ETV Bharat / bharat

స్వతంత్ర భారతావని... శతాబ్దపు ప్రజాస్వామ్య వింత!

author img

By

Published : Aug 15, 2021, 6:31 AM IST

Updated : Aug 15, 2021, 7:21 AM IST

చాలా దేశాలకు భారత్ ఓ అర్థంగాని ప్రహేళిక! కొంతమందికిదో గందరగోళం! కానీ.. కచ్చితంగా స్వతంత్ర భారతావని ఈ శతాబ్దపు ప్రజాస్వామ్య వింత.. అరుదైన ప్రజాపాలపుంత!!! స్వాతంత్య్ర ప్రకటనకు ముందు బ్రిటిష్ ప్రధాని విన్​స్టన్​ చర్చిల్ సహా యావత్ ప్రపంచం భారత్ ఎలా నిలబడుతుందా అని ఆశ్చర్యంగా చూసింది! స్వాతంత్య్రం వచ్చిన తర్వాతా ఆశ్చర్యంగానే చూస్తోంది- ఎలా నిలదొక్కుకుందా అని! నిజంగానే ఎలా సాధ్యమైంది ఈ ఎదుగుదల అని అమృతోత్సవ వేళ అవలోకిస్తే.. భారత్​ను నవజవ్వనిగా నిలబెడుతున్న ఐదు అమృత చుక్కలు కనిపిస్తాయి!

independent-india
భారత స్వాతంత్య్ర దినోత్సవం

చాలా దేశాల్లా ఒకే భాష మాట్లాడం

చాలా దేశాల్లా... ఒకే మతం అనుసరించం

చాలా దేశాల్లా... ఒకే సంస్కృతి పాటించం

చైనాలా ఉక్కుపిడికిలి లేదు...

అమెరికాలా ఆధునిక సౌకర్యాలూ లేవు..

ఐరోపాలా పారిశ్రామికాభివృద్ధీ లేదు...

అయోమయ ఆరంభం

అంతులేని విభజన గాయం...

ఆగని బ్రిటిష్ అవలక్షణాలు

అవినీతికర రాజకీయం

అడుగడుగునా కుంభకోణం

అర్థంగాని అభివృద్ధి-ఆర్థికం!

ఆవురావురుమనే ఇరుగుపొరుగు...

అయినా

నిలబడ్డాం పరిణత ప్రజాస్వామ్యంగా

కలిసుంటున్నాం వైవిధ్యంగా

ఎదుగుతున్నాం... ఒదిగి మౌనంగా

నానాటికీ బలమైన దేశంగా...

విలక్షణంగా...

75 ఏళ్ల నవజవ్వనిగా!

"స్వాతంత్య్రం ఇస్తే అధికారం కోసం భారతీయులు కొట్టుకు చస్తారు. మనం అధికారాన్ని చేతగాని దద్దమ్మలకు అప్పగిస్తున్నాం. కొన్నేళ్లలో ఇండియా అనేది పూర్తిగా కనుమరుగవుతుంది."

స్వాతంత్ర్య ప్రకటనకు ముందు అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్​స్టన్​ చర్చిల్ చేసిన వ్యాఖ్యలివి! చర్చిల్ ఒక్కడే కాదు.. యావత్ ప్రపంచం భారత్ ఎలా నిలబడుతుందా అని ఆశ్చర్యంగా చూసింది! ఇప్పుడూ ఆశ్చర్యంగానే చూస్తోంది- ఎలా నిలదొక్కుకుందా అని! నిజంగానే ఎలా సాధ్యమైంది ఈ ఎదుగుదల అని అమృతోత్సవ వేళ అవలోకిస్తే.. భారత్​ను నవజవ్వనిగా నిలబెడుతున్న ఐదు అమృత చుక్కలు కనిపిస్తాయి!

1. సమ్మిళితం-బహుళపక్షం

సుమారు 2 వేల భాషలు.. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల ప్రజలు... కులాలు, వర్గాలు.. సామాజిక అంతరాలు... ఇలా ప్రపంచంలోని వైవిధ్యమంతా ఇక్కడే ఉంది. అన్నింటినీ ఇముడ్చుకొని వెళ్లగల సామర్థ్యం భారత్ సొంతం. చరిత్రలో ఎన్ని దాడులకు గురైనా, దండయాత్రలు జరిగినా... వందల ఏళ్లపాటు విదేశీపాలనలో కొనసాగినా భారతావని కోల్పోని గుణం సమ్మిళితం! అందరినీ తనలో ఇముడ్చుకునే లక్షణం... భారత్​ను విలక్షణంగా నిలబెడుతోంది. ఎన్నో వైవిధ్యాలున్నా, ఎన్నో బహుళత్వాలున్నా అన్నింటినీ దండలో దారంలా కలిపి ఉంచుతోంది భారతీయత. వేల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న బహుళత్వంలో ఏకత్వం.. భిన్నత్వంలో ఏకత్వాలే భారత్​ను నడిపిస్తున్నాయి.

2. సామాజిక ఇంజినీరింగ్

ఆది నుంచీ విలక్షణమైన వర్ణ, కుల వ్యవస్థలుగల భారత సమాజం.. ఆధునిక కాలంలో అనుసరించిన సామాజిక ఇంజినీరింగ్ యావత్ ప్రపంచంలోనే ప్రత్యేకమైంది. వివక్ష, అణచివేత అన్ని దేశాల్లోనూ వివిధ రూపాల్లో ఉన్నా.. ఎక్కడా లేనివిధంగా వాటి పర్యవసానాలకు పరిష్కారంగా రిజర్వేషన్ల రూపంలో సమానత్వానికి బాటలు పరిచింది భారత్! సామాజిక అసమానతలను రూపుమాపే క్రమంలో.. ప్రపంచంలో కొనసాగుతున్న ఓ ప్రయోగమిది! ఐరోపాలో, అమెరికాలోనూ... బానిసత్వం వందల ఏళ్లపాటు కొనసాగినా, వివక్షలింకా కొనసాగుతున్నా ఇలాంటి ఏర్పాటు లేదు. రాజ్యాంగ సాక్షిగా.. భారత్ మాత్రం ఎవరికీ సాధ్యంకాని ఈ సామాజిక ఇంజినీరింగ్​ను కొనసాగిస్తోంది. అసమానతలకు అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తోంది. అణగారిన వర్గాలకు అవకాశాలనందిస్తోంది.

3. ప్రజల ఇంగితజ్ఞానం

చదువు తక్కువే కావొచ్చు. అక్షరాసత్యత పూర్తిగా లేకపోవచ్చు. కానీ ఏది మంచి ఏది చెడో తేల్చుకునే తెలివిడి ఈ దేశ ప్రజల బలం! అదే భారత్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఓటు వేసి అవకాశం ఇచ్చిన వారు.. పాలకులు దారి తప్పితే నేలకేసి కొట్టడానికి వెనుకాడలేదు. ఎదురులేదనుకున్న, అపరశక్తిగా అభివర్ణించిన ఇందిరాగాంధీని సైతం రాజ్​నారాయణ్ చేతిలో ఓడిపోయేలా చేసిన ఘనత ఈదేశ ప్రజలది. ఏకంగా 400కుపైగా సీట్లిచ్చిన ఈ ప్రజానీకమే... అనుకున్నట్లు పాలించకుంటే రాజీవ్ గాంధీని ఆ మరుసటి ఎన్నికల్లో దించేసింది! పాలకులు, రాజకీయ నాయకులెంత తమ ఎత్తులుజిత్తుల్లో ఆరితేరినా.. ఎన్నికలంటే భయపడుతున్నారంటే కారణం సగటు భారతీయుడి ఇంగితజ్ఞానమే! ఆ బలమే... మన దేశాన్ని పరిణత ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దుతోంది.

4. మహాబజార్..

భారమనుకున్న జనాభాయే భారత్​కు ఆర్థిక బలం. ఆదిలో ఎలా ఉన్నా.. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచీకరణలో 130 కోట్ల భారత జనాభా.. వారి కొనుగోలు శక్తి.. మన ఆర్థికానికి వెన్నుదన్నుగా మారింది! ప్రపంచ పరిశ్రమలకూ, వారి అమ్మకాలకూ భారత్ ఓ ఆకర్షణీయమైన మార్కెట్​గా ఆవిర్భవించింది. 1992లో పీవీ నరసింహారావు హయాంలో వచ్చిన సంస్కరణలు... భారత్​కు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టాయి. అప్పటిదాకా ఐదులోపున్న భారత వృద్ధిరేటును రెండంకెల దిశగా పరుగులెత్తించాయి. అంతేగాకుండా... లైసెన్స్ రాజ్ రద్దుతో దేశీయంగానూ పారిశ్రామికరంగం ఉరకలెత్తింది. దీనికి తోడు అంతఃపురకాంతలాంటి మన అసంఘటిత రంగం ఆర్థికాన్ని నిలబెడుతోంది. మన ఆర్థికవ్యవస్థలో 80శాతం భాగస్వామ్యం అసంఘటిత రంగానిదే! వ్యవసాయం కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. వాతావరణం మనకు ప్రకృతిచ్చిన వరం! చాలా దేశాల్లో మనలా మూడుకాలాలూ, రాత్రీపగలూ సమంగాసాగే అవకాశం ఉండదు.

5. రాజ్యాంగం

ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః.. (విశ్వపు అన్ని మూలల నుంచీ గాలి ప్రసరించనీ) అన్నట్లు... ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్లోని మంచినంతా రంగరించి రూపొందించిన రాజ్యాంగం భారతదేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేసింది. ప్రజల హక్కులను నిలబెడుతూ, వ్యవస్థల్ని కాపాడుతూ ఎవరిపై ఎవరు పెత్తనం చేయకుండా.. ఒకరి పనితీరును మరొకరు సమీక్షిస్తూ, సహకరిస్తూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సరంజామా అంతా రాజ్యాంగంలో ఉంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సవరణలు చేసుకుంటున్నా.. మౌలిక భావనలు అలాగే ఉండి దేశాన్ని నడిపిస్తున్నాయి. పక్కనున్న దాయాది పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం చేతిలో కీలుబొమ్మ కాకుండా.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా కాపాడుతున్న ఘనత రాజ్యాంగానిదే!

ప్రజా పాలపుంత..

అలాగని అంతా అద్భుతంగా ఉందనికాదు.. భువిపై ఇది స్వర్గమనీ కాదు. అగ్రదేశాల మాదిరిగానే.. పేదరికాన్ని జయించేందుకు, వివక్షను అంతమొందించేందుకు నిరుద్యోగాన్ని నీరుగార్చేందుకు ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. భారత్ తర్వాత స్వాతంత్ర్యం వచ్చి.. భారత్​ కంటే వేగంగా దూసుకుపోతున్న దేశాలు లేకపోలేదు. కానీ.. భారత్​లోని 'పరిస్థితులు', భారత్ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యల్ని మరేదైనా దేశం తట్టుకొని ఉంటే ఇలా ఎదిగేదా? అంటే సమాధానం చెప్పటం కష్టమే!

అందుకే చాలా దేశాలకు భారత్ ఓ అర్థంగాని ప్రహేళిక! కొంతమందికిదో గందరగోళం! కానీ.. కచ్చితంగా స్వతంత్ర భారతావని ఈ శతాబ్దపు ప్రజాస్వామ్య వింత.. అరుదైన ప్రజాపాలపుంత!!!

ఇవీ చదవండి: రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వాతంత్ర్యం

స్వాతంత్య్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన నేతాజీ

Last Updated : Aug 15, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.