ETV Bharat / bharat

TDP National Secretary Nara Lokesh Meet President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్​ భేటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 4:21 PM IST

Updated : Sep 27, 2023, 7:36 AM IST

Lokesh_Meet_President_Murmu
Lokesh_Meet_President_Murmu

16:18 September 26

చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తెచ్చిన టీడీపీ బృందం

TDP National Secretary Nara Lokesh Meet President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్​ భేటీ

TDP National Secretary Nara Lokesh Meet President Murmu: అక్రమ కేసులు, అరెస్టుతో చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తెలుగుదేశం నేతలు విన్నవించారు. జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి చంద్రబాబు తక్షణం విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు, మహిళలపై సాగుతున్న దమనకాండపైనా ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నారా లోకేశ్​ నేతృత్వంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన తెలుగుదేశం ఎంపీలు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడిపై ఏపీ-సీఐడీ పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారంటూ వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్‌ 10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత సీఐడీ కోర్టు ఆయన్ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపిందన్నారు.

చట్ట, న్యాయ నిబంధనలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ ఆయన్ను అరెస్టు చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని నివేదించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబు పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి.. రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టారని పేర్కొన్నారు. సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రపతికి వివరణ ఇచ్చారు. తక్షణం కలగజేసుకుని చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. అలాగే రాష్ట్రంలో దళితులు, ఓబీసీలపై ఎన్నడూ లేనంత దమనకాండ జరుగుతోందని, ప్రభుత్వపరంగా సాగుతున్న అరాచకాన్ని అడ్డుకోవాలని కోరారు.

Nara Lokesh Fires on CM Jagan: నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నారు.. అంగన్వాడీలపై అంత కర్కశమా?: నారా లోకేశ్

స్కిల్ వ్యవహారంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు షెల్‌ కంపెనీలకు 371 కోట్ల డబ్బు వెళ్లిందని సీఐడీ ప్రధానంగా ఆరోపిస్తోందని.. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కానీ, వాళ్ల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు కానీ అందుకు ఆధారాలేవీ చూపలేదని తెలుగుదేశం నేతలు రాష్ట్రపతికి తెలిపారు. ఈ ఆర్థిక లావాదేవీల్లో ఆయనకు, కుటుంబానికి సంబంధం ఉన్నట్లు చంద్రబాబు రిమాండ్‌ నివేదికలో కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని వివరించారు. ఎఫ్​ఐఆర్​లో తొలుత చంద్రబాబు పేరు చేర్చని అధికారులు.. అరెస్టు చేసిన తర్వాత చేర్చడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

చంద్రబాబు లాంటి ప్రజాప్రతినిధి అరెస్టుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరని.. దర్యాప్తు అధికారి మాత్రం ఎలాంటి అనుమతి కోరలేదని నివేదించారు. అందువల్ల ఆయన అరెస్టు చెల్లదన్నారు. దర్యాప్తుకు ప్రజాప్రతినిధి సహకరించకపోతేనో, సాక్షులను బెదిరిస్తేనో, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తేనో అరెస్టు చేయాల్సి ఉంటుందని.. కానీ చంద్రబాబు అలాంటివేమీ చేయలేదని గుర్తు చేశారు. అందువల్ల ఆయన అరెస్టు పూర్తిగా నిబంధనలకు విరుద్ధమన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ప్రారంభానికి టెండర్లు పిలవలేదని సీఐడీ ఆరోపిస్తోందని.. అయితే సీమెన్స్‌ లాంటి సంస్థ 90శాతం మొత్తాన్ని గ్రాంట్‌ రూపంలో పెట్టడానికి ముందుకొచ్చినప్పుడు సహజంగానే టెండర్ల అవసరం ఉండదని అన్నారు.

Nara Lokesh on IT Employees Car Rally ఐటీ ఉద్యోగుల వాట్సా​ప్ డాటా తనిఖీపై లోకేశ్ మండిపాటు.. ఉత్తర కొరియా పాలనంటూ ఆగ్రహం

నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు లేకుండానే ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్న విషయం ప్రస్తావించారు. టెండర్లు లేకపోవడం వల్ల ఇక్కడేదో అన్యాయం, అవినీతి జరిగిందనడానికి వీల్లేదన్నారు. ఈ పథకంలో ఆర్థిక అవకతవకలను కనిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిటే ప్రశ్నార్థకమన్నారు. ఆడిట్ చేసిన శరత్‌ అండ్‌ అసోసియేట్స్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల ఆడిట్‌ బాధ్యతలు చూస్తున్న ఐవీఎస్​ అండ్‌ అసోసియేట్స్‌ మధ్య పంచుకున్న ఐపీ చిరునామాలు.. ఈ ఆడిట్‌తోపాటు దాని స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఈ ఆడిట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తయారైనట్లు షేర్డ్‌ ఐపీ అడ్రస్‌ ద్వారా తెలుస్తోందన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అమల్లో పాలుపంచుకున్న డిజైన్‌ టెక్‌ కంపెనీతో సంబంధం ఉన్న కంపెనీల పన్ను ఎగవేతను.. ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదన్నారు. పన్ను చెల్లింపు బాధ్యత సంబంధిత కంపెనీలదేనని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాత్ర జీఎస్టీ నిబంధనలకు కట్టుబడటం వరకేనని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం తన పని సక్రమంగా నిర్వహించిందన్నారు. క్షేత్రస్థాయిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టేమీ లేదని సీఐడీ ఆరోపిస్తున్నా, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

6 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, 34 టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూషన్లు పనిచేస్తున్నట్లు వివరించారు. వాటి పనితీరును అభినందిస్తూ ఏపీ ప్రభుత్వ అధికారులు డిజైన్‌టెక్‌ సంస్థకు ధ్రువపత్రాలు కూడా జారీ చేసిన విషయం వినతిపత్రంలో పేర్కొన్నారు. సీమెన్స్, డిజైన్‌టెక్‌ ప్రతినిధులకు బెయిల్‌ మంజూరు చేస్తూ.. ఆ ప్రాజెక్టులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఏపీ హైకోర్టు చెప్పిన విషయాలను ప్రస్తావించారు.

TDP Leader Lokesh Fire on YCP Govt: 'సముద్ర గర్భంలో, అంతరిక్షంలో కూడా 144 సెక్షన్ అమలుచేసేలా.. వైసీపీ తీరు ఉంది': లోకేశ్

2.13 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినందుకు, 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయూతనిచ్చినందుకు అభినందించిందన్నారు. 2018, 2019 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దిల్లీ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ ర్యాంకులో నిలిచిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగం భరించలేనంత స్థాయికి చేరిందని తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని నివేదించారు. తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీలకు వ్యతిరేకంగా చేస్తున్న కక్ష సాధింపు చర్యల గురించి ఇందులో చెప్పదలచుకోలేదు కానీ, నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్న సామాన్యులపై జరుగుతున్న దమనకాండను మీ దృష్టికి తీసుకురాక తప్పదని రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

నాలుగున్నరేళ్లుగా దళితులు, ఓబీసీలు, మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని.. రాష్ట్రంలో సామాన్య ప్రజలు పడుతున్న వేదనను ఈ ఘటనలు స్పష్టం చేస్తాయని అన్నారు. కొవిడ్‌ సమయంలో మాస్కుల కొరత గురించి ప్రశ్నించిన దళిత డాక్టర్‌ సుధాకర్‌పై క్రూరంగా దాడి చేసినట్లు చెప్పారు. ఓబీసీలపై వైసీపీ నేతలు లెక్కలేనన్ని దాడులు చేశారని.. మహిళల పరిస్థితి మరింత ఆవేదనాభరితంగా ఉందని తెలియజేశారు. వారిని వేధించడంతోపాటు, దురుసుగా వ్యవహరించిన తీరుపై 770 రికార్డెడ్‌ సాక్ష్యాలు ఉన్నాయన్నారు.

Nara Lokesh Reacted on CM Jagan Bail: "జగన్​మోహన్​ రెడ్డికి​ బెయిల్​ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు"

అమరావతి రైతులు, మహిళలపై తీవ్ర అణచివేతకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు రాజ్యంగా మారిపోయిందని వివరించారు. ఈ పరిస్థితుల్లో సుమారు 1.79 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయిన ఏపీ.. దాదాపు మూడు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నాకు. అలాగే మితిమీరిన అప్పులతో దివాలా స్థాయికి చేరుకుందన్నారు. క్రమంగా ఖాయిలాపడ్డ రాష్ట్రంగా ఏపీ రూపాంతరం చెందుతోందని.. అందువల్ల తక్షణం జోక్యం చేసుకొని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరారు.

ఒకప్పుడు ధాన్యాగారంగా, దేశ వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయిందని తెలుగుదేశం నేతలు అన్నారు. చంద్రబాబు అరెస్టు ఒక్కటే కాదని.. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం దినచర్యగా మారిపోయిందని తెలియజేశారు. చంద్రబాబును అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపడమన్నది చట్టవిరుద్ధమైన చర్య అని.. ఇది చట్టబద్ధమైన న్యాయసూత్రాలను విస్మరించడం కిందే లెక్క అని గుర్తు చేశారు.

Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్​

మన న్యాయవ్యవస్థ సమగ్రతను, వ్యక్తులకున్న పౌరహక్కులను సంరక్షించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు.. న్యాయం కోసం దేశ, విదేశాల్లో రోడ్లమీదికి వస్తున్న విషయం ప్రస్తావించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతోపాటు.. యూఎస్​, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు చెప్పారు. అందువల్ల రాష్ట్రపతి జోక్యం చేసుకొని, జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి చంద్రబాబు తక్షణం విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు, మహిళలపై జరుగుతున్న దాడుల గురించి దర్యాప్తు జరిపించి, బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్‌ సమగ్రతను కాపాడటం చాలా ముఖ్యమన్న తెలుగుదేశం నేతలు.. రూల్‌ ఆఫ్​లాను కాపాడటానికి, ఈ దేశంలో న్యాయాన్ని నిలబెట్టడానికి రాష్ట్రపతి జోక్యం తక్షణావసరమని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేశానికి చేసిన సేవల గురించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తావించినట్లు తెలిసింది.

National leaders condemn Chandrababu arrest చంద్రబాబుకు మద్ధతు ప్రకటించిన పలు జాతీయపార్టీలు.. లోకేశ్​తో భేటీలో పలు కీలక అంశాలపై చర్చ

Last Updated :Sep 27, 2023, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.