ETV Bharat / bharat

'రైల్వేలో భద్రతపై ప్రజల్లో ఆందోళన.. మోదీజీ నిర్లక్ష్యం ఎందుకు?'.. ఖర్గే ప్రశ్నల వర్షం

author img

By

Published : Jun 5, 2023, 12:35 PM IST

Updated : Jun 5, 2023, 1:01 PM IST

Kharge letter to PM : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రైల్వేలో ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సిబ్బంది లేకపోవడం వల్ల లోకో పైలట్లపై పని భారం పెరుగుతోందని అన్నారు.

odisha train accident
odisha train accident

Kharge letter to PM : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దకుండా.. బీజేపీ సర్కారు తన తప్పుడు నిర్ణయాలతో ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. రైల్వేల్లో భద్రతపై ఆ శాఖ మంత్రి చేసిన ప్రకటనలన్నీ అవాస్తవాలని తేలిపోయాయని అన్నారు. రైల్వేలో భద్రత కరవవడంపై సాధారణ ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

"రైల్వేలో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 8278 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఎంఓ, కేబినెట్ కమిటీ నియమించే.. సీనియర్ పోస్టుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. 90వ దశకంలో 18లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు 12 లక్షలకు తగ్గింది. అందులోనూ 3.18 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల ఫలితంగా రిజర్వేషన్ పొందే వర్గాలు తమ అవకాశాలు కోల్పోతున్నాయి.

సుదీర్ఘ పని గంటల వల్ల లోకో పైలట్లపై భారం పడుతోంది. సిబ్బంది లేకపోవడం వల్ల లోకో పైలట్లతో ఎక్కువసేపు పని చేయించుకుంటున్నట్లు ఇటీవలే రైల్వే బోర్డు తెలిపింది. రైల్వే సేఫ్టీ కమిషన్​ సిఫార్సులను పట్టించుకోకపోవడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శలు గుప్పించింది. పట్టాలు తప్పుతున్న ఘటనలు జరుగుతున్నా.. సరైన టెస్టింగ్ నిర్వహించకపోవడాన్ని కాగ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. కవచ్ వ్యవస్థ 4 శాతం మార్గాలకే ఎందుకు పరిమితమైంది? ఈ సమస్యలను గుర్తించేందుకు మీరు, రైల్వే మంత్రి సిద్ధంగా లేరు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

  • Congress President Mallikarjun Kharge writes a letter to Prime Minister Narendra Modi regarding the Balasore train accident. pic.twitter.com/rtc2oLOXoC

    — ANI (@ANI) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Odisha train accident : మరోవైపు, ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య విషయంపై బంగాల్‌ సీఎం మమతాబెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికే చెందినవారు 61మంది మృతి చెందారని, మరో 182మంది ఆచూకీ తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ లెక్కన.. అసలు గణాంకాలు సరైనవేనా అని ప్రశ్నించారు. వందేభారత్‌ రైలు ఇంజిన్ల సామర్థ్యంపైనా దీదీ అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశా ఘటన విషాదకరమైనప్పటికీ.. బీజేపీ తీరే తనను ఈవిధంగా మాట్లాడేలా చేసిందని మమత అన్నారు. తాను, నీతీశ్‌ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను రైల్వేమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త సిగ్నల్ వ్యవస్థ, యాంటీ కొలిజన్ డివైజ్‌ను ప్రవేశపెట్టినట్లు మమత గుర్తుచేశారు. తన హయాంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు.

'రాజకీయాలు సరికాదు'
మృతుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తం చేయడాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. మరణాల వివరాలన్నీ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. 'మమతా బెనర్జీ తన పేరులోని మమతను కోల్పోయారు. మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అక్కడ బీజేపీ అధికారంలో లేదు. తమ ఆప్తులను కోల్పోయిన వారికి అండగా ఉండాల్సిన సమయమిది' అని పేర్కొన్నారు.

'మృతుల సంఖ్యను దాచే ఉద్దేశం లేదు'
ఈ వివాదం నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బాలేశ్వర్ రైలు ప్రమాదంలో మరణాల సంఖ్యను దాచే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. సహాయక చర్యలు అందరి ముందే జరిగాయని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా చెప్పారు. ఒడిశా ప్రభుత్వం పారదర్శకతను విశ్వసిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన తరువాత మీడియా ప్రతినిధులు అక్కడే ఉన్నారని.. వారి కెమెరాల్లో అంతా రికార్డయ్యిందని చెప్పారు.

మరణాల సంఖ్యపై తలెత్తిన గందరగోళంపై వివరణ ఇచ్చిన ప్రదీప్ జెనా.. తొలుత రైల్వేశాఖ 288 మంది మృతి చెందినట్లు పేర్కొందని, దాన్నే తాము ప్రకటించామని చెప్పారు. అయితే బాలేశ్వర్ కలెక్టర్ ఆ సంఖ్యను 275గా ధ్రువీకరించారని తెలిపారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్లే తప్పిదం జరిగిందన్నారు. మరోవైపు రైలు ప్రమాదంలో గాయపడిన 1175 మందిలో 900 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 260మంది కటక్, బాలేశ్వర్‌, భద్రక్ సహా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

ఉచితంగా బస్సు ప్రయాణం
రైలు ప్రమాదం నేపథ్యంలో బంగాల్​ రాజధాని కోల్​కతాకు ఉచితంగా బస్సులు నడిపిస్తోంది ఒడిశా సర్కారు. రైలు సేవలు అగిన నేపథ్యంలో బంగాల్​ ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేసింది. ఆదివారం రాత్రి నాటికి పూరీ నుంచి 20, భువనేశ్వర్ నుంచి 23, కటక్ నుంచి 16 బస్సులు బంగాల్​కు పయనమయ్యాయని తెలిపింది.

Last Updated :Jun 5, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.