ETV Bharat / bharat

సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్​ చేస్తున్న వాంఖడే: మంత్రి మాలిక్

author img

By

Published : Oct 26, 2021, 3:58 PM IST

ముంబయి క్రూయిజ్ నౌక డ్రగ్స్​ కేసును(mumbai drug case) విచారిస్తున్న ఎన్​సీబీ జోనల్ ఆఫీసర్​పై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి నుంచి వాంఖడే(NCB Sameer Wankhede) ) డబ్బులు డిమాండ్‌ చేసేవారన్నారు. ఈమేరకు తనకు లేఖ అందిందంటూ దాన్ని బయటపెట్టారు. ఈ అరోపణలను వాంఖడే తోసిపుచ్చారు.

Nawab Malik fires fresh salvo against NCB's Sameer Wankhede
సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్​ చేశారని వాంఖడేపై మంత్రి ఆరోపణలు

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు(mumbai drug case ) వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే(NCB Sameer Wankhede) తరఫున డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌.. ఓ సంచలన లేఖను బయటపెట్టారు. సమీర్‌ వాంఖడే బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవారని మాలిక్‌(maharashtra minister nawb malik) ఆరోపించారు.

ఈ ఉదయం నవాబ్‌ మాలిక్‌ ఇంటికి గుర్తుతెలియని ఎన్‌సీబీ సిబ్బంది పేరుతో ఓ లేఖ వచ్చింది(mumbai drug case latest news ). ఆ లేఖను మంత్రి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. సమీర్‌ వాంఖడే బాలీవుడ్‌ నటుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేయించారని ఆ లేఖలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 'ముంబయి, ఠాణెలోని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో వాంఖడే ప్రముఖ వ్యక్తులు, బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు సమాచారం అందింది. ఆయన మా ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారు. నా కుమార్తె నిలోఫర్‌ కాల్‌ డేటా రికార్డ్‌ కావాలని ముంబయి పోలీసులను అడిగారట. అయితే, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. 26 కేసుల దర్యాప్తు సమయంలో వాంఖడే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కొందరిపై తప్పుడు కేసులు బనాయించారని లేఖలో ఉంది' అని మాలిక్‌ వెల్లడించారు. ఈ లేఖను తాను సీఎం, డీజీ కార్యాలయాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వాంఖడేపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ లేఖపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. బాలీవుడ్​ను వాంఖడే కావాలనే టార్గెట్​ చేశారని మాలిక్​ ఇప్పటికే ఆరోపించారు. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'అదో పెద్ద జోక్‌'

నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలను సమీర్‌ వాంఖడే(sameer wankhede news) ఖండించారు. ఆ లేఖ పెద్ద జోక్‌, అబద్ధమని కొట్టిపారేశారు. అందులో ఉన్నదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు. మాలిక్ తనపై ఎన్ని ఆరోపణలైనా చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉందని అన్నారు. కాగా.. ఈ లేఖను దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ అశోక్‌ జైన్‌ చెప్పారు.

ఎన్​సీబీ ప్రధాన కార్యాలయానికి వాంఖడే..

తనపై ఆరోపణలు వస్తున్న సమయంలో వాంఖడే(NCB Sameer Wankhede) దిల్లీలోని ఎన్​సీబీ ప్రధాన కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడే గడిపారు. వెనుక గేటు ద్వారా కార్యాలయంలోకి వెళ్లిన ఆయన.. సీనియర్ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది.

అయితే ఎన్​సీబీ డైరెక్టర్ జనరల్​ ఎస్​ ఎన్ ప్రధాన్​ను వాంఖడే కలిశారా? లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. దేశంలోని ఎన్​సీబీ జోనల్​ ఆఫీసర్ల సమీక్ష సమావేశం జరిగిందని, అందుకే వాంఖడే ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

క్రూయిజ్ డ్రగ్స్ కేసు విజిలెన్స్ దర్యాప్తు చేపడుతున్న ఎన్​సీబీ డిప్యూటీ జనరల్​ జ్ఞానేశ్వర్​ సింగ్​.. తను ఎవరినీ దర్యాప్తు కోసం పిలవలేదని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఒకవేళ అవసరమైతే పిలుస్తానని చెప్పారు.

క్రూయిజ్‌ నౌక కేసులో(mumbai drug case news today) అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విడుదల చేయడానికి రూ.25కోట్లు డిమాండ్‌ చేశారంటూ ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆర్యన్‌ను(shahrukh khan son drug case ) విడుదల చేయడానికి రూ.25 కోట్లు ఇవ్వాలని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందంటూ ఓ ప్రైవేటు వ్యక్తి మరికొందరితో కలసి షారుక్‌ను డిమాండ్‌ చేసినట్లు ప్రభాకర్‌ ఆదివారం వెల్లడించడం సంచలనం రేపింది. దీంతో ఈ వ్యవహారంలో వాంఖడే సహా మరింకొందరిపై దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది.

ఇదీ చదవండి: పెగసస్​పై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.