ETV Bharat / bharat

జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు.. శివలింగం కార్బన్​ డేటింగ్​కు కోర్టు నో!

author img

By

Published : Oct 14, 2022, 2:56 PM IST

Updated : Oct 14, 2022, 3:30 PM IST

Gyanvapi mosque case
జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Case: జ్ఞాన్​వాపి మసీదులో లభ్యమైన శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను వారాణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. అయితే.. కోర్టు తీర్పుపై హైకోర్టు వెళ్లేందుకు తమకు అవకాశం ఉందని న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

Gyanvapi Mosque Case: ఉత్తర్​ప్రదేశ్​ వారాణాసి జ్ఞాన్​వాపి మసీదు కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మసీదులో లభ్యమైన శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను వారాణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన వారణాసి జిల్లా కోర్టు శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. 'వజుఖానా' ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తు చేసింది.

మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా 'వజుఖానా' సమీపంలోని ప్రాంగణంలో 'శివలింగం' కనిపించిందని హిందూ పక్షం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దొరికింది శివలింగం కాదని.. ఫౌంటెన్ అని ముస్లిం వర్గం వాదించింది. ఈ పరిస్థితుల్లో శివలింగంపై కార్బన్ డేటింగ్ జరిపించాలని సెప్టెంబర్ 22న హిందూ పక్షం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని తాజాగా వారణాసి కోర్టు తోసిపుచ్చింది.

"శివలింగానికి కార్బన్ డేటింగ్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను వారణాసి కోర్టు తిరస్కరించింది. మేము ఆర్డర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం. మా అభిప్రాయాన్ని హైకోర్టు ముందు ఉంచుతాం."

--మదన్ మోహన్ యాదవ్, న్యాయవాది

అంతకుముందు జ్ఞాన్​వాపి మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను.. వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్​ జడ్జ్​ సీనియర్​ డివిజన్​ నుంచి కేసును వారణాసి జిల్లా​ జడ్జికి బదిలీ చేసినట్లు జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

Gyanvapi Shivling found : జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో మే 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్​కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక నిర్ణయం

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

Last Updated :Oct 14, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.