ETV Bharat / bharat

'శాస్త్రవేత్తల అనుమతి లభించిన వెంటనే వ్యాక్సినేషన్​'

author img

By

Published : Dec 4, 2020, 1:55 PM IST

Updated : Dec 4, 2020, 5:00 PM IST

కొవిడ్  పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, వ్యాక్సిన్ సరఫరాపై ప్రభుత్వం సన్నద్ధత గురించి రాజకీయ పార్టీలు వాకబు చేసినట్లు సమాచారం.

PM chairs all-party meeting on COVID-19 situation
టీకా వస్తోంది.. వారికే తొలి ప్రాధాన్యం: మోదీ

కరోనా టీకా వినియోగానికి శాస్త్రవేత్తల అనుమతి లభించిన వెంటనే.. వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్​ పంపిణీపై చర్చించేందుకు వర్చువల్​గా ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మోదీ.. ఈ మేరకు స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ వచ్చేందుకు ఇక ఎంతోకాలం పట్టదని, కొన్నివారాల్లోనే సిద్ధం అవుతుందని నిపుణులు చెప్పినట్లు మోదీ తెలిపారు.

"వ్యాక్సిన్​ టీకా ధరపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చిస్తోంది. ప్రజా ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యం. ధర నిర్ణయంలో అదే మా తొలి ప్రాధాన్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీకి పనిచేస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సిన్​ సామర్థ్యం, పంపిణీ విషయంలో మన దేశం ముందంజలో ఉంది. వ్యాక్సిన్​ రంగంలో మనకు చాలా అనుభవం ఉంది. కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు. వారు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తాం.

వ్యాక్సిన్​ సామర్థ్యంపై మన శాస్త్రవేత్తలు అపారమైన విశ్వాసం ప్రకటించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్​వైపే చూస్తోంది. చౌకగా వ్యాక్సిన్​ అందించగలిగే సామర్థ్యం భారత్​కే ఉంది. మీ విలువైన సూచనలు, సలహాలను లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అందజేయాలని అన్ని పార్టీల నేతలను నేను కోరుతున్నాను. మీ సలహాలకు ప్రాధాన్యం ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను."

- నరేంద్ర మోదీ, ప్రధాని

కరోనా టీకాను తొలుత కోటి మందికిపైగా ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత కొవిడ్ పోరులో ముందుండి పోరాడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మోదీ సర్కార్​.. అన్ని పార్టీలకు తెలియజేసినట్లు సమాచారం.

తొలుత వీరికే..

వైద్యులు, నర్సులు సహా కోటి మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలకే తొలుత టీకా అందించనున్నారు. అనంతరం దాదాపు రెండు కోట్ల మంది పోలీసులు, సైనికులు, మున్సిపల్​ సిబ్బందికి ఇస్తారు.

ఎవరెవరు వచ్చారు..?

  1. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ ఎంపీలు ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి 13 మంది నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
  2. రాజ్యసభలో ప్రతిపక్షనేత అయిన గులాం నబీ ఆజాద్​ సమావేశంలో కొవిడ్​ టీకా పంపిణీపై ప్రధానికి పలు సూచనలు చేసినట్లు సమాచారం.
  3. టీఎంసీ నుంచి సుదీప్​ బంధోపాధ్యాయ్​, ఎన్​సీపీ నుంచి శరద్​ పవార్​, తెరాస​ నుంచి నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్​ రౌత్​ సహా పలువురు సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
  4. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, హోం మంత్రి అమిత్​ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ కూడా భేటీలో ఉన్నారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
  5. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమయ్యాక కొవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం ఇది రెండోసారి.

కలిసి పనిచేయాలి: ఆజాద్​

కరోనా లాంటి మహమ్మారులు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని అఖిల పక్ష భేటీలో వ్యాఖ్యానించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. ఆ సవాలును స్వీకరించాలని అన్నారు. కొవిడ్​ వ్యాక్సిన్​ను భారత్​ సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. టీకాతో దీర్ఘకాల ప్రతికూల ప్రభావం పడుతుందా అనే అంశంపై పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, రాజకీయ నేతలు.. వ్యాక్సిన్​ ప్రాధాన్యం, పంపిణీపై కలిసి పనిచేయాలని కోరారు ఆజాద్​.

Last Updated :Dec 4, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.