ETV Bharat / bharat

Onion Price Hike : ఉల్లి ధరకు రెక్కలు.. తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 5:27 PM IST

Onion Price Hike : దేశంలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో నిల్వ ఉంచిన ఉల్లిని విక్రయించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కిందటి ఏడాదితో పోలిస్తే 57 శాతం పెరిగిన ఉల్లి ధర.. ప్రస్తుతం కిలో రూ.47 పలుకుతోంది.

Onion Price In India
Onion Price Hike

Onion Price Hike : దేశంలోని రిటైల్​ మార్కెట్​లో ఉల్లి ధర ఒక్కసారిగా 57 శాతానికి పెరిగింది. దీంతో వినియోగదారులుకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. నిల్వ ఉంచిన ఉల్లి స్టాక్​ను సబ్సిడీ కింద అమ్మేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో రూ.30గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.47కు చేరుకుంది.

సబ్సిడీ@రూ.25..!
ఉల్లి ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం.. కిలోకు రూ.25ల సబ్సిడీ కింద రిటైల్ మార్కెట్‌లలో దీనిని విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

దిల్లీలో ఉల్లి ధర..
Onion Price In Delhi : దేశవ్యాప్తంగా రిటైల్​ మార్కెట్​లో సగటు ఉల్లి ధర శుక్రవారం రూ.47గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 పలుకుతోంది. ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు బఫర్​(నిల్వ) స్టాక్​​ ఎక్కువగా ఉన్న గోదాముల నుంచి ఉల్లిని ఆయా హోల్​సేల్​, రిటైల్​ మార్కెట్​లకు తరలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

"నిల్వ ఉంచిన ఉల్లిపాయల గోదాముల నుంచి స్టాక్​ క్రమంగా ధరలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు తరలివెళ్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు మధ్యలో ప్రారంభించాం. ధరలను నియంత్రించడానికి, అలాగే వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మేము సబ్సిడీ రిటైల్​ విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటివరకు 22 రాష్ట్రాలకు సుమారు 1.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేశాము."

-రోహిత్ కుమార్ సింగ్, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి

ఈ రెండు సంస్థల సహకారంతో..
రిటైల్ మార్కెట్‌లలో నిల్వ ఉంచిన ఉల్లి అమ్మకాల అవుట్​లెట్లను రెండు సహకార సంస్థలు నేషనల్​ కో-ఆపరేటివ్​ కన్స్యూమర్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​(NCCF), నేషనల్​ అగ్రికల్చరల్​ కో-ఆపరేటివ్​ మార్కెటింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్(NAFED) నిర్వహిస్తున్నాయి. అలాగే వాహనాల ద్వారా కూడా సబ్సిడీ కింద రూ.25కే కిలో ఉల్లిని విక్రయిస్తోంది కేంద్రం. దిల్లీలో కూడా ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ కారణంతో..
'వాతావరణంలో మార్పుల కారణంగా ఖరీఫ్ సీజన్​లో ఉల్లి నాట్లను రైతులు ఆలస్యంగా వేశారు. దీంతో పంట రాబడి ఆలస్యం కావచ్చు. ఇప్పటికే పంట చేతికి రావాలి, కానీ రాలేదు. మరోవైపు రబీలో పండించిన ఉల్లి స్టాక్​ కూడా అయిపోవడం, ఖరీఫ్​ ఉల్లి రాకలో ఆలస్యం కారణంగా సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఫలితంగా హోల్​సైల్​, రిటైల్​ మార్కెట్​లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి' అని వినియోగదారుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి NCCF, NAFED భాగస్వామ్యంతో వినియోగదారుల శాఖ 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ ఉంచిందని.. రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.

Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్

Youth Dies After Falling From Swing Boat Viral Video : ఊయల నుంచి జారిపడి యువకుడి మృతి.. దుర్గాపూజలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.