ETV Bharat / bharat

Neet 2021: ఆదివారమే నీట్​ పరీక్ష.. ఇవి తప్పనిసరి!

author img

By

Published : Sep 11, 2021, 5:40 PM IST

వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్​ 12న నీట్ పరీక్ష(Neet 2021) జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది.. దరఖాస్తు చేసుకున్నారు. ఆభరణాలు, బూట్లు సహా పలు వస్తువులకు అనుమతి లేదు. ఈ క్రమంలో పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఈ విషయాలు తెలుసుకోండి?

Neet 2021
నీట్ పరీక్ష

సెప్టెంబర్ 12(ఆదివారం) నీట్ పరీక్షకు(Neet 2021) సర్వం సిద్ధమైంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3 వేల 842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది.

అవి తప్పనిసరి..

నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్​టీఏ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు కచ్చితంగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు.

వాటికి అనుమతి లేదు..

మంచినీళ్ల బాటిల్, ఆహారపదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటి సీసాను అనుమతిస్తారు. ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్​లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయెత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్ టీఏ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు.

నెగెటివ్​ మార్కులు..

నీట్ పరీక్షలో(Neet 2021) ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే 180 ప్రశ్నలకే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్​టీఏ నిర్ణయించింది.

నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 83 వేల 75 ఎంబీబీఎస్, 26 వేల 949 బీడీఎస్, 52 వేల 720 ఆయుష్, 525 బీవీఎస్, ఏహెచ్, 1899 ఎయిమ్స్, 249 జిప్ మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇదీ చదవండి: 'నీట్​' కేంద్రాల మార్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.