ETV Bharat / bharat

కేరళపై వరుణుడి పంజా- 21 మంది మృతి

author img

By

Published : Oct 17, 2021, 12:53 PM IST

Updated : Oct 17, 2021, 4:47 PM IST

భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది. పలువురు గల్లంతయ్యారు. రాష్ట్రంలో మోహరించిన 11 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.

kerala floods
కేరళను కుదిపేస్తున్న భారీ వర్షాలు

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 21 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు.

వీరిని వెతికేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణా యంత్రాంగం(కేఎస్​డీఎంఏ) సహా ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలను చేపట్టేందుకు 11 టీంలను రంగంలోకి దించింది కేంద్రం. సైన్యం కూడా ఇందులో భాగమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని రక్షించేందుకు.. హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.

Kerala floods
కేరళను కుదిపేస్తున్న వర్షాలు

ఒక్కచోటే 13 మంది..

కొట్టాయం జిల్లా కూట్టిక్కల్​లో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఒక్కచోటే 13 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇడుక్కిలో మరో 8 మంది చనిపోయారు.

భారీ వానల నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులపై రాష్ట్ర మంత్రులు కె.రాజన్​, రోషీ, వాసవన్ సమీక్ష నిర్వహించారు.

KERALA FLOODS
హెలికాప్టర్లతో ఆర్మీ

ఎర్నాకుళంలోనూ వర్షాలకు.. మువత్తుపుళా నదిలోకి నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం కూడా రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది భారత వాతావరణ శాఖ. తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకుళం సహా మొత్తం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది.

KERALA FLOODS
ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాల సహాయక చర్యలు

అండంగా కేంద్రం..

వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. బాధితుల పునరావాసం కోసం 105 శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అల్పపీడనం..

కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Last Updated : Oct 17, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.