ETV Bharat / bharat

జోషీమఠ్‌పై సర్కార్​ గప్‌చుప్‌.. వెబ్​సైట్​లో సమాచారంపై ఆంక్షలు.. కాంగ్రెస్​ ఫైర్​!

author img

By

Published : Jan 15, 2023, 7:22 AM IST

Etv governament-ban-national-remote-sensing-centre-report-on-joshimath
జోషీమఠ్ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నివేదిక

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు 'నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌' (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వెల్లడించిన నివేదిక సంబంధిత వెబ్‌సైట్‌లో ఇప్పుడు కనిపించడంలేదు. జోషీమఠ్‌పై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించవద్దంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గందరగోళం నివారణకే ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్‌డీఎంయే చెబుతున్నా.. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు 'నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌' (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వెల్లడించిన నివేదిక సంబంధిత వెబ్‌సైట్‌లో ఇప్పుడు కనిపించడంలేదు. జోషీమఠ్‌లో కొంతకాలంగా భూమి వేగంగా కుంగిపోతోందని ఇస్రోకు చెందిన ఈ కేంద్రం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెం.మీ మేర కుంగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి.. ఉపగ్రహ చిత్రాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన తరుణంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆ నివేదిక కనిపించకుండా పోయింది. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు తెలుస్తోంది.

ఆంక్షలు ఎందుకంటే..
ప్రజలు, మీడియా సొంత కోణంలో వివరణలు ఇస్తుండటం జోషీమఠ్‌తోపాటు దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంయే) పేర్కొంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని మీడియాతో గానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ పంచుకోవద్దని, తగిన అనుమతి తీసుకోకుండా అనధికారికంగా వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వ విభాగాలకు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వమూ ఇదే మాట చెబుతోంది.

హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ సహా డజనుకుపైగా సంస్థలకు, వాటిలోని నిపుణులకు ఈ మేరకు ప్రత్యేక సూచన పంపించింది. "సమాచారం అందకుండా చేయాలనేది మా ఉద్దేశం కానేకాదు. పరిస్థితిపై ఎవరికివారు భాష్యం చెబుతుండడంతో ఎదురయ్యే అయోమయాన్ని తొలగించడానికే ఈ ప్రయత్నం" అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వాదనను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. సమస్యను పరిష్కరించేబదులు సమాచార స్రవంతిపై ఆంక్షలు విధించడమేమిటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విటర్లో ప్రశ్నించారు. "ఉపగ్రహ చిత్రాలు అబద్ధం చెబుతాయా? ఇదో నవ భారతం. ఒక్కవ్యక్తికే అన్నీ తెలుస్తాయి. ఎవరు దేనిపై మాట్లాడాలో ఆయనే నిర్ణయిస్తారు" అని పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సెలాంగ్‌లోనూ కుంగుతున్న భూమి..
జోషీమఠ్‌కు సమీపంలోని సెలాంగ్‌లోనూ భూమి కుంగుతోంది. అక్కడ కొంతకాలం నుంచి ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఎన్టీపీసీ జల విద్యుత్కేంద్రం, సొరంగమార్గాల నిర్మాణమే తమ దుస్థితికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. పదేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో భాగంగా ఇప్పటికీ పేలుళ్లు కొనసాగిస్తున్నారనీ, గతంలో తమ నిరసనల తర్వాత ఇళ్లకు ఎన్టీపీసీ సంస్థే బీమా చేయించినా పరిహారం మాత్రం ఇప్పుడు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.