​కీ బాత్‌ వందో ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. అమెరికాలో నిర్వహించిన మన్​కీ బాత్‌ వందో ఎపిసోడ్‌లో ప్రవాసాంధ్రులతో కలిసి విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. మోదీ మన్​కీ బాత్‌.. భారత గళాన్ని విశ్వవ్యాప్తం చేసిందని ఆయన కొనియాడారు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ఎన్​ఆర్​ఐలు.. హై కమిషన్‌ అధికారులతో కలిసి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కనీవినీ ఎరుగని ఏర్పాట్లతో..
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ మన్​కీ బాత్‌ వందో ఎపిసోడ్‌ను కనీవినీ ఎరుగని ఏర్పాట్లతో కోట్లాది మంది ప్రజలు ఆలకించేలా భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో.. ప్రజలు మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. దేశంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సరాసరిన వంద చోట్ల ప్రజలు ఆలకించేలా కమలం పార్టీ ఏర్పాట్లు చేసింది. గవర్నర్ల అధికారిక నివాసమైన అన్నిరాష్ట్రాల రాజ్ భవన్లు, భాజపా పాలిత రాష్ట్రాలు, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రుల నివాసాల్లో మన్‌ కీ బాత్‌ వందో ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.

pm modi mann ki batt hundred episode
మన్​కీ బాత్​ ప్రసార కార్యక్రమంలో మహారాష్ట్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

మహాలో అమిత్​ షా.. కర్ణాటకలో నడ్డా
మహారాష్ట్రలో జరిగిన వందో మన్​కీ బాత్ ఎపిసోడ్‌ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే పాల్గొన్నారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

pm modi mann ki batt hundred episode
మన్​కీ బాత్​ ప్రసార కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నిజంగా ప్రత్యేకమైనది!
అంతకుముందు.. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ.. మన్​కీ బాత్​ వందో ఎపిసోడ్​ చేరుకున్న నేపథ్యంలో ట్వీట్​ చేశారు. "ఆదివారం ఉదయం 11 గంటలకు మన్​కీ బాత్ వందో ఎపిసోడ్‌ను ట్యూన్ చెయ్యండి. నిజంగా ఇది ప్రత్యేక జర్నీ. ఇందులో మనం భారతదేశ ప్రజల సామూహిక స్ఫూర్తి, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను హైలైట్ చేసుకున్నాం" అని ట్వీట్‌లో తెలిపారు మోదీ.

2014లో అధికారం చేపట్టిన తర్వాత..
ప్రధానమంత్రిగా 2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునేందుకు మన్​కీ బాత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతినెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్​ఇండియా రేడియోలో ప్రసారం అవుతోంది. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమం ఇప్పటికే 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఆదివారం వందో ఎపిసోడ్‌ ప్రసారమైంది.

బిల్​ గేట్స్​ ప్రశంసల వర్షం!
మన్‌కీ బాత్‌ కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి వంటి విషయాల్లో మన్‌కీ బాత్‌ సమాజాన్ని, ప్రజలను కార్యోన్ముఖులను చేసిందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తెలిపారు. మోదీకి ఆయన ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

విద్య, ఆవిష్కర్తల అంశాలదే పైచేయి
మన్‌కీ బాత్‌లో విద్య, గుర్తింపు లేకుండా అట్టడుగున ఉన్న ఆవిష్కర్తలను వెలుగులోకి తీసుకురావడమనే అంశాలదే పైచేయని సర్వేలో తేలింది. ప్రధాని వందో మన్‌కీ బాత్‌ ప్రసారం కానున్న సందర్భంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (ఐఐఎంసీ) ఈ సర్వే చేసింది. ఈ కార్యక్రమాన్ని రేడియోలో కంటే ఇంటర్నెట్‌ ద్వారానే ఎక్కువ మంది విన్నట్లు తేలింది. రేడియోలో 12శాతం, టీవీలో 15 శాతం, ఇంటర్నెట్‌లో 37శాతం మంది విన్నారు.

Last Updated :Apr 30, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.