ETV Bharat / bharat

'నిఘా రాజ్యంగా మార్చటమే మోదీ లక్ష్యం'

author img

By

Published : Jul 21, 2021, 5:36 PM IST

Mamata
మమతా బెనర్జీ, పెగాసస్​

ప్రజాస్వామ్య దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పెగాసస్​ వ్యవహారాన్ని(Pegasus Spyware) సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరారు. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

దేశంలో పెగాసస్​ స్పైవేర్(Pegasus Spyware) వ్యవహారంపై​ దుమారం కొనసాగుతోంది. తాజాగా ఫోన్ల ట్యాపింగ్​ను తప్పుబడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee news). దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్​ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాగే.. 2024 లోక్​సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

కోల్​కతాలో అమరుల సంస్మరణ ర్యాలీలో వర్చువల్​గా పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు మమత.

" ప్రజాస్వామ్య దేశాన్ని సంక్షేమ రాజ్యంగా కాకుండా నిఘా రాజ్యంగా మార్చాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. చమురు, ఇతర వస్తువులపై వసూలు చేసిన పన్నులను.. సంక్షేమ పథకాలకు కాకుండా ప్రమాదకర సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి నిఘా పెట్టేందుకు ఖర్చు చేస్తోంది. నా ఫోన్​ కూడా ట్యాపింగ్​కు గురైందని తెలుసు. తమ ఫోన్లు హ్యాకింగ్​కు గురయ్యాయని విపక్ష నేతలందరికీ తెలుసు. ఈ విషయంపై ఎన్​సీపీ నేత శరద్​ పవార్​, ఇతర విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, మాపై నిఘా.. భాజపాను 2024 లోక్​సభ ఎన్నికల్లో రక్షించదు. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కొవిడ్​ రెండో దశ ఉద్ధృతిని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయటంలో విఫలమైందని ఆరోపించారు మమత. భాజపాను 'పూర్తిగా వైరస్​తో నిండిన పార్టీ'గా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.

తమ ర్యాలీలో దిల్లీ నుంచి వర్చువల్​గా హాజరైన.. కాంగ్రెస్​, ఎన్​సీపీ, ఎస్​పీ, శివసేన సహా ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు మమత.

1993లో లెఫ్ట్​ ఫ్రంట్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్​ కాంగ్రెస్​ ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపగా 13 మంది చనిపోయారు. వారికి గుర్తుగా ఏటా జులై 21న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది టీఎంసీ. ఆ సమయంలో కాంగ్రెస్​లో ఉన్నారు మమత.

ఇదీ చూడండి: Pegasus Software: ఒక్క మిస్డ్​కాల్​తో ఫోన్​ హ్యాక్​!

Pegasus Spyware : పెగాసస్​ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడి నంబర్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.