ETV Bharat / bharat

గోవా ఎన్నికల్లో 'శివసేన-ఎన్సీపీ' పొత్తు.. కాంగ్రెస్​పై సెటైర్లు!

author img

By

Published : Jan 19, 2022, 5:15 PM IST

Updated : Jan 19, 2022, 6:42 PM IST

Shiv Sena, NCP announces alliance in Goa
గోవా ఎన్నికల్లో 'శివసేన-ఎన్సీపీ' పొత్తు

Goa assembly election 2022: గోవా శాసనసభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి శివసేన, ఎన్సీపీ. అయితే.. మహారాష్ట్రలో మిత్రపక్షమైన కాంగ్రెస్​ లేకుండానే ఈ రెండు పార్టీలు కొత్త కూటమి ఏర్పాటు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Goa assembly election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశారు ఇరు పార్టీల నేతలు. మహారాష్ట్రలో అధికార మహావికాస్​ అఘాడీలో భాగమైన ఇరుపార్టీలు.. కాంగ్రెస్​ లేకుండానే కూటమిగా ముందుకు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోవా రాజధాని పనాజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కూటమిపై ప్రకటన చేశారు ఎన్​సీపీ నేతలు ప్రఫుల్​ పటేల్​, జితేంద్ర అవ్హాద్​, శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై కీలక వ్యాఖ్యలు చేశారు రౌత్​.

'మాతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్​ దురదృష్టం. రానున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-ఎన్సీపీ కూటమి బలాన్ని చూపిస్తాం. మా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ పెద్దు కుమారుడు ఉత్పల్​ పారికర్​ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాము.'

- సంజయ్​ రౌత్​, శివసేన నేత

గోవాలో శివసేన 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇరు పార్టీల నేతలు చర్చించి సీట్ల కేటాయింపునకు తుది రూపును ఇవ్వనున్నారని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్​ లేకపోవటానికి కారణమేంటి?

ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన- కాంగ్రెస్​ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే భాజపా బలంగా ఉండే స్థానాలను శివసేనకు కాంగ్రెస్​ ఆఫర్​ చేసినట్లు సమాచారం. దీంతో శివసేన.. కాంగ్రెస్​తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ తరహాలో గోవా సర్కారును ఏర్పాటు చేయాలంటే.. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని ఈ సందర్భంగా శివసేన అడగ్గా.. అందుకు కాంగ్రెస్​ నిరాకరించిందనే వాదన వినిపిస్తోంది. అందుకే శివసేన నేతలు కాంగ్రెస్​ పట్ల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ లేకుండా శివసేన-ఎన్సీపీ రాజకీయం.. అసలేమైంది?

Last Updated :Jan 19, 2022, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.