ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

author img

By

Published : Mar 14, 2023, 10:31 PM IST

iq-air-quality-index-2023-india

అత్యధిక కాలుష్యం గల ప్రపంచ నగరాల జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2021లో భారత్​ ఐదో స్థానంలో ఉంది. స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్​ వెల్లడించిన ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

2022 సంవత్సరానికి గానూ అత్యధిక కాలుష్యం గల ప్రపంచ నగరాల జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2021తో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిదో స్థానానికి చేరినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు తొలగినట్టు కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్​ వెల్లడించిన ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో భారత్‌ ఎనిమిదో స్థానానికి చేరింది. ఈ నివేదికను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు గుర్తించిన పీఎం 2.5 స్థాయి కాలుష్య కారకం ఆధారంగా రూపొందించారు. 131 దేశాలకు చెందిన 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించారు. పీఎమ్​ 2.5 వల్ల 20 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో వాయు కాలుష్య నివారణకు అయ్యే ఆర్థిక వ్యయం 150 బిలియన్‌ డాలర్లుగా నివేదిక పేర్కొంది. రవాణా రంగం ప్రధానంగా 20 నుంచి 35 శాతం కాలుష్యాన్ని కలిగిస్తోందని తెలిపింది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, బయోమాస్ దహనం వంటివి కాలుష్యానికి ఇతర కారకాలుగా మారాయని తెలిపింది. కాలుష్యంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని హోటన్‌ నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారత్‌లోని భివండీ, దిల్లీ నగరాలు 3,4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. దిల్లీలో 92.6 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాలుష్య కారకం సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.

ప్రపంచంలో మొదటి 10 కాలుష్య నగరాల జాబితాలో 6, మొదటి 20 జాబితాలో 14, మొదటి 50 లో 39, మొదటి 100 వంద జాబితాలో 65 భారత్‌ నగరాలే ఉన్నాయి. ఇంతక ముందుతో పోలిస్తే గురుగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ నగరాల కాలుష్య స్థాయిలు తగ్గాయని నివేదిక తెలిపింది. దీర్ఘకాలిక కాలుష్య స్థాయిల వల్ల చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఊపిరితిత్తుల సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉందని వివరించింది. ఉబ్బసం, క్యాన్సర్, మధుమేహం లాంటి అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరీ ఎక్కువగా ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పేర్కొంది.

31 భారత నగరాలు కాలుష్య స్థాయి‌ల్లో రెండంకెల శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇందులో 10 ఉత్తర్‌ప్రదేశ్‌లో, 7 హరియాణాలో ఉన్నాయి. ఆగ్రాలో అత్యధికంగా 55 శాతం కాలుష్యం తగ్గింది. 2017-21 మధ్య సగటు పీఎమ్​ 2.5 85 మైక్రోగ్రాములు ఉండగా 2022లో ఇది క్యూబిక్ మీటరుకు కేవలం 38 మైక్రోగ్రాములేనని నివేదిక వెల్లడించింది. మరోవైపు, గత సంవత్సరాల సగటుతో పోలిస్తే 38 నగరాలు, పట్టణాలు కాలుష్యంలో పెరుగుదలను నమోదు చేశాయి. ఇతర మెట్రో నగరాల్లో దిల్లీ తర్వాత.. కోల్‌కతాలోనే కాలుష్యం ఎక్కువ. ఐతే ఈ రెండిటికీ మధ్య తేడా చాలా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.