ETV Bharat / bharat

రాజ్యసభ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన జగదీప్

author img

By

Published : Dec 7, 2022, 10:36 AM IST

Updated : Oct 4, 2023, 3:23 PM IST

Parliament Winter Session 2022
Parliament Winter Session 2022

11:24 December 07

మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన లోక్​సభ

ప్రారంభమైన లోక్​సభ మధ్యాహ్నం 12 గంటల వాయిదా పడింది. ఇటీవల మృతి చెందిన సభ్యుడు ములాయం సింగ్ యాదవ్​కు సంతాపం తెలిపింది. మరోవైపు రాజ్యసభలో ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాజ్యసభ చైర్మన్​గా సభా కార్యకలాపాలు చేపట్టారు జగదీప్ దన్​ఖడ్. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి గౌరవార్థం.. రాజ్యసభలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

10:46 December 07

దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలి: ప్రధాని

parliament winter session 2022
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. చర్చలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశాల్లో కొత్తగా సభకు ఎన్నికైన వారు, యువకులకు చర్చల్లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని అన్ని పార్టీలకు సూచించారు. సమావేశాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జీ 20కి భారత్‌ అధ్యక్షత వహించిన వేళ.. ఈ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యమని అన్నారు. ప్రపంచ వేదికలపై భారత్‌ భాగస్వామ్యం పెరుగుతోందన్న మోదీ.. ఇప్పుడు జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అదృష్టం లభించిందన్నారు. జీ 20 కేవలం దౌత్య సమావేశం మాత్రమే కాదని అంతర్జాతీయంగా మన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అద్భుత అవకాశమని పేర్కొన్నారు.

09:59 December 07

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు

Parliament Winter Session 2022 : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాజ్యసభ చైర్మన్​గా సభా కార్యకలాపాలు చేపట్టనున్నారు జగదీప్ దన్​ఖడ్. ఉపరాష్ట్రపతి గౌరవార్థం.. రాజ్యసభలో సన్మాన కార్యక్రమం జరగనుంది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. ప్రధాని ఉపన్యాసంతో సన్మాన కార్యక్రమం జరగనుంది. ఆ తదుపరి సభా కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఎంపీలకు సందేశాలు పంపింది రాజ్యసభ సచివాలయం.

ఈనెల 29 వరకు జరగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉభయ సభలు మొత్తం 17రోజులపాటు సమావేశం కానుండగా.. కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులు ప్రవేశపెట్టనుంది. వాటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ-స్టేట్ కోపరేటివ్ సొసైటీలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ మూడు బిల్లులను స్థాయీసంఘం పరిశీలనకు పంపాలని.. వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.

శీతాకాల సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చడం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ఈడబ్ల్యూఎస్​ కోటా అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలవ పతనం, ఎగుమతుల తగ్గుదల, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్​టీ పన్నుల అంశాలు కూడా ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర విపక్షాల నేతలు తెలిపారు.

శీతాకాల సమావేశాల్లో కోఆపరేటివ్‌ సొసైటీల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, కంటోన్‌మెంట్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో విపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు.

Last Updated :Oct 4, 2023, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.