ETV Bharat / bharat

పార్లమెంట్​లో అదే సీన్.. 'మణిపుర్'​పై ప్రధాని ప్రకటనకు విపక్షాల డిమాండ్.. అమిత్​షా హామీ ఇచ్చినా..

author img

By

Published : Jul 24, 2023, 4:48 PM IST

parliament monsoon session 2023
parliament monsoon session 2023

Parliament Monsoon Session 2023 : మణిపుర్‌ ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే మణిపుర్‌ అమానవీయ ఘ‍టనపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటించినా ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. ప్రధాని ప్రకటన చేయాల్సిందే అని నినాదాలు చేశారు. ఈ నిరసనలతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి.

Parliament Monsoon Session 2023 : మణిపుర్‌ ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపుర్ ఘటనపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే.. మణిపుర్‌ ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

విపక్షాల నిరసన..
Opposition Protest In Parliament : విపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇండియా ఫర్ మణిపుర్‌, మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనలతో స్పీకర్‌ ఓంబిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగగా సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

'మణిపుర్ అంశంపై చర్చకు సిద్ధం'
Manipur Violence Amit Shah : సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశమైనప్పడు ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో మాట్లాడారు. మణిపుర్‌ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని.. చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

"విపక్ష ఎంపీలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. సభలో చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. విపక్ష నేతలు చర్చను ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. చర్చ జరగనివ్వాలని నేను ప్రతిపక్షాలను కోరుతున్నాను. ఈ సున్నితమైన అంశంలో నిజా నిజాలను దేశం తెలుసుకోవడం చాలా ముఖ్యం."
-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

రాజ్యసభ వాయిదా..
రాజ్యసభలోనూ మణిపుర్‌ ఘటనపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం అయినప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. తొలుత 12 గంటలకు, తర్వాత రెండు గంటలకు, తర్వాత మూడు గంటలకు సభ వాయిదా పడింది. మూడు గంటలకు సభ ప్రారంభం అయినా సభ నడిపేందుకు అనువైన పరిస్థితులు లేవంటూ ఛైర్మన్‌ జగ్​దీప్ ధన్​ఖడ్​ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఆప్ ఎంపీ సస్పెండ్..
Rajya Sabha Adjourned Today : రాజ్యసభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్​ను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగ్​దీప్ ధన్​ఖడ్​ ప్రకటించారు. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత సంజ‌య్ సింగ్ .. వెల్‌లోకి దూసుకువెళ్లి మ‌ణిపుర్ అంశంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుబట్టారు. ఛైర్మన్‌ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ ఆదేశించినా.. ఎంపీ సంజ‌య్ వెన‌క్కి వెళ్లలేదు. సంజ‌య్‌ను స‌స్పెండ్ చేయాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టగా.. ఛైర్మన్‌ దాన్ని ఆమోదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.