ETV Bharat / bharat

అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

author img

By

Published : Mar 23, 2023, 1:21 PM IST

Updated : Mar 23, 2023, 8:10 PM IST

Police
Police

Police Arrested Personal Data Selling Gang: ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా ఏకంగా 16.8 కోట్ల మంది దేశ పౌరుల వ్యక్తిగత డేటా చోరీ జరిగింది. డేటా చౌర్యానికి సంబంధించి ఆరుగరు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన డేటాలో 3 కోట్ల చరవాణుల నంబర్లతో పాటు 140 రంగాలకు చెందిన వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగుల కీలక సమాచారం తస్కరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైనిక విభాగాలకు చెందిన అధికారుల డేటాను అక్రమార్కులు సైబర్‌క్రైం నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. జాతీయ భద్రతకే ఈ ఘటన పెను ముప్పుగా పరిణమించింది.

Personal Data Selling Gang Arrested: దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ చేస్తూ.. సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్న కేటుగాళ్ల ముఠా సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కింది. ఇప్పటికే ఈ ముఠా దేశంలో 16.8 కోట్ల మందికి చెందిన పాన్‌, ప్రభుత్వ ఉద్యోగుల డేటా, పలు బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా చోరీ చేసినట్టు తేలింది. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠా పోలీసులకు పట్టుబడింది. నాగ్‌పూర్‌,దిల్లీ, ముంబయికి చెందిన వారు ఈ ముఠా సభ్యులుగా ఉన్నారు. జస్ట్‌ డయిల్‌ ద్వారా ఈ డేటా అక్రమార్కులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో కుమార్‌ నితీష్‌ భూషన్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. కుమార్‌ పూజా పాల్‌, సుశీల్‌ తోమర్‌, అతుల్‌ ప్రతాప్‌ సింగ్‌, ముస్కాన్‌ హసన్‌, సందీప్‌పాల్‌ కలిసి డేటా మార్ట్‌ ఇన్‌ఫోటెక్‌, గ్లోబల్‌ డేటా ఆర్ట్స్‌, ఎం.ఎస్‌ డిజిటల్‌ గ్రో సంస్థలు ఏర్పాటు చేసి కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏకంగా మూడు కోట్ల మంది చరవాణుల నంబర్ల డేటా బేస్‌ నిందితుల వద్ద లభ్యమైంది. ఈ ముఠా.. సమాచారం మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు బయటపడిందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

కీలక వ్యక్తిగత సమాచారం ద్వారా సైబర్‌ నేరస్తులు నేరాలకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యుల అనుచరులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం చౌర్యం చేసిన ముఠా 50వేల మంది సమాచారాన్ని ఐదు వేలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. డేటా అసాంఘిక శక్తుల చేతిలోకి వెళితే దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందన్నారు

డేటా చోటీ, సైనికాధికారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయనున్నారు. అనేక కోణాలున్న ఈ కేసు దర్యాప్తు కోసం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ కల్మేశ్మర్‌ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది.

"దేశవ్యాప్తంగా 16.8కోట్ల మంది డేటా చోరీ చేశారు. బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసిన వారి డేటా చోరీ చేశారు. ఫేస్‌బుక్ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా చోరీ చేశారు. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల కీలక డేటా అమ్మకానికి పెట్టారు.కీలక డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. కీలక డేటా అమ్మకం దేశ భద్రతకు ముప్పు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. మహిళల వ్యక్తిగత డేటా సైతం అమ్ముతున్నారు. నిందితుల్లో క్రెడిట్ కార్డుల జారీ ఏజెన్సీ ఉద్యోగి. జస్ట్ డయల్‌ సంస్థపై కూడా కేసులు పెడతాం"- స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ఇవీ చదవండి: 15 నెలల చిన్నారి అనుమానస్పదంగా మృతి.. నానమ్మే చంపిందా?

నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి.. బ్రేకులు ఫెయిలై..

Last Updated :Mar 23, 2023, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.