ETV Bharat / bharat

'పద్మశ్రీ'కి అవమానం.. నడిరోడ్డుపైకి 90 ఏళ్ల కళాకారుడు

author img

By

Published : Apr 28, 2022, 8:08 PM IST

Padma Shri awardee
Padma Shri awardee

Padma Awardee evicted: పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇంటిని ఖాళీ చేయించి నడ్డి రోడ్డుపై నిలబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన అద్భుతమైన కళతో దేశానికి ఎంతో సేవ చేసిన కళాకారుడికి ఇలాంటి బహుమతి ఇస్తారా అంటూ పలువురు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. దేశంలోని కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదిస్తున్నారు. ఒడిస్సీ నృత్యకారుడైన గురు మయధర్‌ రౌత్‌ను తన వసతి గృహం నుంచి అధికారులు ఎందుకు ఖాళీ చేయించారు?. ఖాళీ చేయించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఘటనపై మయధర్‌ కూతురు ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం.

Padma Awardee evicted: దేశ రాజధాని దిల్లీలోని వసతి గృహం నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీతను బలవంతంగా ఖాళీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిస్సీ నృత్యకారుడైన 90 ఏళ్ల గురు మయధర్‌ రౌత్‌ ఉంటున్న ఇంటిని అధికారులు మంగళవారం ఖాళీ చేయించారు. దీంతో గత్యంతరం లేక ఆయన తన కుమార్తెతో కలిసి తన శిష్యురాలి ఇంట్లో తలదాచుకుంటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతను ఇలా నడిరోడ్డుపైకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వసతి గృహాంపై దిల్లీ హైకోర్టులో విచారణ జరగుతుండగా ఇలా హడావిడిగా అధికారులు ఖాళీ చేయించడంపై... మయధర్‌ కుమార్తె మధుమితా రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. నాట్యంతో ఎన్నో సేవలందించిన మయధర్‌కు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని ఆయన కుమార్తె వాపోయారు. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఈ ఘటన నిరాశజనకమైంది, మమ్మల్ని ఎంతో బాధించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంటిబెల్‌ మోగింది. అప్పుడు నేను మా నాన్నకు భోజనం పెడుతున్నా. అధికారులు వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపొమ్మన్నారు. కొంచెం సమయం కూడా ఇవ్వలేదు. 12-15 మంది పోలీసులు, కూలీలు వచ్చారు. కదలండి.. ఇంటిని వెంటనే ఖాళీ చేసి బయటకు వెళ్లండని ఆదేశించారు. నేను వాళ్లను కొంచెం శాంతించమని అడిగాను. గురుజీ భోజనం చేస్తున్నారని చెప్పాను.కానీ వారు నా మాట వినలేదు. రెండు నిమిషాల్లో ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. గురుజీ ఉపయోగించే బల్లను బయటకు లాగేశారు. అదొక పెద్ద దాడిలా అనిపించింది. ఇదంతా చూసి మా నాన్న షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మా నాన్న మరణించేవారే."

-మధుమితా రౌత్‌, మయధర్‌ కుమార్తె

ప్రముఖ నృత్యకారుడు గురు మయధర్‌ రౌత్‌ గత కొన్నేళ్లుగా దిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖ కళాకారులకు చాలా ఏళ్ల క్రితమే ఈ వసతులు కేటాయించగా... 2014లో వీటిని రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేదు. వీరిలో చాలా మంది తమ బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఏప్రిల్‌ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయధర్‌ రౌత్‌ వెళ్లకపోవడంతో అధికారులే స్వయంగా వచ్చి ఖాళీ చేయించారు.

ఇంట్లోని సామానంతా వీధిలో పెట్టడంతో... ఆ వృద్ధ కళాకారుడు నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై కన్పించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కళాకారుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇళ్లు ఖాళీ చేయని మరో 8 మంది కళాకారులకు మే 2 వరకు గడువు ఇచ్చినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వీరందరికీ పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. తాము బంగళాలను ఖాళీచేసే పనిలోనే ఉన్నామని.. అయితే కొంత సమయం కావాలని వారు కోరినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జైల్లో తల్లిదండ్రులు.. విడుదల కావాలని హీరోయిన్ కుమార్తె పూజలు

సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. కన్నతల్లిని కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.