ETV Bharat / bharat

యువతి ముఖంపై మద్యం సీసాతో దాడి.. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని..

author img

By

Published : Nov 17, 2022, 5:22 PM IST

one side love Kerala girl get stabbed by a man with liquor bottle
one side love Kerala girl get stabbed by a man with liquor bottle

ఓ యువతి ముఖంపై మద్యం సీసాతో కిరాతకంగా దాడి చేశాడో వ్యక్తి. అనంతరం ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. ఇక ఓ మైనర్​.. తనను రేప్​ చేసిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఒంటిపై డీజిల్​ పోసుకుని నిప్పంటించుకుంది. మరోవైపు మటన్​ సూప్​లో అన్నం మెతుకు వచ్చిందని వెయిటర్​ను దారుణంగా చంపేశారు ఇద్దరు దుండగులు.

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ యువతిపై కిరాతకంగా మద్యం సిసాతో దాడి చేశాడో వ్యక్తి. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన కిల్​పాక్​ ప్రాంతంలో జరిగింది.
కేరళకు చెందిన సోను జోసెఫ్ అనే 20 ఏళ్ల యువతి ఎయిర్​ హోస్టెస్​ ఇంటర్న్​షిప్ ట్రైనింగ్​ చేస్తోంది. నవంబర్​ 14న ఆమె పని ముగించుకుని హాస్టల్​కు బయలుదేరింది. ఈ క్రమంలో నవీన్​ అనే 25 ఏళ్ల యువకుడు ఆమెను వెంబడించాడు. అనంతరం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడై మద్యం సీసాతో సోను ముఖంపై బాదాడు. ఆపై ఆ సీసాను పగులగొట్టి ఆమె ముఖంపై దాడి చేశాడు.

అంతటితో ఆగకుండా.. యువతిని కడుపులో, మెడపై చేతులతో బలంగా కొట్టాడు. సోను గట్టిగా అరిచేసరికి.. అక్కడనుంచి పారిపోయాడు నవీన్. ఆమె కేకలు విన్న స్థానికులు.. ఆస్పత్రికి తరలించారు. సోను ముఖం, చేతులు, మెడపై ఉన్న గాయాలకు 25 కుట్లు వేసి వైద్యులు చికిత్స అందించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేసి విచారించారు.

Kerala girl get stabbed by a man with liquor bottle
బాధితురాలు, నిందితుడు

విచారణ సమయంలో నిందితుడు.. సోనూతో తనకు ఇదివరకే పరిచయముందని.. తామిద్దరం ఫేస్​బుక్​లో స్నేహితులమని చెప్పాడు. నాలుగు నెలల క్రితం ఆమెను కలిసి.. తాను నేవీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నానని వెల్లడించాడు. అయితే నవీన్​.. ఆమెను ప్రేమిస్తున్నానని చెబితే.. తమ తల్లిదండ్రులకు ఇలాంటివన్నీ నచ్చవని తిరస్కరించిందని వివరించాడు. మళ్లీ ఒకసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సోనూపై నిఘా పెట్టిన నవీన్​.. ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతోందని తెలుసుకుని.. హత్య చేయడానికి ప్రణాళికలు రచించాడు. 'నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదని' ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బాలికపై అత్యాచారం.. డీజిల్​ పోసుకుని నిప్పు..
ఓ​ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు డీజిల్​ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరూఖాబాద్​ జిల్లాలో జరిగింది.
ఫతేగఢ్-​కోత్వాలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ బాలికపై.. అదే గ్రామానికి చెందిన యువకుడు అంకిత్..​ 20 నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి కెసుపెట్టడం వల్ల.. అంకిత్​తో పాటు శుభమ్​ అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

అనంతరం బెయిలుపై బయటకు వచ్చిన నిందితులు.. బాధితురాలిని వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక.. నవంబర్​ 4న డీజిల్​ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై తాజాగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. నిందితులను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏస్పీ అశోక్​ కుమార్​ తెలిపారు. అయితే తనను వివాహం చేసుకోవాలని.. తనను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవద్దని.. బాలికను అంకిత్ బెదిరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మటన్​ సూప్​లో అన్నం మెతుకులు.. వెయిటర్​ హత్య
మటన్ సూప్​లో అన్నం మెతుకులు వచ్చాయని వెయిటర్​ను హత్య చేశారు ఇద్దరు దుండగులు. అక్కడ ఉన్న మరో ఇద్దరు వెయిటర్లపై కూడా తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్​ జిల్లా సంఘ్వి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

waiter murder for finding rice in mutton soup
సాసర్​వాడి మటన్ ఖనావల్​ హోటల్

విజయ్​ రాజ్​ వాఘిరే, అతడి స్నేహితులు.. స్థానిక 'సాసర్​వాడి మటన్ ఖనావల్​' హోటల్​లో తరచూ తినడానికి వస్తుండేవారు. రెండు రోజుల క్రితం మళ్లీ అదే హోటల్​కు వెళ్లారు. అనంతరం మటన్​ సూప్​లో అన్నం మెతుకులు వచ్చాయని వెయిటర్​తో గొడవ పడ్డారు. ఆపై వెయిటర్లు మాంగేశ్​, అజిత్​, సచిన్​పై కర్రలతో దాడికి దిగారు. అందులో మాంగేశ్​ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నిందితులు అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యారు. పోలీసులు నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

లెటర్​ రాసి బాలుడి అత్మహత్యాయత్నం
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అత్మహత్యాయత్నం చేశాడు. రైలు కింద పడి చనిపోవాలని.. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది. గోమతి నగర్​ ఎక్స్​టెన్షన్​ ప్రాంతానికి చెందిన ఆధిత్య తివారీ అనే విద్యార్థి మాంటెస్సోరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్​ అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్న బాలుడు.. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకాడు.

గాయాలతో పడి ఉన్న విద్యార్థిని ఆర్​ఎమ్​ఎల్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఓ బ్యాగ్​ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తనను క్షమించమని బాలుడు రాసిన ఓ లేఖ ఉంది. 'నేను చేసిన తప్పునకు క్షమాపణ కోరుతున్నాను. నేను చేసిన తప్పును మళ్లీ చేయను' అని రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడు అత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

బాలికను అమాంతం రోడ్డుపై విసిరేసిన దుండగుడు
ఓ తొమ్మిదేళ్ల బాలికను.. ఒక వ్యక్తి బలవంతంగా అమాంతం ఎత్తి రోడ్డుపై విసిరేశాడు. ఈ ఘటన కేరళలోని కారసగోడ్​ జిల్లాలో మంగళవారం జరిగింది. మంజేశ్వరం ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిదేళ్ల ముస్లిం బాలిక మదర్సాకు వెళ్తోంది. సిద్ధికీ అనే వ్యక్తి బాలికను బలవంతంగా అమాంతం పైకి ఎత్తి రోడ్డుపై విసిరేశాడు. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సిద్ధికీని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సిద్ధికీకి మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపారు.

ఇవీ చదవండి: కదులుతున్న రైలు ఎక్కేందుకు జవాన్​ యత్నం.. నెట్టేసిన టీటీఈ.. రెండు కాళ్లు కట్​

చంద్రగ్రహణం తర్వాత నుంచి.. రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు! అంతుచిక్కని మిస్టరీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.