ETV Bharat / bharat

నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి.. బ్రేకులు ఫెయిలై..

author img

By

Published : Mar 23, 2023, 12:30 PM IST

Updated : Mar 23, 2023, 1:51 PM IST

బస్సు బ్రేకులు ఫెయిలై, నిద్రపోతున్న తీర్థ యాత్రికులపైకి దూసుకెళ్లడం వల్ల ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్​ చంపావత్ జిల్లాలోని పూర్ణగిరిలో జరిగిందీ ఘోర ప్రమాదం. మరోవైపు, ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైద్య దంపతులు మరణించారు.

Uttarakhand road accident
Uttarakhand road accident

ఉత్తరాఖండ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్ జిల్లా పూర్ణగిరిలో గురువారం ఉదయం జరిగిందీ ఘటన.
ఉత్తరాది రాష్ట్రాల్లో బుధవారం ఛైత్ర నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్​లో పేరుగాంచిన​ పూర్ణగిరి మేళాకు ఉత్తర్​ప్రదేశ్ నుంచి కొందరు భక్తులు వచ్చారు. పూర్ణగిరిలోని ఓ బస్టాండ్​ వద్ద రాత్రి నిద్రపోయారు. అయితే.. ఓ బస్సు రూపంలో మృత్యువు వారిపైకి దూసుకొచ్చింది. ఏం జరిగిందో తెలిసేలోపే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని తనక్​పుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దీంతో పూర్ణగిరిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారందరూ ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్రైచ్​ జిల్లాకు చెందినవారని వెల్లడించారు.

"మృతులందరూ ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవారు. వారు పూర్ణగిరి మేళాకు వెళ్లేందుకు బస్టాండ్​లో ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమని భావిస్తున్నాం. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తాం. క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించాం. పరిస్థితి విషమించినవారికి వేరే ఆస్పత్రుకి వైద్యులు సిఫార్సు చేశారు."

--పోలీసులు

వైద్య దంపతులు మృతి..
మహారాష్ట్ర చంద్రాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో వైద్య దంపతులు మృతి చెందారు. వరోరా-వానీ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. మృతులను అతుల్ గౌర్కర్, అశ్విని గౌర్కర్‌గా పోలీసులు గుర్తించారు.

'ఎదురుగా వస్తున్న ట్రక్కును వైద్య దంపతులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త అతుల్​ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాశ విడిచారు.' అని పోలీసులు తెలిపారు.

జిల్లా జడ్జిని ఢీకొట్టిన బైక్​..
మహారాష్ట్రలోని కొల్హపుర్​ రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంతో ఓ వ్యక్తి జిల్లా జడ్జిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో జడ్జికి తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సపోర్టుతో జడ్జికి వైద్యం చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అనిల్ జాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బైకర్ అనిల్​కు కూడా గాయాలయ్యాయని చెప్పారు.

Last Updated : Mar 23, 2023, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.