ETV Bharat / bharat

మొదటి భార్యతో కలిసి రెండో భార్య హత్యకు ప్లాన్​.. పాముతో కరిపించి.. విషం ఎక్కించి..

author img

By

Published : Dec 14, 2022, 11:19 PM IST

తన మొదటి భార్య వద్దకు వెళ్లేందుకు రెండో భార్య అడ్డుగా ఉందని భావించిన ఓ వ్యక్తి ఆమెను హతమార్చేందుకు సిద్ధపడ్డాడు. పాముతో కాటు వేయించి చంపేందుకు యత్నించాడు. మరోవైపు, నాలుగు రోజులుగా తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే దాచుకున్నాడు ఓ వ్యక్తి.

murder
murder

మొదటి భార్యతో కలిసుండటానికి రెండో భార్య అడ్డుగా ఉందని భావించిన ఓ వ్యక్తి ఆ ఆమెను హతమార్చేందుకు సిద్ధపడ్డాడు. విషపూరితమైన సర్పంతో ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంది ఆ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని మందసౌర్​లో జరిగింది.

అసలేం జరిగింది: మందసౌర్​ వైడీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్యా ఖేడీ గ్రామంలో నివాసం ఉంటున్న మోజిమ్ అజ్మేరీ అనే వ్యక్తి నల్లమందు స్మగ్లింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అతని మొదటి భార్య షాను బీ తన ప్రేమికుడితో కలిసి పరారయ్యింది. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత ఇంటికి వచ్చిన మోజిమ్ 2015లో తన కుటుంబ సభ్యుల సహకారంతో హలీమా బీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియగా ఆమె తిరిగి ఇంటికి వస్తానని పట్టుబట్టింది.

తరచూ ఫోన్​ చేసి మోజిమ్​ను వేధించడం ప్రారంభించింది. దీంతో అతను ఇక తన మొదటి భార్యతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ మాట చెబితే రెండో భార్య ససేమిరా అంటుందని తెలిసిన మోజిమ్​ ఆమెను హతమార్చేందుకు స్కెచ్​ వేశాడు. తన స్నేహితులతో పాటు మొదటి భార్య షాను బీను కూడా ఈ ప్లాన్​లో భాగం చేశాడు.

ఇక ప్లాన్ చేసుకొని సరైన సమయం కోసం వేచి చూశాడు. అలా మే 8, 2022 రాత్రి, నిందితుడు మోజిమ్ స్నేక్​ క్యాచర్​ అయిన తన స్నేహితుడు రమేష్ మీనాతో కలిసి ఓ విషపూరిత పామును ఇంటికి తీసుకెళ్లాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో రెండో భార్యపై ఆ పామును విసిరాడు. అది ఆమెపై కాటు వేసింది. కొంత సేపటికి మూర్ఛపోయిన హలీమా మళ్లీ స్పృహలోకి వచ్చింది. దీంతో మరో మారు ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్న మోజిమ్ అతని సోదరుడు కాలాతో కలిసి ఉదయం హలీమాను మళ్లీ పట్టుకున్నారు. అదే సమయంలో రమేష్ మరోసారి పామును ఆమెపై వేశాడు.

అయినప్పటికీ ఆమెకు ఏమీ కాలేదు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ ముగ్గురు.. ఆమెకు విషపూరిత ఇంజెక్షన్​ను ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హలీమా స్థానికుల సహాయంతో తండ్రికి ఫోన్​ చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన హుటాహుటిన హలీమాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అజ్మీరి, అతని సోదరుడు కాలా, తల్లి సబీనాను అరెస్టు చేశారు. అయితే ​ప్రధాన నిందితుడు అయిన స్నేక్​ క్యాచర్ రమేష్ మీనా మాత్రం పరారీలో ఉన్నాడు. రమేష్​ కోసం గాలించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి నీముచ్ జిల్లా జావాద్‌లోని అతని నివాసంలో పోలీసుల చేతికి చిక్కాడు. మరోవైపు, బాధిత మహిళ తన 5 ఏళ్ల కొడుకుతో ఒంటరిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది

నాలుగురోజులుగా ఇంట్లో ఉన్న తల్లి మృతదేహం..
నాలుగు రోజులుగా ఓ తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు ఓ కొడుకు. దుర్వాసన వచ్చినప్పుడల్లా అగరబత్తీలు వెలిగించేవాడు. మంగళవారం ఉదయం ఆ దుర్వాసన మరింత ఎక్కువ కావడం వల్ల.. అనుమానించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించగా అసలు విషయం బయట పడింది.

ఇదీ జరింగింది:
స్థానికుల సమాచారం ప్రకారం ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్‌పుర్​ గుల్రిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపుర్ షాబాజ్‌గంజ్‌లో నివాసముంటున్న రామ్ దులారే మిశ్ర బోదర్‌బార్‌లోని ఒక ఇంటర్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య శాంతి దేవి కూడా గోరఖ్‌పుర్‌లోని ప్రభుత్వ ఏడీ ఇంటర్ కాలేజీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే వీరిద్దరి కొడుకు నిఖిల్​ ఓ మానసిక రోగి అని.. అతను డ్రగ్స్‌కు బానిసై తరచూ తల్లిని కొట్టేవాడని స్థానికులు తెలిపారు. అతని చేష్టలకు విసిగిపోయిన భార్య 15 రోజుల క్రితం కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది.

అయితే శాంతీ దేవిని నిఖిలే హత్య చేసుంటాడని స్థానికులు ఆరోపిస్తుండగా.. అతను మాత్రం ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని చెబుతున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథామిక పరీక్షల్లో ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని తెలిసినప్పటికీ.. రిపోర్ట్స్​ వచ్చాకే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. అయితే మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే దాచి ఉంచడం వెనుక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రెండవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి..
తోటి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ రెండవ తరగతి చదువుతున్న చిన్నారి సోమవారం మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో జరిగింది. స్కూల్‌లో సహ విద్యార్థులు దారుణంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం అటువంటిదేమీ జరగలేదని అంటున్నారు.

ప్రియుడిని చంపిన వివాహేతర సంబంధం..
ఒడిశాలోని నయాగఢ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు శైలేంద్ర జెనా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కటక్‌కు చెందిన శైలేంద్ర జెనా కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిపుర్‌కు చెందిన సునీతా సాహుతో శైలేంద్ర వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సునీత భర్త దీపు సాహు అలియాస్ గోపినాథ్‌కు ఈ విషయం తెలిసి శైలేంద్రతో గొడవపడి భార్య సునీతను నయాగర్‌కు తరలించాడు. అయినప్పటికీ వారిద్దరి మధ్య సంబంధం కొనసాగడం పట్ల విస్తుపోయిన దీపు.. మర్డర్​ ప్లాన్​ వేశాడు.

అలా డిసెంబర్ 3న శైలేంద్రను ఇంటికి పిలిపించాడు. సరైన సమయం చూసుకున్న దీపు.. అతని తండ్రి, స్నేహితుడితో పాటు శేలేంద్రను హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగులబెట్టి.. సగం కాలిన తర్వాత సమీపంలోని చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సునీతతో పాటు దీపు స్నేహితుడు సూర్యను అదుపులోకి తీసుకున్నారు. దీపుతో పాటు అతని తండ్రి పరారీలో ఉన్నారని వారిద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.