'కొవిడ్​తో జర భద్రం'.. కేంద్రం సూచన.. మళ్లీ మాస్కులు మస్ట్?

author img

By

Published : Dec 21, 2022, 2:31 PM IST

Updated : Dec 21, 2022, 3:27 PM IST

health Minister Mansukh Mandaviya

కొవిడ్​ దశ ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కొవిడ్​ ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉంటూ నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరికీ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మాండవీయ నేతృత్వంలో బుధవారం దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఐసీఎంఆర్‌, ఆయుష్‌, ఔషధ, బయో టెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

"కొన్ని దేశాల్లో పెరుగుతున్న కొవిడ్-19 కేసుల దృష్ట్యా, నిపుణులు, అధికారులతో ఈరోజు పరిస్థితిని సమీక్షించాం. కొవిడ్ దశ ఇంకా ముగియలేదు. అప్రమత్తంగా ఉండి.. నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరినీ ఆదేశించాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని కేంద్ర ఆరోగ్య మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ముందస్తు చర్యలు ద్వారా కొత్త వేరియంట్​లను గుర్తించి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉత్పన్నమవుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్లపై అధికారులు సమీక్షలో చర్చించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు రూపొందించే అవకాశముంది. పలుదేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. వైరస్‌ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి పాజిటివ్‌ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్‌ కోవ్‌-2 జినోమిక్స్‌ కన్సార్టియం పరీక్షా కేంద్రాలకు పంపించాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. క్రియాశీల కేసులు 4వేల దిగువనే ఉన్నాయి.

అమెరికాలో 10కోట్లు..
చైనా సహా జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10కోట్లు దాటింది. 2020 ప్రారంభంలో అమెరికాలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు అమెరికాలో 10,88,236 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టింది.

మాస్కులు, బూస్టర్ మస్ట్!
మరోవైపు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని ఈ సమావేశంలో పాల్గొన్న నీతీ ఆయోగ్‌ సభ్యులు వీకేపాల్‌ ప్రజలకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించాలని సూచనలు వచ్చినా.. ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని వీకే పాల్‌ తెలిపారు. ప్రజలంతా బూస్టర్ డోసు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వృద్ధులు తప్పనిసరిగా అదనపు టీకా వేయించుకోవాలని కోరారు. ఇప్పటివరకు 27-28శాతం ప్రజలు మాత్రమే బూస్టర్లు తీసుకున్నారని చెప్పారు.

'ఆందోళకరమే.. అయినా..'
చైనాలో కరోనా కేసులు పెరగడం ఆందోళనకరమని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. అయితే, భారత ప్రజలు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. భారత్​లో టీకా కవరేజీ మెరుగ్గా ఉందని.. కరోనాను దేశం ఎదుర్కొన్న తీరు కూడా భవిష్యత్​లో ఉపయోగపడుతుందని అన్నారు. భారత ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను తప్పక పాటించాలని ప్రజలకు సూచించారు.

Last Updated :Dec 21, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.