ETV Bharat / opinion

పార్లమెంట్​కు వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు!.. పౌరులకు లాభమా? నష్టమా?

author img

By

Published : Jul 6, 2023, 5:44 PM IST

Data Protection Bill 2022 : వర్షాకాల పార్లమెంట్​ సమావేశాల్లో డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2023ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్​ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా చర్చ మొదలైంది. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థలు రూ. 250 కోట్ల వరకు జరిమానా చెల్లించాలని పలు ప్రతిపాదనలను ఆ బిల్లులో పొందుపర్చిన వేళ.. పౌరులకు లాభమా? నష్టమా? అన్న విషయాలు తెలుసుకుందాం.

Data Protection Bill 2022
Data Protection Bill 2022

Data Protection Bill 2022 : ప్రస్తుత సైబర్‌ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతోంది. అనేక సైబర్‌ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి! వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2023 తీసుకురానుంది.

అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థలు రూ. 250 కోట్ల వరకు జరిమానా చెల్లించాలని పలు ప్రతిపాదనలను ఆ బిల్లులో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో ఓ సారి బిల్లులో ఏఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఇప్పటివరకు మన దేశంలో వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రత్యేకంగా చట్టం లేదు. వ్యక్తిగత డేటా వినియోగం 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం మాత్రమే అమల్లో ఉంది. అయితే ఈ చట్టం ద్వారా వ్యక్తిగత డేటాకు తగిన రక్షణ లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశంలోని డేటా భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో జస్టిస్ బీఎన్​ శ్రీకృష్ణ అధ్యక్షతన డేటా భద్రతపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జులై 2018లో తన నివేదికను సమర్పించింది.

ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏడాది తర్వాత 2019లో వ్యక్తిగత డేటా రక్షణ ముసాయిదా బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చేరింది. ఆ కమిటీ 2021 డిసెంబర్​లో తన నివేదికను సమర్పించింది. అయితే ముసాయిదా బిల్లు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమైన వేళ.. 2022 ఆగస్ట్​లో ముసాయిదా బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 2022 నవంబరులో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ.. ప్రజల నుంచి సూచనలు స్వీకరించింది. ఆ సమయంలో 21,660 మంది స్పందించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి ముసాయిదాకు తుదిరూపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్​లో బిల్ ప్రవేశపెట్టనుంది.

అసలు వ్యక్తిగత డేటా అంటే ఏంటి?
ముసాయిదా బిల్లు ప్రకారం.. వ్యక్తిగత డేటా అంటే ఓ వ్యక్తికు సంబంధించిన పేరు, అడ్రస్​, వాహన నంబర్​ మొదలగు సమాచారం. ఒక వ్యక్తిని గుర్తించడానికి మనం ఉపయోగించే ఏ సమాచారమైనా వ్యక్తిగత డేటా కిందకు వస్తుంది.

ఈ బిల్లు లక్ష్యమేంటి?
వ్యక్తిగత డేటా వినియోగాన్ని పరిమితం చేయడం ఈ బిల్లు లక్ష్యం కాదు. డేటాను వినియోగించే వ్యాపార సంస్థ ప్రయోజనాలను రక్షించడం మధ్య సమతుల్యతను సాధించడమే ఈ బిల్లు లక్ష్యం. దీన్ని సాధించడానికి సంస్థలు.. తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన నిబంధనలతో బిల్లు రూపొందించింది కేంద్రం. సదరు వ్యక్తులు.. తమ డేటాను యాప్​లు, వెబ్‌సైట్‌ల నుంచి తీసుకోవడానికి బిల్లు.. అనేక హక్కులను కల్పించనుంది.

వ్యక్తులకు ఈ బిల్లు కల్పించనున్న హక్కులు ఇవే..
డేటాను వినియోగించుకుంటుందో లేదో తెలుసుకునే హక్కు
ఒక కంపెనీ.. వ్యక్తిగత డేటాను ప్రాసెస్​ చేస్తుందా లేదా చేసిందా తెలుసుకునే హక్కు సదరు వ్యక్తికి ఈ బిల్లు కల్పించనుంది. డేటా ప్రాసెసింగ్​తోపాటు ఇతర వ్యక్తిగత హక్కులను వినియోగించుకోవడంలో కంపెనీ పాత్రను సదరు వ్యక్తి అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం.

సమాచారాన్ని సరిచేసే చేసే హక్కు
వ్యక్తులు తమ వ్యక్తిగత డేటాను సరిచేసే లేదా తొలగించే హక్కును ఈ బిల్లు కల్పించనుంది. దాని ద్వారా వ్యక్తిగత వివరాల్లో స్పెల్లింగ్‌ను సరిచేయొచ్చు. చిరునామా, ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​ వంటి వివరాలు మార్చొచ్చు. అవసరం లేని డేటాను తొలగించొచ్చు.

ఉదాహరణకు.. మనం ఏదైనా ఈ-కామర్స్​ ప్లాట్​ఫామ్​లో వస్తువును కొనుగోలు చేసినప్పుడు మన చిరునామా ఇస్తాం. ఆ తర్వాత ఆ వివరాలు అందులో ఎప్పటికీ ఉంటాయి. ఈ హక్కు ప్రకారం.. అవసరం లేకుంటే ఆ సమచారాన్ని మనం తొలగించవచ్చు.

ఫిర్యాదు చేసే హక్కు
వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే.. సదరు కంపెనీ కార్యాలయాన్ని సంప్రదించే హక్కును ఈ బిల్లును కల్పించనుంది. ఆయా వ్యక్తుల సమస్యలకు పరిష్కారం చూపేలా కంపెనీలు సమర్థమైన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. అయితే గ్రీవెన్స్ ఆఫీసర్ అందించిన సమాధానంతో వ్యక్తులు సంతృప్తి చెందకపోతే.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేటా ప్రొటెక్షన్ బోర్డ్​కు ఏడు రోజుల్లోగా ఫిర్యాదు చేయొచ్చు. శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి హక్కులను వినియోగించుకోవడానికి మరొక వ్యక్తిని నామినేట్ చేసే హక్కును కూడా ఈ బిల్లు కల్పించనుంది.

పర్మిషన్​ను ఉపసంహరించుకునే హక్కు
వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ కోసం ఇచ్చిన పర్మిషన్​ను ఉపసంహరించుకోవచ్చు. రుణాలు, చట్టపరమైన కార్యకలాపాలాల్లో ఇచ్చిన సమ్మతిని మనం వెనక్కితీసుకోవచ్చు.
అయితే పర్మిషన్​ ఉపసంహరించుకున్న తర్వాత జరిగే పరిణామాలను సదరు వ్యక్తులే భరించాలి. ఉదాహరణకు.. బ్యాంక్​ ఖాతా విషయాల్లో సదరు వ్యక్తి సమ్మతిని ఉపసంహరించుకుంటే.. ఆయా బ్యాంక్​ నిబంధనల ప్రకారం ఖాతా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

ముఖ్యమైన విధులు..
వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు.. వ్యక్తులకు సాధికారత కల్పించడమే కాకుండా హక్కులను దుర్వినియోగం కాకుండా ఉండేలా చూస్తుంది. అందుకు కొన్ని విధులను నిర్దేశిస్తుంది. అవేంటంటే?

  • బిల్లులో పేర్కొన్న విధానాలకు అనుగుణంగా వ్యక్తులు తమ హక్కులను వినియోగించుకోవాలి.
  • తప్పుడు ఫిర్యాదులు చేయకూడదు.
  • వివిధ సేవల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పౌరులు తప్పుడు సమాచారాన్ని అందించకూడదు.
  • సమాచారాన్ని సరిచేసినప్పుడు కచ్చితమైనవే పొందుపరచాలి.

ఇదీ చదవండి: వ్యక్తిగత డేటా పరిరక్షణకు బిల్లుకు కేబినెట్ ఓకే.. రూల్స్ ఉల్లంఘిస్తే రూ.250 కోట్ల ఫైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.