ETV Bharat / bharat

దొంగతనం చేశాడని అనుమానం.. ఇనుప రాడ్డుతో కొట్టి.. కరెంట్​ షాక్​ ఇచ్చి హత్య

author img

By

Published : Apr 13, 2023, 6:40 PM IST

man beaten to death uttarpradesh
man beaten to death uttarpradesh

దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై కిరాతకంగా ఇనుప రాడ్డులతో, బెల్టులతో దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్​ ఇచ్చి హత్య చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇనుప రాడ్డుతో చచ్చేదాగా దాడి.. కరెంట్​ షాక్​ ఇచ్చి వ్యక్తి హత్య!

దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇనుప స్తంభానికి కట్టేసి.. బెల్టులతో కొట్టి, ఇనుప రాడ్డులతో దారుణంగా దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్​ ఇచ్చి కిరాతకంగా హత్య చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​ జిల్లాలో బుధవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివం జోహ్రీ(33) అనే వ్యక్తి సర్దార్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సూరి ట్రాన్స్​పోర్ట్​ అనే కంపెనీలో​ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. శివం పనిచేస్తున్న ఆ కంపెనీలో ఏవో వస్తువులు పోయాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ యజమానులు​ నీరజ్​ గుప్తా, కన్హయ్య హోసెరీకి.. శివం జోహ్రీ మీద అనుమానం వచ్చింది. దీంతో శివం వద్ద నుంచి నిజం రాబట్టాలనుకున్న కంపెనీ ఓనర్లు.. బుధవారం బాధితుడిని.. కునాల్​ అరోరా అనే వ్యక్తి బట్టల షాప్​ వద్దకు రప్పించారు. దొంగతనంపై నిలదీశారు. అనంతరం షర్ట్​ విప్పేసి ఇనుప స్తంభానికి కట్టేశారు. బాధితుడు కొట్టొద్దని మొరపెట్టుకుంటున్నా.. కనికరం లేకుండా బెల్టులు, ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత కరెంట్​ షాక్​ ఇచ్చారు.

కొద్ది సేపటికి.. జోహ్రీ నుంచి ఉలుకు పలుకు లేకపోవడం చూసిన నిందితులు.. కట్టుకథ అల్లే ప్రయత్నం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి.. కరెంట్​ షాక్​ తగిలిందని చెప్పారు నిందితులు. దీంతో జోహ్రీని.. అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. బాధితుడి ఒంటిపై నల్లగా కమిలిన మచ్చలు ఉన్నాయి. జోహ్రీ మృతిపై అనుమానంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా​ ఐపీసీ సెక్షన్​ 302 (హత్య) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా హింసించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎక్కువ అన్నం పెట్టనందుకు వృద్ధుడి హత్య..
కర్ణాటకలో సరిపడినంత అన్నం పెట్టలేదని ఓ వృద్ధుడిని కర్రతో కొట్టి చంపాడు మరో వ్యక్తి. కలబురగి జిల్లాలోని గొబ్బరు గ్రామ శివార్లలో ఉన్న పొలాల్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సులేమన్​ అనే వృద్ధుడు రోజూలాగే తన పొలానికి వెళ్లారు. భోజన సమయం కావడం వల్ల పొలంలో ఉండే చింత చెట్టు కింద కూర్చుని తింటున్నాడు. ఇదే సమయంలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. అయితే తాను తినే దానిలో కొంచెం అన్నం తనకు పెట్టాలని సులేమాన్​ను కోరాడు. దీనికి సరేనని ఆ వ్యక్తి ఒక ప్లేట్​లో అన్నం పెట్టాడు. అది తిని తనకు మరి కొంచెం కావాలని కోరాడు. సరిపడినంత లేకపోవడం వల్ల సులేమాన్​ నిరాకరించాడు. ఇందుకు కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని దారుణంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై దేవాల్​ ఘన్​పుర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.